ఒకేచోట వైసీపీ,బీజేపీ స్క్రిప్ట్-ట్యాపింగ్ కేసులో కేంద్రం ప్రతివాది - ‘కమ్మ’కాబట్టే కక్ష: టీడీపీ ఫైర్
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను కుదిపేస్తోన్న ఫోన్ ట్యాపింగ్ ఉదంతంలో అధికార వైసీపీకి కేంద్రంలోని బీజేపీ అండగా నిలబడిందని ప్రతిపక్ష టీడీపీ నేతలు సంచలన ఆరోపణలు చేశారు. రెండు పార్టీల నేతలూ ఒకే చోట తయారైన స్క్రిప్టును చదువుతున్నారని మండిపడ్డారు. దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన విజయవాడ స్వర్ణ ప్యాలెస్ అగ్నిప్రమాదం ఘటనపై దర్యాప్తులో కుల విభేదాలు కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయని విమర్శించారు. మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు, ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ గురువారం ఈ మేరకు అనూహ్య వ్యాఖ్యలు చేశారు.
Recommended Video
సినిమాను మించి సీఎం జగన్ కామెడీ - బెంగళూరుకు దగ్గరగా క్యాపిటల్ - తోలు తీస్తామంటారా?: ఎంపీ రఘురామ
వైసీపీ-బీజేపీ ఫిక్సింగ్
‘‘ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కేంద్రానికి సంబంధం లేదని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు చెప్పడం హాస్యాస్పదం. సంబంధం లేకుంటే ఈ కేసులో కేంద్ర ప్రభుత్వ కీలక శాఖలు ప్రతివాదులుగా ఎందుకున్నాయో జీవీఎల్ సమాధానం చెప్పాలి. కర్ణాటక, రాజస్థాన్ లో ట్యాపింగ్ లపై అక్కడి బీజేపీ నేతలు కేంద్రానికి ఫిర్యాదులు చేయలేదా? అలాంటప్పుడు చంద్రబాబు మాత్రం ఫిర్యాదు చేస్తే తప్పేంటి? ప్రధాని మోదీకి బాబు లేఖరాయడం తప్పని చెప్పడానికి వైసీపీ, బీజేపీ నానా తంటాటు పడతున్నాయి. రెండు పార్టీల నేతలూ ఒకే చోట తయారైన స్క్రిప్టును చదువుతున్నారు'' అని కాల్వ శ్రీనివాసులు మండిపడ్డారు.
ఆ ముగ్గురి కబంధహస్తాల్లో..
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో జగన్ సర్కారు గుమ్మడికాయ దొంగలా వ్యవహరిస్తున్నదని, చంద్రబాబు కేంద్రానికి లేఖరాస్తే, జగన్ సర్కారు ఉలిక్కిపడిందని శ్రీనివాసులు ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో రెవెన్యూ, పోలీస్ వ్యవస్థలను ఇష్టానికి వాడుకుంటూ, ప్రశ్నించినవాళ్లను అరెస్ట్ చేయిస్తూ, పాలనా వ్యవస్థను నిర్వీర్యం చేశారని, న్యాయవ్యవస్థలోని వాళ్లనూ భయపెడుతున్నారని ఆరోపించారు. విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డిల కబంధహస్తాల్లో రాజ్యాంగ వ్యవస్థలు చిక్కుకుపోయాయని, ప్రభుత్వానికి ఆదేశాలిస్తూ వెనకుండి నడిపిస్తున్నది ఆ ముగ్గురేనని కాల్వ విమర్శించారు.
కమ్మ వర్గాన్ని భ్రష్టు పట్టిస్తున్నాడు - ఏపీలో లేడు, ట్యాపింగ్ ఏంటి? - వల్లభనేని వంశీ -బచ్చుల కౌంటర్
రమేశ్ ఆస్పత్రిపై కక్ష అందుకే..
స్వర్ణ ప్యాలెస్ దుర్ఘటన, రమేశ్ ఆస్పత్రిపై చర్యల అంశంలో కుల విభేదాలు పొడచూస్తోన్న తరుణంలో టీడీపీ నేత బాబు రాజేంద్రప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సొంత బాబాయి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును తేల్చలేని సీఎం జగన్.. రమేష్ ఆస్పత్రి వ్యవహారంలో 10 పోలీస్ బృందాలను ఏర్పాటు చేసి అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని మండిపడ్డారు. కేవలం రమేశ్ యాజమాన్యం కమ్మ కులస్తులు కాబట్టే వాళ్లను జగన్ టార్గెట్ చేశారని, మహిళలని చూడాకుండా పోలీస్ స్టేషన్లకు పిలిపించి విచారణ చేస్తున్నారని దుయ్యబట్టారు.
కమ్మ కులంలో పుడితే బానిసగానా?
ఏపీలో కుల విభేదాలు తారా స్థాయికి చేరాయనడానికి నిదర్శనంగా నేతలు ప్రెస్ మీట్లలో కులాల పేర్లు, వ్యతిరేక వర్గాల పేర్లను బాహాటంగా చెబుతున్నారు. బుధవారం మీడియాతో మాట్లాడిన టీడీపీ బహిష్కృత నేత, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ.. చంద్రబాబు కమ్మ కులాన్ని భ్రష్టు పట్టిస్తున్నారని, ఆయన వల్ల మొత్తం సామాజికవర్గం ఇబ్బందులకు గురవుతోందని అన్నారు. టీడీపీ నేత రాజేంద్ర ప్రసాద్ గురువారం నాటి ప్రకటనలోనూ కమ్మ కులం ప్రస్తావన చేశారు. ‘‘కమ్మ సామాజికవర్గాన్ని టార్గెట్ చేయడం కరెక్టేనా? కమ్మకులంలో పుట్టాలని మేం దేవుడిని కోరుకున్నామా?, కమ్మవారిగా పుట్టినందుకు బానిసలుగా ఉండాలా?'' అని రాజేంద్రప్రసాద్ ప్రశ్నించారు.