ఢిల్లీ వెళ్లొచ్చిన తరువాత చంద్రబాబు పరిస్థితి ఎలా ఉందంటే..
Kodali Nani: సార్వత్రిక ఎన్నికలు సమీపించిన నేపథ్యంలో రాష్ట్రంలో ఎన్నికల వేడి పెరిగింది. ప్రచార తీవ్రత పెరిగింది. రాజకీయ ప్రత్యర్థుల మధ్య మాటలదాడి జోరుగా సాగుతోంది. ఒకరిపై ఒకరు విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకుంటోన్నారు. ఆరోపణాస్త్రాలను సంధించుకుంటోన్నారు.
ఈ క్రమంలో తెలుగుదేశం- జనసేన పొత్తుపై అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి కొడాలి నాని సెటైర్లు సంధించారు. 45 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉందని చెప్పుకొంటోన్న చంద్రబాబు నాయుడికి ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసే దమ్ము లేదని విమర్శించారు.
ఏదో ఒక పార్టీ తోడు లేనిదే బయటికి కూడా అడుగు పెట్టలేని దుస్థితిలో చంద్రబాబు రాజకీయ జీవితం ఉందని, ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకుని ఎన్నికల్లో పోటీ చేసేంతటి దయనీయ స్థితిలో ఉన్నాడని కొడాలి నాని అన్నారు. ఎన్నికల అవసరం తీరాక.. ఆ పార్టీని మళ్లీ దరిదాపుల్లోకి కూడా రానివ్వడని చెప్పారు.

నారా లోకేష్, పవన్ కల్యాణ్లను ఉత్తపుత్రుడు, దత్తపుత్రుడిగా అభివర్ణించారు కొడాలి నాని. అడుగు బయట పెట్టాలంటే ఒక వైపు ఉత్తపుత్రుడు, మరోవైపు దత్తపుత్రుడు ఉంటాడని ఎద్దేవా చేశారు. వెనుక బీజేపీ వదినమ్మ ఎలాగూ ఉంటుందని, ఇప్పుడు కొత్తగా కాంగ్రెస్ నుంచి చెల్లెమ్మను తెచ్చుకున్నాడని సెటైర్లు వేశారు.
గతంలో చంద్రబాబు ఏది చెబితే అది వినడానికి గతంలోలా బీజేపీలో వాజ్పేయి, అద్వానీ లేరని వ్యాఖ్యానించారు. 150 అసెంబ్లీ, 20 లోక్సభ స్థానాల్లో తాము పోటీ చేస్తామని ఢిల్లీ బీజేపీ పెద్దలు చంద్రబాబుకు చెప్పినట్లు ఉన్నారని అంచనా వేశారు. చంద్రబాబు దీనికి కాదంటే ఒక సమస్య, అవునంటే ఇంకో సమస్యగా మారిందని పేర్కొన్నారు.
చంద్రబాబు పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యిలా మారిందని వ్యాఖ్యానించారు కొడాలి నాని. ఢిల్లీ వెళ్లొచ్చిన చంద్రబాబు హైదరాబాద్ నుంచి ఏపీకి రావట్లేదని, బీజేపీ పెద్దల దెబ్బకు మంచం మీద పడినట్టున్నాడని కొడాలి నాని అన్నారు.
పవన్ కల్యాణ్ భీమవరం పర్యటన రద్దుపైనా స్పందించారు కొడాలి నాని. భవనాల మధ్య ఉన్న విష్ణు కాలేజీలో హెలికాప్టర్ ల్యాండింగ్కు ఎలా అనుమతి ఇస్తారని నాని ప్రశ్నించారు. నగరంలోని విశాల స్థలంలో ల్యాండ్ అయ్యి, విష్ణు కాలేజీలో ఏర్పాటు చేసిన సభకు రోడ్డు మార్గంలో చేరేలా అధికారులు అనుమతి ఇచ్చారని, దీనికీ ఆయన ఒప్పుకోలేదని చెప్పారు.












Click it and Unblock the Notifications