సంక్షోభంలో సీఎం జగన్ విలవిల.. కేంద్రం జోక్యంతో అనర్హత వేటు తప్పదు: యనమల సంచలనం
''అధికారం చేపట్టిన 10 నెలలకే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ భయంకరమైన సంక్షోభంలో కూరుకుపోయారు. అందులోంచి ఎలా బయటపడాలో తెలియక విలవిలలాడుతున్నారు. వచ్చే నాలుగేళ్లలో పరిస్థితి మరింత దారుణంగా తయారయ్యే ప్రమాదముంది. ఏపీ పేరు చెప్పుకోడానికే సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. జగన్ 'ఇన్సేన్' కావడమే దీనంతటికీ కారణం. అంటే ఆయన మానసిక పరిస్థితి దెబ్బతినిందన్నమాట. రాజ్యాంగంలో ప్రకారం మానసిక స్థితి బాగోలేని వ్యక్తి పరిపాలనకు అనర్హుడు. కాబట్టి జగన్ పై అనర్హతవేటు తప్పదు'' అంటూ మాజీ మంత్రి, మండలిలో టీడీపీ నేత యనమల రామకృష్ణుడు సంచలన వ్యాఖ్యలు చేశారు.
స్థానిక ఎన్నికల వాయిదా తర్వాత రాష్ట్రంలో చోటుచేసుకుంటున్నవన్నీ అసాధారణ పరిణామాలేనని, దీన్నొక అత్యవసర పరిస్థితిగా భావించి కేంద్రం వెంటనే జోక్యం చేసుకోవాల్సిందిగా టీడీపీ డిమాండ్ చేస్తున్నదని యనమల చెప్పారు. మంగళవారం మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన వైసీపీ సర్కారు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తీరును విమర్శించారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ నిర్ణయాలను సమర్థించారు.

కోర్టుకు ఏం చెబుతారు?
‘‘ఒక అంతర్జాతీయ సమస్య నేపథ్యంలో, కేంద్ర సర్కారు కూడా దానిపై తీవ్ర హెచ్చరికలు చేసిన దరిమిలా.. కరోనా వైరస్ వ్యాప్తి చెందరాదన్న సదుద్దేశంతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్.. స్థానిక ఎన్నికల్ని ఆరువారాలు వాయిదా వేశారు. దీనిపై సీఎం జగన్ సుప్రీంకోర్టును ఆశ్రయించడం చాలా విచిత్రంగా ఉంది. ఎన్నికలకు సంబంధించి ఈసీనే సుప్రీం కాబట్టి.. దీనీపై సుప్రీంకోర్టు స్పందించదు. ఒకవేళ స్పందించినా.. ఏపీ ప్రభుత్వం ఏమని వాదిస్తుంది? కరోనాపై కేంద్రం ఆదేశాలకు వ్యతిరేకంగా వాదనలు వినిపిస్తుందా? ఇవన్నీ పక్కనపెడితే, అసలు కోర్టులు అంటేనే లెక్కచేయని జగన్ లాంటి వ్యక్తి.. ఇవాళ సుప్రీంకోర్టును ఆశ్రయించడం ఎంత వింత?

కేంద్రం కళ్లెం తప్పదు..
కొన్ని దశాబ్ధాలుగా సింగపూర్లో ప్రతిపక్ష పార్టీలు లేవు. ఉన్నా ఒకటి రెండు సీట్లకే పరిమితవుతాయి. అయినప్పటికీ అక్కడి అధికార పార్టీలు బియాండ్ ఆలోచనలు చేయరు. బంపర్ మెజార్టీ సాధించినా నిబంధనల ప్రకారమే నడుచుకుంటారు. సరిగ్గా ఆ విధానానికి వ్యతిరేకంగా ఏపీలో సీఎం జగన్ తనకు 151 సీట్లు వచ్చాయని, సర్వస్వం తానేనని అనుకుంటున్నారు. అందుకే రాజ్యాంగమన్నా, రాజ్యాంగ సంస్థలన్నా లెక్కలేకుండా వ్యవహరిస్తున్నారు. స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించే అధికారం ముఖ్యమంత్రికి లేదు. ఏపీ సీఎం రాజ్యాంగ వ్యతిరేక ధోరణికి కేంద్రమే కళ్లెం వేయాలి.

