టీడీపీలో వరుస వికెట్లు: ఈ సారి జూపూడి వంతు: త్వరలో వర్ల రామయ్య
అమరావతి: తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఛైర్మన్ పదవులను దక్కించుకున్న ఆ పార్టీ నేతలందరూ ఒక్కొక్కరుగా వైదొలగుతున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సభ్యత్వానికి తెలుగుదేశం పార్టీ నేత సుగవాసి ప్రసాద్బాబు రాజీనామా చేసి 24 గంటలు కూడా గడవక ముందే- మరొకరు రాజీనామా చేశారు. ఈ సారి జూపూడి ప్రభాకర్ వంతు వచ్చింది. షెడ్యూల్డ్ కులాల ఆర్థిక సహకార సంస్థ ఛైర్మన్గా ఉన్న ఆయన మంగళవారం తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా పత్రాన్ని సాంఘిక సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శికి అందించారు. తన రాజీనామాను వెంటనే ఆమోదించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.

రాష్ట్రంలో ప్రభుత్వం మారిన నేపథ్యంలో.. తాను రాజీనామా చేయాల్సి వచ్చిందని ఆయన ఇందులో పేర్కొన్నారు. గత ప్రభుత్వం తనను ఎస్సీ కార్పొరేషన్ ఛైర్మన్ పదవికి నామినేట్ చేసిందని గుర్తు చేశారు. తనను నియమించిన ప్రభుత్వం అధికారాన్ని కోల్పోయిన నేపథ్యంలో.. రాజీనామా చేస్తున్నానని ఆయన పేర్కొన్నారు. తాను పదవిలో ఉన్నన్ని రోజులూ ప్రతి క్షణం దళితులు, అణగారిన వర్గాల వారికి సహాయం చేయడానికి కృషి చేశానని చెప్పుకొచ్చారు. దళితులకు సేవ చేయడానికి తనకు దక్కిన మంచి అవకాశంగా తాను భావించి, వారి అభ్యున్నతికి అహర్నిశలు కృషి చేశానని అన్నారు.

కాగా- తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు వర్ల రామయ్య కూడా త్వరలోనే తన పదవికి రాజీనామా చేయబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన ఆర్టీసీ ఛైర్మన్గా కొనసాగుతున్నారు. గతంలో చంద్రబాబు ప్రభుత్వం ఆయనను ఆర్టీసీ ఛైర్మన్ పదవికి నామినేట్ చేసిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications