టీడీపీ - జనసేన పొత్తు : అదే అసలు ట్విస్టు - చంద్రబాబు రెఢీ : తమ్ముళ్లకు తప్పదా...!!
ఏపీలో అప్పడే ఎన్నికల మూడ్ మొదలైంది. పొత్తుల పైన క్రమేణా స్పష్టత వస్తోంది. వైసీపీ లక్ష్యంగా టీడీపీ - జనసేన కలవటం ఖాయమనే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ దశలో వైసీపీ అప్రమత్తం అవుతోంది. వైసీపీ నేతలు జనసేన కార్యకర్తల పైన మైండ్ గేమ్ మొదలు పెట్టారు. పవన్ ను నమ్ముకున్నారు..మీతో చంద్రబాబు పల్లకి మోయిస్తున్నారంటూ వ్యాఖ్యానిస్తున్నారు. అయితే, చంద్రబాబు పొత్తుల విషయంలో ముందుకు వస్తే...స్పందిస్తాననే విధంగా పవన్ చెబుతున్నారు. వైసీపీ మాత్రం తాము సింగిల్ గానే పోటీ చేస్తామని చెబుతోంది.
2014 కు..ఇప్పటికీ అదే కీలక మార్పు
2014 లో పవన్ తో మద్దతు..మోదీ వేవ్ కలిసి రావటంతోనే టీడీపీ అధికారంలోకి వచ్చిందని పదే పదే వైసీపీ నేతలే చెబుతూ వచ్చారు. కానీ, ఇప్పుడు అదే వైసీపీ నేతలు ఎంత మంది కలిసి వచ్చినా..గెలుపు తమదే అని ధీమాగా చెబుతున్నారు. అయితే, 2014 ఎన్నికలకు..ఇప్పుడు పొత్తులో అసలు ట్విస్టు ఉంది. ఇప్పటికే చంద్రబాబు త్యాగాలకు సిద్దమంటూ చేసిన వ్యాఖ్య వెనుక స్పష్టమైన సంకేతాలు ఉన్నాయని పార్టీ నేతలే చెబుతున్నారు. ఆ తరువాతనే జనసేనాని నుంచి సానకూల సంకేతాలు తాజా వ్యాఖ్యల్లో స్పష్టంగా కనిపించాయి. 2014 ఎన్నికల్లో టీడీపీ - బీజేపీ సీట్లు షేర్ చేసుకున్నాయి. కానీ, జనసేనకు సీట్లు లేవు. కేవలం పవన్ కళ్మాణ్ రెండు పార్టీల కూటమి గెలుపుకు ప్రచారం చేసారు. ఫలితంగా ఎటువంటి ప్రయోజనం ఆశించలేదు.
చంద్రబాబు సిద్దమయిపోయినట్లేనా
కానీ, ఇప్పుడు సీన్ మారింది. జనసేన నుంచి పోటీ చేసే వారి సంఖ్య పెరిగింది. సామాజిక సమీకరణాలు ఇప్పుడు కీలక పాత్ర పోషిస్తున్నాయి. దీంతో..జనసేన నుంచి ఆశావాహులు ఉన్నారు. ఇక, ఇప్పుడు టీడీపీతో పొత్తు ఖాయమైతే ఆ సంఖ్య మరింత పెరగటం ఖాయం. కానీ, టీడీపీ నుంచి సీట్ల కేటాయింపులో జనసేన డిమాండ్ కు పూర్తి స్థాయిలో కాకపోయినా..మెజార్టీ స్థానాలకు ఓకే చెప్పాల్సిందే. రానున్న ఎన్నికలు జనసేన కంటే టీడీపీకి ప్రతిష్ఠాత్మకం. వైసీపీని ఈ సారి ఓడిస్తేనే..టీడీపీకి మంచి భవిష్యత్తు. దీని కారణంగానే చంద్రబాబు త్యాగాలకు సిద్దమంటూ సంకేతాలు ఇచ్చినట్లుగా విశ్లేషణలు వినిపిస్తున్నాయి. దీంతో..దాదాపుగా 30- 40 సీట్ల వరకు జనసేనకు కేటాయించక తప్పదని టీడీపీ ముఖ్య నేతలు అంతర్గత చర్చల్లో అంచనా వేస్తున్నారు.
తమ్ముళ్ల త్యాగాలు తప్పవా
ఇక, ఎంపీ సీట్లులో 3-4 వరకు ఇవ్వాల్సి ఉంటుందని అభిప్రాయ పడుతున్నారు. అందులో విశాఖ..కాకినాడ.. నర్సాపురం.. రాజంపేట స్థానాలు జనసేనకు కేటాయించే అవకాశం ఉందని పార్టీ నేతల అంచనా. జనసేనకు ప్రధానంగా గోదావరి జిల్లాలతో పాటుగా క్రిష్ణా - గుంటూరు జిల్లాలో ఎక్కకువగా సీట్లు డిమాండ్ చేసే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. దీంతో..జనసేన నుంచి ఆశాశాహులను బుజ్జగించటం జనసేనాని బాధ్యత అయితే... జనసేన కు కేటాయించే సీట్లలో టీడీపీ నేతలకు టిక్కెట్లు త్యాగాలు చేసే వారికి భవిష్యత్ పైన భరోసా ఇవ్వటంతో పాటుగా..వారి నుంచి పార్టీకి ఎన్నికల్లో నష్టం లేకుండా చూసుకోవాల్సి ఉంటుంది. దీంతో..ఇప్పటికే నియోజకవర్గాల్లో ఇన్ ఛార్జ్ లుగా ఉన్న కొందరికి సీట్లు త్యాగం చేయక తప్పదనే విశ్లేషణలు మొదలయ్యాయి. పొత్తులపైన చర్చ మొదలైన వేళ..రాజకీయంగా ఇప్పుడు ఈ వ్యవహారమే హాట్ టాపిక్ గా మారింది.