బీజేపీ షరతులు, సీట్లకు చంద్రబాబు ఓకే - ఎన్డీఏలో చేరిక ముహూర్తం ఫిక్స్..!?
ఏపీ రాజకీయాల్లో మరో కీలక మలుపు. 2014 పొత్తుల రిపీట్ దాదాపు ఖాయం అవుతున్నాయి. టీడీపీ, జనసేనతో బీజేపీ కలవటం పైన క్రమేణా స్పష్టత వస్తోంది. ఇరవై రోజులుగా ఈ అంశం పైన భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. అయితే, ఎన్నికల షెడ్యూల్ త్వరలో విడుదల కానుండటంత ఇప్పుడు నిర్ణయం దిశగా అడుగులు పడుతున్నాయి. బీజేపీ షరతులతో పాటుగా కోరిన విధంగా సీట్లు ఇచ్చేందుకు చంద్రబాబు అంగకరించారని సమాచారం. దీంతో ఎన్డీఏలో చేరేందుకు ముహూర్తం దాదాపు ఖరారైంది.
మారుతున్న లెక్కలు:ఏపీలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. తిరిగి టీడీపీ ఎన్డీఏలోకి చేరేందుకు రంగం సిద్దమవుతోంది. జగన్ ఓటమి లక్ష్యంగా చంద్రబాబు, పవన్ చేతులు కలిపారు. తమతో కలిసి రావాలని బీజేపీ కోరుతూ వస్తున్నారు. ఈ నెల 7న టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీలో కేంద్రం హోం మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. దీంతో..బీజేపీ తో పొత్తు దిశగా చర్చలు జరిగాయి. ఇక టీడీపీ ఎన్డీఏ చేరుతుందనే ప్రచారం సాగింది. కానీ, 20 రోజులుగా ఈ అంశంలో ఎలాంటి కదలిక లేదు. సీట్ల పైన చర్చలు జరుగుతుండటంతో నిర్ణయం తీసుకోలేదని చెబుతున్నారు. బీజేపీ నుంచి 8-10 ఎంపీ 20 అసెంబ్లీ సీట్లు కోరటంతో చంద్రబాబు ఆలోచనలో పడ్డారు. అయితే, తాజాగా చంద్రబాబు ను బీజేపీకి కీలక ప్రతిపాదన అందినట్లు తెలుస్తోంది.

బీజేపీకి సీట్ల ఖరారు:బీజేపీ కోరినట్లుగా సీట్లు, ప్రభుత్వంలో భాగస్వామ్యం పైన చంద్రబాబు అంగీకరించినట్లు సమాచారం. బీజేపీ కోరుతున్న 8 ఎంపీ సీట్లు ఇచ్చేందుకు చంద్రబాబు సిద్దమయ్యారని తెలుస్తోంది. 12-15 అసెంబ్లీ స్థానాలు బీజేపీకి కేటాయించనున్నట్లు చెబుతున్నారు. బీజేపీ కోరిన విధంగా విశాఖ, రాజమహేంద్రవరం, నర్సాపురం, విశాఖ, ఏలూరు, తిరుపతి, రాజంపేట, హిందూపురం ఎంపీ స్థానాలు ఇచ్చేందుకు చంద్రబాబు అంగీకరించినట్లు విశ్వసనీయ సమాచారం. అసెంబ్లీ స్థానాల్లో విశాఖ నార్త్, తాడేపల్లిగూడెం, కైకలూరు, గుంటూరు పశ్చిమం, జమ్మలమడుగు, ధర్మవరం, రాజమండ్రి సిటీ, నెల్లూరు, అనంతపురం జిల్లాలో ఒక స్థానం ఇచ్చేందుకు ప్రాధమికంగా నిర్ణయం జరిగినట్లు సమాచారం. అసెంబ్లీ స్థానాల్లో స్థానిక నాయకత్వంతో చర్చలతో సర్దబాట్లు జరగనున్నాయి. ఎంపీ స్థానాల విషయంలో మాత్రం బీజేపీ కేంద్రం నాయకత్వం
పట్టుబట్టటంతో చంద్రబాబు ఆమోదం తెలిపారని సమాచారం.
ఎన్టీఏలోకి రీ ఎంట్రీ:మార్చి 5న టీడీపీ అధికారికంగా ఎన్డీఏ లో చేరటానికి ముహూర్తంగా నిర్ణయించారని తెలుస్తోంది. మార్చి రెండో వారంలో ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుంది. దీంతో..తొలి వారంలోనే ఎన్డీఏలో చేరిక...సీట్ల పైన ప్రకటన చేయటం ద్వారా ఇక ఎన్నికల ప్రచారం ప్రారంభించాలని నిర్ణయించారు. ఇప్పటికే ప్రకటించిన సీట్లలోనూ స్వల్ప మార్పులు చోటు చేసుకొనే అవకాశం కనిపిస్తోంది. 8 ఎంపీ సీట్లు..అందునా టీడీపీ బలంగా ఉన్న నియోజకవర్గాలను బీజేపీకి కేటాయిస్తున్నారనే సమాచారంలో టీడీపీ సీనియర్లలో టెన్షన్ మొదలైంది. బీజేపీ 4-5 సీట్ల వరకే కేటాయించే అవకాశం ఉందని టీడీపీ నేతలు భావించారు. ఇక, బీజేపీకి సీట్ల కేటాయింపు..ఎన్డీఏలో చేరిక పైన ఒకటి రెండు రోజుల్లోనే అధికారికంగా ప్రకటన వెలువడే అవకాశం కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications