రాజ్యసభ ఎన్నికల్లో భారీ ట్విస్ట్- కాంగ్రెస్ అభ్యర్ధి నామినేషన్ తిరస్కరణ..!
ఈ నెల 18వ తేదీన జరిగే రాజ్యసభ ఎన్నికలపై ఉత్కంఠ పెరుగుతోంది. ఈ ఎన్నికల్లో గెలిస్తే రాజ్యసభలో మూడింటి రెండొంతుల మెజార్టీ సాధించే అవకాశం ఉండటంతో బీజేపీ వీటిని ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. ఇదే క్రమంలో మధ్యప్రదేశ్ నుంచి పోటీకి దిగిన కాంగ్రెస్ అభ్యర్ధి మీనాక్షి నటరాజన్ (Meenakshi Natarajan)ను ఓడించేందుకు ఇప్పటికే కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేస్తుండటంతో వారంతా బెంగళూరు క్యాంప్ కు తరలివెళ్లారు. అయితే ఆ తర్వాత కూడా మీనాక్షి నటరాజన్ కు షాక్ తప్పలేదు.
మధ్యప్రదేశ్ నుంచి కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థిగా మీనాక్షి నటరాజన్ సమర్పించిన నామినేషన్ అఫిడవిట్ లో ఆమె.. తెలంగాణలో నమోదైన ఓ క్రిమినల్ కేసుకు సంబంధించిన సమాచారాన్ని దాచిపెట్టినట్లు నిర్ధారించి ఎన్నికల అధికారులు దాన్ని తిరస్కరించారు. నటరాజన్ అభ్యర్థిత్వాన్ని రద్దు చేయాలని కోరుతూ బీజేపీ నాయకులు రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేయడంతో ఆ మేరకు ఈసీ అధికారులు వెంటనే నిర్ణయం తీసేసుకున్నారు.

కాంగ్రెస్ ఈ అభ్యంతరాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది. అది నిరాధారమైనదని పేర్కొంది. నటరాజన్ ఎలాంటి క్రిమినల్ కేసును ఎదుర్కోవడం లేదని, అందువల్ల బీజేపీ పేర్కొన్న విషయాన్ని వెల్లడించాల్సిన అవసరం ఆమెకు లేదని ప్రతిపక్ష నాయకుడు ఉమాంగ్ సింఘర్, ఇతర పార్టీ నాయకులు స్పష్టం చేశారు. తెలంగాణ విషయం కేవలం ఒక కోర్టు నోటీసుకు మాత్రమే సంబంధించింది కానీ, అధికారికంగా నమోదైన క్రిమినల్ కేసుకు కాదని కాంగ్రెస్ నేతలు తెలిపారు. ఈసీ మార్గదర్శకాల ప్రకారం, అభ్యర్థులు అధికారికంగా నమోదై, కోర్టులలో పెండింగ్లో ఉన్న క్రిమినల్ కేసులను మాత్రమే వెల్లడించాలి కానీ, సాధారణ న్యాయపరమైన నోటీసులను కాదని ఆ పార్టీ వాదిస్తోంది.














Click it and Unblock the Notifications