లోకేష్ కు తప్పుడు సమాచారం ? పోలీసుల డబుల్ గేమ్స్-రాజేష్ మహాసేన షాకింగ్..!
ఏపీలో నిత్యం తన సంచలన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే టీడీపీ నేత మహాసేన రాజేష్ ఈసారి పోలీసుల్ని టార్గెట్ చేశారు. రాష్ట్ర మంత్రి నారా లోకేష్ కు పోలీసులు ఓ విషయంలో తప్పుడు సమాచారం ఇచ్చారని, ప్రభుత్వాన్ని అప్రదిష్ట పాలుచేసేందుకే ఇలా చేస్తున్నారంటూ సంచలన విమర్శలు చేశారు. దీంతో రాజేష్ మహాసేన వ్యాఖ్యలు చర్చనీయాంశమవుతున్నాయి.
తాజాగా హైదరాబాద్ నుంచి వచ్చిన పాస్టర్ ప్రవీణ్ పగడాల రాజమండ్రి సమీపంలో హైవే పక్కన విగతజీవిగా కనిపించారు. ఇది రోడ్డు ప్రమాదమని పోలీసులు చెప్తుండగా.. కాదు హత్యేనని కుటుంబ సభ్యులు, అభిమానులు, క్రైస్తవులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ నేత మహాసేన రాజేష్ ఈ వ్యవహారంపై స్పందిస్తూ పోలీసులపై సంచలన ఆరోపణలు చేశారు. ప్రవీణ్ పగడాల మృతి విషయంలో పోలీసులు చాలా నిర్లక్ష్యం చేశారని ఆయన ఆరోపించారు.

ప్రవీణ్ ది హత్య కాదు ఆక్సిడెంట్ అని కొందరు పోలీసులు మంత్రి నారా లోకేష్ కి సమాచారం ఇచ్చారని, ఆ సమాచారం ఇచ్చిన పోలీసులను వెంటనే సస్పెండ్ చేయాలని ప్రభుత్వాన్ని రాజేష్ మహాసేన కోరారు. ప్రభుత్వాన్ని కావాలని బద్నాం చేయడానికే కొందరు పోలీసులు ఇలా చేస్తున్నారని ఆయన ఆరోపించారు. పోలీసులు అనవసరంగా తమతో డబుల్ గేమ్స్ ఆడుతున్నారని విమర్శించారు. ఈ రోజు సాయంత్రం లోపు ఈ కేసులో అన్ని నిజాలను బయట పెట్టాలని పోలీసుల్ని ఆయన డిమాండ్ చేశారు. దీంతో పోలీసులు ఈ ఆరోపణలపై ఎలా స్పందిస్తారన్న ఉత్కంఠ నెలకొంది.
ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన పాస్టర్ ప్రవీణ్ మృతిని పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఇప్పటివరకూ కీలకమైన ఆధారాలేవీ సంపాదించలేకపోయారు. దీంతో పోలీసుల తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో రాజేష్ మహాసేన ఆరోపణలు పోలీసుల తీరుపై కొత్త అనుమానాలు రేకెత్తిస్తున్నాయి.












Click it and Unblock the Notifications