దమ్ముంటే ముందు నాపై కేసు పెట్టండి: వైఎస్ జగన్ కు చంద్రబాబు సవాల్: 11న ఛలో పల్నాడు
గుంటూరు: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో ఏర్పాటైన వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తెలుగుదేశం పార్టీ తొలి యుద్ధాన్ని ప్రకటించింది. తమ పార్టీ కార్యకర్తలపై యథేచ్ఛగా దాడులు కొనసాగుతున్నాయని ఆరోపిస్తూ టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఛలో పల్నాడు ఆందోళన నిర్వహించబోతున్నారు. ఈ నెల 11వ తేదీన ఈ ఈ ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు వెల్లడించారు. గుంటూరు జిల్లాలోని నరసరావుపేట, సత్తెనపల్లి, గురజాల, మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గాల్లో తమ పార్టీ కార్యకర్తలపై అధికార వైఎస్సార్సీపీ కార్యకర్తలు, మద్దతుదారుడు ప్రాణాంతక దాడులకు పాల్పడ్డారని విమర్శించారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం తాము ప్రజాక్షేత్రంలోకి దిగబోతున్నామని ఆయన వెల్లడించారు.
ఆదివారం ఆయన పార్టీ నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రతి జిల్లా నుంచీ కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున ఛలో పల్నాడు ఆందోళనకు తరలిరావాలని సూచించారు. అధికారాన్ని కోల్పోయినంత మాత్రాన తెలుగుదేశం పార్టీ ప్రజాదరణను కోల్పోలేదనే విషయాన్ని తాము ఈ ప్రదర్శన ద్వారా ప్రభుత్వానికి చాటి చెప్పాలని చంద్రబాబు సూచించారు. దాడులకు పాల్పడటంతో పాటు క్రియాశీలకంగా వ్యవహరిస్తోన్న తమ పార్టీ నాయకులపై పోలీసులు అక్రమంగా కేసులను నమోదు చేస్తున్నారని, అలాంటి వారికి పార్టీ అండగా ఉంటుందని అన్నారు. అక్రమ కేసులను ధీటుగా ఎదుర్కోవడానికి పార్టీ లీగల్ సెల్ ను బలోపేతం చేయబోతున్నట్లు చెప్పారు.
తమ పార్టీ నాయకులపై నమోదు చేసిన అక్రమ కేసుల విషయాన్ని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. ఆయా విషయాలను చర్చించడానికి ఈ నెల 10వ తేదీన పార్టీ లీగల్ సెల్ సమావేశమౌతుందని అన్నారు. రాష్ట్రంలో వైఎస్సార్సీపీ కార్యకర్తల ఆటలను సాగనివ్వబోమని హెచ్చరించారు. టీడీపీ కార్యకర్తలు ధైర్యంగా ఉండాలని, మనోబలాన్ని కూడగట్టుకోవాలని అన్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వానికి దమ్ము, ధైర్యం ఉంటే ముందు తనపై కేసు పెట్టాలని సవాల్ విసిరారు చంద్రబాబు. అంతేగానీ.. అమాయకులైన తమ పార్టీ కార్యకర్తలపై కాదని అన్నారు. సొంత బాబాయి వివేకానందరెడ్డిని ఎవరు చంపారో కనిపెట్టలేకపోవడం ప్రభుత్వ చేతకాని తనమని విమర్శించారు. పోలీసులు తమపై పెట్టే ప్రతీ కేసుకు సమాధానం చెప్పేలా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పారు.