కేంద్రానికి సమర్పించిన యుసి వివరాలపై మహానాడులో ప్రదర్శన
విజయవాడ:విజయవాడలో జరుగుతున్న టిడిపి మహానాడు మూడో రోజు సమావేశాల్లో టిడిపి నేతలు కేంద్రంపై విమర్శలతో చెలరేగిపోయారు. ఈ రోజు చివరి రోజు కావడంతో మళ్లీ ఇలాంటి అవకాశం దొరకదన్నంతగా రెచ్చిపోయారు.
మంత్రి సుజయకృష్ణ తాము కేంద్రానికి యుసిలు పంపినా పంపలేదంటున్న ఆరోపణలు తప్పని నిరూపించే ప్రయత్నం చేశారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కాంగ్రెస్ అద్దె మైక్ అని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అనడం దారుణమని మరో మంత్రి అచ్చెన్నాయుడు మండిపడ్డారు. రాష్ట్రాల హక్కులను కేంద్రం కాలరాస్తుందని ఎంపీ కేశినేని నాని విమర్శించారు.
మహానాడు చివరి రోజు సమావేశాల్లో టిడిపి నేతలు ఏమన్నారంటే...ఎపికి సంబంధించి కనీసం రాజధానికి ఇచ్చిన మాట కూడా కేంద్రం నిలబెట్టుకోలేదని మహానాడులో మంత్రి సుజయకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. యూసీలు ఇచ్చినా బీపీఆర్లు పంపినా కేంద్రం ఏమాత్రం స్పందించలేదని ఆయన ఆరోపించారు. రాజధాని నిర్మాణం, నరేగ నిధులకు సంబంధించిన యూసీల వివరాలపై మంత్రి సుజయకృష్ణ మహానాడులో ప్రజెంటేషన్ ఇచ్చారు. రాష్ట్రం పంపిన యూసీల వివరాలు అందినట్లు కేంద్రం పంపిన లేఖలు, నిధుల విడుదలపై నీతి అయోగ్ సిఫార్స్ లేఖలను ఆయన ప్రదర్శించారు. రాజధాని కోసం అన్ని కబుర్లు చెప్పిన కేంద్రం కేవలం రూ. 1500 కోట్లే ఇచ్చిందని మంత్రి తెలిపారు. మొత్తం 8 డాక్యుమెంట్లపై మంత్రి మహానాడులో ప్రదర్శించారు.
మరో మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కాంగ్రెస్ అద్దె మైక్ అని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అనడం దారుణమని మంత్రి అచ్చెన్నాయుడు మండిపడ్డారు. టీడీపీ కాంగ్రెస్తో కలుస్తుందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని తీవ్రస్థాయిలో విమర్శించారు. కాంగ్రెస్, బీజేపీ రెండూ రాష్ట్రానికి అన్యాయం చేశాయని ఆయన ఆరోపించారు. తమకు ఇష్టంలేకపోయినా రాష్ట్ర ప్రయోజనాలను ఆశించి బీజేపీతో కలిసి పోటీ చేశామని, సీట్లు తగ్గుతాయని తెలిసీ రాష్ట్ర అభివృద్ధి కోసం బీజేపీతో కలిసి పోటీ చేసిన విషయాన్ని ప్రజలు గుర్తించాలని అచ్చెన్నాయుడు అన్నారు. నాలుగేళ్లు ఎందుకు ఊరుకుంటున్నారని చాలా మంది విమర్శలు చేస్తున్నారని, మొదటి ఏడాదే కేంద్రాన్ని గట్టిగా నిలదీస్తే హోదా వచ్చేదని అంటున్నారని, అలా చేస్తే ఈ మాత్రమైనా అభివృద్ధి జరిగేది కాదని మంత్రి పేర్కొన్నారు.
ఇక ఎంపి కేశినేని నాని మాట్లాడుతూ రాష్ట్రాల హక్కులను కేంద్రం కాలరాస్తుందని ధ్వజమెత్తారు. 15వ ఆర్థిక సంఘం సిఫార్సులను బూచీగా చూపించి రాష్ట్రాలకు వచ్చే నిధులను నియంత్రిస్తున్నారని ఎంపి నాని మండిపడ్డారు. 15వ ఆర్థిక సంఘం సిఫార్సులను అమలు చేస్తే ఏపీకి 7వేల కోట్లు నష్టం జరుగుతుందన్నారు. జాతీయ రాజకీయాల్లో చంద్రబాబు కీలక పాత్ర పోషించాల్సిన అవసరం ఉందని ఎంపి కేశినేని నాని అభిప్రాయపడ్డారు.