టీడీపీకి గుడ్ న్యూస్-18న ఎన్డీయే భేటీకి ఆహ్వానం ? పొత్తు దిశగా మరో అడుగు..
దేశవ్యాప్తంగా బీజేపీకి వ్యతిరేకంగా విపక్షాలు ఏకమవుతున్న వేళ కొత్త మిత్రుల్ని వెతుక్కునే పనిలో ఎన్డీయే నిమగ్నమై ఉంది. అలాగే గతంలో ఎన్డీయేలో భాగస్వాములుగా ఉంటూ ఆ తర్వాత దూరమైన టీడీపీ, అకాలీదళ్, లోక్ జన్ శక్తి పార్టీ వంటి పార్టీలకు కూడా తిరిగి కూటమిలోకి రావాలని ఆహ్వానాలు పంపుతోంది. ఇందుకు ఈ నెల 18న జరిగే ఎన్డీయే భేటీని వేదికగా మలచుకునే ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ నెల 18న ఢిల్లీలోని అశోకా హోటల్ వేదికగా ఎన్డీయే పక్షాల భేటీ జరగబోతోంది. 2014లో ఎన్డీయే అధికారంలోకి వచ్చిన తర్వాత విపక్షాల్ని లెక్కచేయకపోవడంతో అవి ఒక్కొక్కటిగా దూరమయ్యాయి. ముఖ్యంగా 2014లో బీజేపీతో కలిసి కేంద్ర, రాష్ట్రాల్లో గెలిచి అధికారం పంచుకున్న టీడీపీ వంటి పక్షాలు దూరమయ్యాయి. అంతే కాదు 2018 నాటికి బీజేపీపై టీడీపీ ధర్మపోరాటం చేసే పరిస్దితికి వచ్చింది. అయితే బీజేపీకి కేంద్రంలో ప్రత్యామ్నాయం లేకపోవడంతో టీడీపీ చేసిన ధర్మపోరాటం విఫలమైంది. కానీ ఇప్పుడు పరిస్దితి అలా లేదు.

ఇప్పటికే పాట్నాలో విపక్షాలు భేటీని నిర్వహించాయి. ఇందులో ఏ పార్టీ ఎక్కడ బలంగా ఉంటే అక్కడ ఇతర పార్టీలు మద్దతివ్వాలని నిర్ణయించాయి. ముఖ్యంగా బీజేపీ అభ్యర్ధులకు పోటీగా విపక్షాల తరఫున ఒకే అభ్యర్ధి ఉండేలా ప్లాన్ చేశాయి. దీంతో అప్రమత్తమైన బీజేపీ ఈ నెల 18న తిరిగి పాత మిత్రుల్ని కలుపుకుని ఓ భేటీకి ప్లాన్ చేసింది. తిరిగి వారిని ఎన్డీయేలోకి రప్పించడంతో పాటు బీజేపీ తరఫున కూడా సంస్ధాగతంగా పలు మార్పులు చేసుకుంటోంది. అలాగే రెండు, మూడు రోజుల్లో మోడీ కేంద్ర కేబినెట్ విస్తరణ కూడా చేపట్టనున్నారు.
ఇప్పటికే తెలుగు రాష్ట్రాలతో పాటు పలు రాష్ట్రాల్లో అధ్యక్షుల్ని మార్చిన బీజేపీ.. జాతీయ కార్యవర్గంలోనూ పలు మార్పులు చేస్తోంది. అలాగే ప్రతిపక్షాల ఐక్యతకు విరుగుడుగా 18న ఎన్జీయే బలప్రదర్శన నిర్వహించాలని నిర్ణయించింది.
లోక్ సభ ఎన్నికలు, పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని వ్యూహాత్మకంగా ముందుకు కదులుతున్న బిజెపి పెద్దలు..ఈ భేటీ ఏర్పాటు చేశారు. ఈ భేటీకి టీడీపీకి కూడా అహ్వానం రావడంతో ఆ పార్టీ హాజరైతే ఎన్డీయేలో తిరిగి చేరేందుకు మార్గం సుగమం అవుతుందని భావిస్తున్నారు. అదే జరిగితే చంద్రబాబు నాలుగేళ్ల కల వాస్తవ రూపం దాలుస్తుంది.












Click it and Unblock the Notifications