వెన్నుపోటు ఎమ్మెల్సీలు ఇంకెవరైనా ఉన్నారా? యనమలకు చంద్రబాబు ఫోన్: షోకాజ్ రెడీ.. !
అమరావతి: శాసన మండలిలో తెలుగుదేశ: పార్టీకి షాక్ ఇచ్చిన ఇద్దరు సభ్యులపై వేటు వేయడానికి రంగం సిద్ధమౌతోంది. సమావేశాలు ముగిసిన వెంటనే వారికి షోకాజ్ నోటీసులను జారీ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. పార్టీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ఏపీ వికేంద్రీకరణ బిల్లుపై చర్చించడానికి ఉద్దేశించిన రూల్ 71పై తెలుగుదేశం సభాపక్ష నేత యనమల రామకృష్ణుడు ప్రవేశపెట్టిన తీర్మానంపై అదే పార్టీకి చెందిన ఎమ్మెల్సీలు పోతుల సునీత, చదిపిరాళ్ల శివనాథ్ రెడ్డి వ్యతిరేకంగా ఓటు వేశారు.
చంద్రబాబు ఆదేశాలను ధిక్కరించి..
ఏపీ వికేంద్రీకరణకు సంబంధించిన ఎలాంటి బిల్లయినా శాసన మండలి సమక్షానికి వస్తే.. వాటిని వ్యతిరేకించి తీరాలంటూ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇదివరకే తమ ఎమ్మెల్సీలను కఠినంగా ఆదేశించారు. దీన్ని ఉల్లంఘిస్తే చర్యలు తప్పవనీ ఆయన హెచ్చరించారు. అలాంటి పరిస్థితుల్లో కూడా పోతుల సునీత, శివనాథ్ రెడ్డి ఆయన ఆదేశాలను ధిక్కరించారు. రూల్ 71పై ప్రవేశపెట్టిన తీర్మానానికి వ్యతిరేకంగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఓటు వేశారు.
అలాంటి వారెవరైనా ఉన్నారా?
పార్టీలో ఉంటూ వైఎస్ఆర్సీపీకి అనకూలంగా ఓటు వేసే ఎమ్మెల్సీలు ఇంకా ఎవరైనా ఉన్నారా? అనే అంశంపై చంద్రబాబు నాయుడు ఆరా తీస్తున్నారు. దీనిపై ఆయన యనమల రామకృష్ణుడికి ఫోన్ చేసినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా- పోతుల సునీత, శివనాథ్ రెడ్డిలకు షోకాజ్ నోటీసులను కూడా జారీ చేయాలని సూచించినట్లు చెబుతున్నారు. సమావేశాలు ప్రారంభానికి ముందే డొక్కా మాణిక్య వరప్రసాద్ రాజీనామా చేశారు. ఆయన ఒక్కరితో పోయిందేమీ లేదనుకున్న కొన్ని గంటల వ్యవధిలోనే పోతుల సునీత, శివనాథ్ రెడ్డి.. పార్టీ అగ్ర నాయకత్వానికి షాక్ ఇచ్చారు.
యనమల, నారా లోకేష్ సమక్షంలోనే..
సీనియర్ నేత యనమల రామకృష్ణుడు, మాజీమంత్రి నారా లోకేష్ సమక్షంలోనే పోతుల సునీత, శివనాథ్ రెడ్డి వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఓటు వేయడాన్ని జీర్ణించుకోలేకపోతోంది టీడీపీ. అలాంటి వారెవరైనా ఉంటే ముందే కనిపెట్టాలని, ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలనీ చంద్రబాబు సూచించినట్లు సమాచారం. దీపక్ రెడ్డి. పరుచూరి అశోక్ బాబు. బీద రవిచంద్ర. మంతెన వెంకట సత్యనారాయణ రాజు, కేఈ ప్రభాకర్, తిరుమల నాయుడు వంటి నమ్మకస్తులు ఉన్నారని ఈ సందర్భంగా యనమల రామకృష్ణుడు ఆయన వివరించినట్లు తెలుస్తోంది.
వేటు వేయాల్సిందేనంటూ..
పోతుల సునీత, శివనాథ్ రెడ్డిపై తప్పనసరిగా వేటు వేయాల్సిందేనంటూ నారా లోకేష్ సైతం యనమల రామకృష్ణుడుకు సూచించినట్లు చెబుతున్నారు. త్వరలోనే వారికి షోకాజ్ నోటీసులను జారీ చేయాలని, ఆ తరువాత క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని ఆయన పేర్కొన్నట్లు తెలుస్తోంది. శివనాథ్ రెడ్డిపై ముందు నుంచీ అనుమానాలు వ్యక్తమౌతూనే ఉన్నాయని, ఆయన వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా వ్యవహరించే అవకాశాలు లేకపోలేదని కొందరు సీనియర్ టీడీపీ నాయకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే.. జమ్మలమడుగు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డితో ఆయన మంతనాలు సాగించారని అంటున్నారు.