కుప్పంలో టీడీపీ నేతల అరెస్ట్ - కార్యకర్తలకు గాయాలు : హోరాహోరీగా మారిన ఎన్నిక...!!
టీటీపీ అధినేత సొంత నియోజకవర్గంలోని కుప్పం మున్సిపాల్టీ ఎన్నిక ప్రతిష్ఠాత్మకంగా మారుతోంది. ఎన్నిక సమయం దగ్గర పడుతున్న కొద్దీ పరిస్థితులు ఉద్రిక్తంగా మారుతున్నాయి. కుప్పంలో మున్సిపల్ కమిషనర్ చిట్టిబాబు ఏకపక్షంగా వ్యవహరిస్తూ 14వ వార్డును ఏకగ్రీవం చేశారంటూ తెదేపా శ్రేణులు నిరసనలకు దిగారు. టీడీపీ అభ్యర్థి ప్రకాశ్ నామినేషన్ను ఫోర్జరీ సంతకాలతో ఉపసంహరించుకున్నట్లు చూపడంతో సోమవారం రాత్రి టీడీపీ శ్రేణులు కుప్పం మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడించారు.

కమీషనర్ ఫిర్యాదు మేరకు అరెస్ట్ లు
కార్యాలయంలో నిరసనకు దిగి తనతో పాటు సిబ్బంది విధులకు ఆటంకం కలిగించారని, అద్దాల పగులకొట్టారని కమిషనర్ చిట్టిబాబు ఇచ్చిన ఫిర్యాదుపై తెదేపా నాయకులు, కార్యకర్తలపై అర్బన్ పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యాయి. మొత్తం 19 మందిపై ఐపీసీ 143, 147, 353, 427 రెడ్ విత్ 149తోపాటు ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. కుప్పంలోని బీసీఎన్ హోటల్లో భోజనం చేస్తున్న అమరనాథ్రెడ్డిని, నానిని బలవంతంగా వాహనాలు ఎక్కించి తీసుకెళ్లారు.

ఫోర్జరీ ..విత్ డ్రా ఆరోపణలు
ఇతర ప్రాంతాల నాయకులైన వీరిద్దరితో పాటు వేరే ప్రాంతంలో ఉన్న ఎమ్మెల్సీ దొరబాబుకు 41ఏ నోటీసులు ఇచ్చి, అరెస్టు చేసి వారి సొంత ప్రాంతాలకు తరలించినట్లు డీఎస్పీ చెప్పారు. ఎన్నికలయ్యేంతవరకు వారు కుప్పంలో కనిపించరాదని హెచ్చరించారు. కుప్పం పట్టణంలోని 14వ వార్డును అక్రమంగా ఏకగ్రీవం చేశారని, తెదేపా అభ్యర్థులు ఎం.ప్రకాశ్, పి.తిరుమగల్ కుప్పంలో లేకపోయినా వారు నామినేషన్లు ఉపసంహరించు కున్నట్టు ప్రకటించారని రాష్ట్ర ఎన్నికల సంఘానికి (ఎస్ఈసీ) తెదేపా ఫిర్యాదు చేసింది.

చంద్రబాబు సీరియస్
అభ్యర్థుల సంతకాలతో కూడిన లేఖను ఎమ్మెల్సీ అశోక్బాబు ఎస్ఈసీకి పంపించారు. నామినేషన్ నుంచి ఉపసంహరణ తేదీవరకు జరిగిన పరిణామాలను లేఖలో ఉటంకించారు. అభ్యర్థుల తరఫున ఫోర్జరీ పత్రాలు ఎవరు సమర్పించారో సీసీ కెమెరా ఆధారంగా నిగ్గుతేల్చాలని కోరారు. కుప్పంలో పరిణామాల పైన టీడీపీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసారు. ఎన్నికల కమిషనర్ కు ఫోన్ లో అక్కడి పరిస్థితిని వివరించారు. ప్రశాంతంగా ఉండే కుప్పంలో వైసీపీ దౌర్జన్యాలకు పాల్పడుతోందంటూ మండి పడ్డారు. ఇదే సమయంలో మరో నాలుగు రోజుల్లో కుప్పం మున్నిపాల్టీకి పోలింగ్ జరగనుంది.
Recommended Video

రెండు పార్టీలకు ప్రతిష్ఠాత్మకంగా
పంచాయితీ ఎన్నికల్లో కుప్పం నియోజకవర్గం పరిధిలో మెజార్టీ స్థానాలు సాధించిన వైసీపీ..మున్సిపాల్టీ సైతం గెలుచుకోవాలని ప్రయత్నం చేస్తోంది. టీడీపీ అధినేత సైతం అక్కడ గెలుపు బాధ్యతలను సీనియర్ నేతలకు అప్పగించారు. నిరంతరం ప్రచారంతో పాటుగా ఎన్నికల వ్యూహాల పైన నేతలతో సమీక్షిస్తున్నారు. ఇక, కుప్పం ఎన్నిక బాధ్యతలు తీసుకున్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి పార్టీ తరపున వ్యూహాలు అమలు చేస్తున్నారు. దీంతో..ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా పోలీసులు ముందస్తు చర్యలు ప్రారంభించారు.












Click it and Unblock the Notifications