సీఎం జగన్ ఇంటికే ఎసరుపెట్టిన ధూళిపాళ్ల.. వైఎస్ భారతిని కూడా చేర్చాలని డిమాండ్..
'ఇన్ సైడర్ ట్రేడింగ్'పేరుతో ప్రభుత్వం అవాస్తవాల్ని ప్రచారం చేస్తోందని, టీడీపీ నాయకులపై ఉన్న కోపాన్ని రైతుల మీద తీర్చుకుంటోందని మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర అన్నారు. కేవలం రాజధానిని మార్చాలన్న ఉద్దేశంతోనే ప్రభుత్వం 'ఇన్ సైడర్ ట్రేడింగ్' అంశాన్ని తెరపైకి తెచ్చిందని, 2014 జూన్ నుంచి 2014 డిసెంబర్ వరకు జరిగిన భూకొనుగోళ్లలో మాత్రమే అక్రమాలు జరిగాయంటోన్న వైసీపీ.. 2015 తర్వాత జరిగిన కొనుగోళ్ల గురించి మాట్లాడకపోవడం ఆశ్చర్యంగా ఉందని, సీఎం జగన్ బండారం బయటపడుతుందన్న భయంతోనే వివరాల వెల్లడికి వెనుకడుగువేస్తోందని ఆయన విమర్శించారు.
'ఇన్ సైడర్ ట్రేడింగ్’ అనే పదం.. దాని స్క్రిప్టు ఎలా పుట్టిందంటే.. వైసీపీకి బోండా ఉమ వార్నింగ్
జగన్ ఇల్లు ఎవరిదో తెలుసా?
తాడేపల్లిలో సీఎం జగన్ నివసిస్తోన్న ఇంటికి సంబంధించి ధూళిపాళ సంచలన విషయాలు బయటపెట్టారు. అనిల్ కుమార్ రెడ్డి అనే వ్యక్తి ఎండీగా ఉన్న ‘‘కాంక్రీట్ అండ్ లైమ్ స్టోన్'' అనే కంపెనీ నుంచి జగన్ ఇల్లు కొనుగోలు చేశారని, సదరు కంపెనీ 2016 నుంచి రాజధాని ప్రాంతంలో వేల ఎకరాల్ని స్వాధీనం చేసుకుందని, వాటికి సంబంధించిన ఆధారాలు కూడా ఉన్నాయని ధూళిపాళ చెప్పారు. ఆ కంపెనీ పేరు మీద భూములు కొన్నదెవరో, దాని వెనకున్న బినామీలెవరో బయటపడుతుంది కాబట్టే 2015 తర్వాత జరిగిన కొనుగోళ్లపై ప్రభుత్వం నోరువిప్పడంలేదని ఆయన అన్నారు.
వైఎస్ భారతి పేరుమీద..
రాజధానిలో స్వాధీనం ‘‘కాంక్రీట్ అండ్ లైమ్ స్టోన్'' కంపెనీ చేసుకున్న వేల ఎకరాల నుంచి వైఎస్ జగన్ కోసం మూడెకరాల స్థలాన్ని పక్కపెట్టి.. అందులో రాజభవనాన్ని నిర్మించి ఇచ్చిందని టీడీపీ నేత ఆరోపించారు. ‘‘వైఎస్ భారతి, సండూర్ పవర్, హరీశ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ అనే మూడు పేర్ల మీద ‘‘కాంక్రీట్ అండ్ లైమ్ స్టోన్'' కంపెనీ నుంచి ఇంటిని కొన్నారు. కొనుగోలుదారుల్లో భారతి మినహా రెండు కంపెనీలపై సీబీఐ కేసు కూడా ఉంది. ఈ ముగ్గురికీ పి.రమేశ్ బాబు అనే వ్యక్తి ఆథరైజ్డ్ పర్సన్ గా వ్యవహరించారు''అని నరేంద్ర తెలిపారు.
జగన్ ఇంటి లే అవుట్కు అనుమతి కూడా లేదు...
‘2019 ఫిబ్రవరి 8న వైఎస్ భారతి అండ్ అదర్స్ ఇంటిని కొనుగోలు చేయగా.. ఫిబ్రవరి చివరివారంలోనే గృహప్రవేశం చేశారని, దీన్ని బట్టి ఆ ఇల్లు వాళ్లకోసమే కట్టారన్న విషయం అర్థమవుతోందన్న నరేంద్ర.. అసలా ఇంటి లే అవుట్ కు ఇప్పటిదాకా అనుమతే రాలేదని చెప్పారు. ‘‘సీఎంగా ఉన్న జగన్ చట్టాన్ని గౌరవించాలి కదా.. మరి ఆయనే అక్రమ లే అవుట్ లో నివసిస్తున్నారు. శుక్రవారం (2020, జనవరి 3) నాటికి సీఆర్డీఏ అధికారిక వెబ్ సైట్ లోనే ఈ వివరాలున్నాయి. 1143 స్వే నంబర్.. ఆర్టిటెక్ట్ అశోక్ కుమార్.. ఫైల్ స్టేటస్ రిజెక్టెడ్ అని వెబ్ సైట్ లో ఉంది'' అని వివరించారు.
ఆధారాలిస్తాం.. ఎంక్వైరీ చేయించండి..
అధికారంలోకి వచ్చి ఏడు నెలలు గడుస్తున్నా సీఎం జగన్ ఇంకా ప్రతిపక్ష నేతలాగా వ్యవహరిస్తున్నారని, ఎంతసేపూ ఆరోపణలు చేయడమేతప్ప, ప్రభుత్వాధినేతగా వాటిపై విచారణ చేయించడంలేదని నరేంద్ర మండిపడ్డారు. తాము నిజాయితీగా కొన్న భూముల్ని కూడా ఇన్ సైడర్ ట్రేడింగ్ గా చూపెడుతున్నారని, ప్రభుత్వానికి దమ్ముంటే ఆరోపణలు మాని, చర్యలు తీసుకోవలన్నారు. జగన్ కు దమ్ముంటే.. రాజధాని ప్రకటనకు ముందు, తర్వాత అమరావతిలో జరిగిన భూకొనుగోళ్లపై సీబీఐతోగానీ లోకాయుక్తతోగానీ విచారణ చేయించాలని డిమాండ్ చేశారు.