చంద్రబాబుకు ఏవీ సుబ్బారెడ్డి కూతురు అల్టిమేటం..!!
నంద్యాల: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర నంద్యాల జిల్లాలో కొనసాగుతోన్న వేళ- ఆ పార్టీలో వర్గ విభేదాలు గుప్పుమన్నాయి. ఒక్కసారిగా బయటపడ్డాయి. రెండు వర్గాలుగా విడిపోయిన టీడీపీ నాయకులు పరస్పరం దాడులకు దిగారు. నడిరోడ్డు మీద కొట్టుకున్నారు. ఈ దాడులు టీడీపీ నాయకులు, కార్యకర్తలు గాయపడ్డారు.
జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్ నాయకురాలు, మాజీ మంత్రి భూమా అఖిలప్రియ, ఏవీ సుబ్బారెడ్డి వర్గీయుల మధ్య ఈ ఘర్షణ చోటు చేసుకుంది. నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గంలోకి నారా లోకేష్ అడుగుపెట్టనున్న నేపథ్యంలో ఆయనకు ఘనస్వాగతం పలకడానికి భూమా అఖిలప్రియ, ఏవీ సుబ్బారెడ్డి.. పెద్ద సంఖ్యలో తమ అనుచరులతో కొత్తపల్లికి చేరుకున్నారు. నారా లోకేష్ ముందు బల ప్రదర్శనకు దిగారు. తమ బలాన్ని నిరూపించుకునే ప్రయత్నం చేశారు.

ఈ సందర్భంగా భూమా అఖిలప్రియ, ఏవీ సుబ్బారెడ్డి.. మధ్య తొలుత మాటలయుద్ధం చోటు చేసుకుంది. నడిరోడ్డు మీదే వారు ఘాటు పదాలతో రెచ్చిపోయారు. పరస్పరం దూషించుకున్నారు. ఒక దశలో భూమా అఖిలప్రియ వర్గీయులు తొడగొట్టి సవాల్ విసిరారు. అక్కడితో ఆగలేదు. ఏవీ సుబ్బారెడ్డిపై దాడి చేశారు.. పిడిగుద్దులు గుద్దారు. భూమా వర్గీయుల దాడిలో ఏవీ సుబ్బారెడ్డి నోటి నుంచి రక్తం కారింది.

ఈ ఘటనపై ఏవీ సుబ్బారెడ్డి కూతురు జశ్వంతి రెడ్డి స్పందించారు. భూమా అఖిలప్రియపై ఘాటు విమర్శలు చేశారు. తన అధికారిక ఫేస్బుక్ అకౌంట్లో లైవ్ ఇచ్చారు. దీనికి సంబంధించిన ఓ వీడియోను ఆమె పోస్ట్ చేశారు. వచ్చే ఏడాది జరిగే ఎన్నికల్లో నంద్యాల, ఆళ్లగడ్డ నుంచి తాను గానీ, తన తండ్రి గానీ ఖచ్చితంగా పోటీ చేసి తీరుతామని తేల్చి చెప్పారు.

అఖిల ప్రియకు టికెట్ ఇవ్వడం అంటూ జరిగితే- ఆమె పతనం కోసం పని చేస్తామని అల్టిమేటం జారీ చేశారు. అఖిల ప్రియను ఓడించడానికి శక్తివంచన లేకుండా పని చేస్తానని జశ్వంతిరెడ్డి అన్నారు. రోడ్డు మీద, బరి తెగించి.. ఎత్తుకుని పెంచిన ఏవీ సుబ్బారెడ్డిపై భూమా అఖిల ప్రియ దాడి చేయడం ద్వారా తన స్థాయి ఏమిటో నిరూపించుకుందని ధ్వజమెత్తారు.
లోక్లాస్ మైండ్ సెట్ ఉన్న భూమా అఖిల ప్రియను ప్రజలు సైతం ఎమ్మెల్యే అభ్యర్థిగా అంగీకరించరని, ఆమెకు టికెట్ ఇచ్చే విషయం పార్టీ అగ్ర నాయకత్వం పునరాలోచించాలని డిమాండ్ చేశారు. అఖిల ప్రియ వంటి నాయకులను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రోత్సహించకూడదని సూచించారు. దేవుడు అన్నీ చూస్తోన్నాడని, ఆమెకు తగిన శాస్తి జరిగి తీరుతుందని, శిక్ష అనుభవించక తప్పదని జశ్వంతిరెడ్డి హెచ్చరించారు.












Click it and Unblock the Notifications