రాష్ట్రపతి జోక్యం..
ఏపీలో వ్యవస్థలన్నీ నిర్వీర్యమైపోయి, శాంతిభద్రతలు అదుపుతప్పిన నేపథ్యంలో ఎన్నికల నిర్వహణను కేంద్రమే చేపట్టాలి. ఒక ముఖ్యమంత్రిగానేకాదు.. రాజకీయ నేతగానూ జగన్ అన్ ఫిట్ అని తేలిపోయింది. అందుచేత రాష్ట్ర పోలీసులను పక్కనపెట్టేసి, కేంద్ర బలగాలను మోహరింపజేయాలి. స్థానిక ఎన్నికల్ని ఆరువారాలు వాయిదా వేయడం కాదు.. రీ ఎలక్షన్ నిర్వహించాలి. ఎన్నికల కమిషన్ ను ఉద్దేశించి సీఎం చేసిన కామెంట్లు ఆయన స్థాయేంటో మరోసారి నిరూపితం చేశాయి. రాజ్యాంగ సంస్థల పట్ల అవిధేయతను జగన్ బాహాటంగా ప్రకటించుకుంటున్నారు. దీనిపై రాష్ట్రపతి, గవర్నర్ సమగ్రమైన రిపోర్టులు తెప్పించుకుని, సీఎంపై యాక్షన్ తీసుకోవాలి.

డీవోపీటీకి ఎవిడెన్స్లు
సరిగ్గా సీఎం జగన్ చెప్పిన మతిలేని మాటలనే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కూడా వల్లెవేశారు. ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించే అధికారం తనకు లేదని తెలిసి కూడా ఆమె లేఖలు రాసి అడ్డంగా ఇరుక్కుపోయారు. గతంలో ఇలాగే జగన్ ను నమ్మి చాలా మంది అధికారులు జైలుపాలయ్యారు. వైసీపీకి అనుకూలంగా కొంత మంది ఐఏఎస్, ఐసీఎస్ లు బరితెగించినట్లు వ్యవహరిస్తున్నారు. ఆయా దురాగతాలకు సంబంధించిన ఎవిడెన్స్ లతో కేంద్ర శిక్షణ, సిబ్బంది వ్యవహారాల శాఖకు ఫిర్యాదు చేయబోతున్నాం.
Recommended Video

ఆర్థిక సంఘం నిధులపై అబద్ధాలు..
స్థానిక సంస్థల ఎన్నికలు జరగకుంటే ఆర్థిక సంఘం నిధులు రావంటూ వైసీపీ చేస్తున్నదంతా తప్పుడు ప్రచారమే. 74, 73వ రాజ్యాంగ సవరణ ద్వారా కేంద్రం రాష్ట్రాలకు చేసిన సూచన అది, అంతేతప్ప, ఎన్నికలతో ఆర్థిక సంఘానికి సంబంధం లేనేలేదు. ప్రస్తుత ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ గతంలో ఫైనాన్స్ సెక్రటరీగానూ పనిచేశారు. దీనిపై ఆయనకు స్పష్టమైన అవగాహన ఉంది. సీఎం మాత్రం తెలిసీతెలియని మాటలు మాట్లాడుతున్నారు. ఇలాంటి వ్యక్తి పదవిలో ఉండటానికి అనర్హుడు. కేంద్రం వెంటనే ఆయనను డిస్ క్వాలిఫై చేయాలి''అని యనమల రామకృష్ణుడు మండిపడ్డారు.












Click it and Unblock the Notifications