చీపురుపల్లి నుంచి పోటీ పై తేల్చేసిన గంటా - వాట్ నెక్స్ట్..!!
ఏపీలో ఎన్నికల రాజకీయం హోరా హోరీగా మారుతోంది. ప్రధాన పార్టీలు ఎత్తులు, వ్యూహాలతో ముందుకు వెళ్తున్నాయి. అభ్యర్దుల ఖరారు తుది దశకు చేరింది. మరో వారంలో ఎన్నికల షెడ్యూల్ విడుదలకు అవకాశం ఉంది. టీడీపీ, జనసేన తమ తొలి జాబితా విడుదల చేసాయి. పొత్తుల కారణంగా కొందరు టీడీపీ సీనియర్లకు సీట్లు దక్కలేదు. గంటాను చీపురుపల్లి నుంచి పోటీ చేయాలని కోరారు. దీని పైన గంటా కీలక నిర్ణయం తీసుకున్నారు. దీంతో..ఇప్పుడు తరువాతి నిర్ణయం ఏంటనే ఉత్కంఠ మొదలైంది.
మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు కీలక నిర్ణయం తీసుకున్నారు. విశాఖ జిల్లాలొ గంటా కీలక నేతగా ఉన్నారు. టీడీపీ, ప్రజారాజ్యం తిరిగి టీడీపీ నుంచి గంటా వరుసగా గెలుస్తూ వచ్చారు. అనకాపల్లి ఎంపీగానూ పని చేసారు. 2019 ఎన్నికల్లో విశాఖ నార్త్ నుంచి గెలిచిన గంటా స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా రాజీనామా చేయగా.. కొద్ది రోజుల క్రితం ఆమోదించారు.

ఈ ఎన్నికల్లో టీడీపీ ప్రకటించిన తొలి జాబితాలో గంటా కు సీటు దక్కలేదు. గంటాను విజయనగరం జిల్లా చీపురుపల్లి నుంచి బొత్సా పైన పోటీ చేయాలని చంద్రబాబు సూచించారు. తనకు విశాఖ నుంచే అవకాశం ఇవ్వాలని గంటా కోరారు. ఫస్ట్ లిస్టు ప్రకటన తరువాత చంద్రబాబుతో గంటా సమావేశమయ్యారు.
గంటాను బొత్సా పైన పోటీ చేయాలని..అక్కడ పార్టీకి అనుకూల పరిస్థితులు ఉన్నాయని చంద్రబాబు వివరించారు. గెలిస్తే విజయనగరం జిల్లా నుంచి మంత్రిగా అవకాశం ఉంటుందని హామీ ఇచ్చినట్లు పార్టీలో చర్చ సాగుతోంది. అయితే, దీని పైన ఇప్పుడు గంటా స్పష్టత ఇచ్చారు. తాను చీపురుపల్లి నుంచి పోటీ చేయలేనని చెప్పినట్లు సమాచారం.
విశాఖ జిల్లా పరిధిలోనే తనకు సీటు ఇవ్వాలని మరోసారి కోరారు. విశాఖ నార్త్ బీజేపీతో పొత్తు ఖాయమైతే ఆ పార్టీకి వెళ్లే అవకాశం ఉంది. భీమిలి స్థానం జనసేన కోరుతోంది. గంటా గతంలో చోడవరం, భీమిలి నుంచి గెలిచి ఉండటంతో ఆ సీట్లను అడుగుతున్నారు. కానీ, పొత్తులో భాగంగా సీట్ల కేటాయింపులో సాధ్యపడదని చెబుతున్నట్లు తెలుస్తోంది. దీంతో, ఇప్పుడు గంటా నిర్ణయం ఏంటనేది ఆసక్తిని పెంచుతోంది.












Click it and Unblock the Notifications