సొంత చెల్లికే న్యాయం చెయ్యలేని సీఎం జగన్ రాష్ట్ర ఆడబిడ్డలను రక్షిస్తారా ? టీడీపీ నేత అనిత ఫైర్
టీడీపీ నాయకురాలు, తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. సొంత చెల్లికి న్యాయం చేయలేని సీఎం జగన్ రాష్ట్ర ఆడబిడ్డలను రక్షిస్తారా అని ప్రశ్నించిన అనిత ఏపీలో మహిళలపై గత రెండేళ్లుగా దాడులు పెరిగిపోయాయని జాతీయ మహిళా కమిషన్ కు ఇటీవల లేఖ కూడా రాశారు. జాతీయ మహిళా కమిషన్ ఒక బృందాన్ని దర్యాప్తు నిమిత్తం ఏపీకి పంపాలని ఆ లేఖలో ఆమె కోరిన విషయం తెలిసిందే.
ఇక తాజాగా మరోమారు మహిళలను కాపాడడం చేత కాకుంటే సీఎం జగన్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని వంగలపూడి అనిత డిమాండ్ చేశారు. ప్రచార ఆర్భాటాలకే దిశా యాప్ లు , దిశా పోలీస్ స్టేషన్ లు అంటూ నిప్పులు చెరిగారు. దిశ యాప్ పేరుతో హడావుడి చేయడం తప్ప ఏం చేస్తున్నారంటూ మండిపడ్డారు. జగన్ ఢిల్లీకి వెళ్లినా తన కేసుల కోసమే కానీ, దిశ చట్టం విషయంలో కేంద్రాన్ని ఒప్పించటం కోసం ఎప్పుడైనా ప్రయత్నించారా, ఆ చట్టాన్ని ఆమోదించమని కోరారా అని నిలదీశారు.

ఆడబిడ్డలను కాపాడలేని సీఎం రాష్ట్రానికి అవసరమా అని మండిపడ్డారు వంగలపూడి అనిత. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీసులు సైతం మహిళలపై అత్యాచారాలు, దాడులు పెరుగుతున్నా చోద్యం చూస్తున్నారని మండిపడ్డారు. అంతేకాదు అసమర్థ సీఎం జగన్ పాలనలో విధినిర్వహణను పోలీసులు మరిచారా అంటూ అనిత మండిపడ్డారు. జగన్ సర్కార్ హయాంలో మహిళలు భయం గుప్పిట్లో బ్రతకాల్సి వస్తుందని, జగన్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.












Click it and Unblock the Notifications