టీడీపీ నేతలే.. జగన్ కు లక్ష మెజారిటీ ఖాయమంటున్నారు!
కడప : టీడీపీ గ్రూపు పాలిటిక్స్ కు పెట్టింది పేరైన కడప జిల్లాలో కార్యకర్తల నడుమ అసంతృప్తి రాజుకుంటోంది. జిల్లాకు ఇంచార్జీగా వ్యవహరిస్తున్న మంత్రి గంటా సైతం ఈ వివాదాలను పరిష్కరించలేక తలపట్టుకున్నారనే వాదన ఉండగా.. తాజాగా శాసనమండలి డిప్యూటి చైర్మన్, పులివెందుల టీడీపీ నేత సతీష్ రెడ్డిపై జిల్లా రాజకీయాల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది.
సతీష్ రెడ్డి తీరును వ్యతిరేకిస్తూ.. పలువురు సొంతగూటి నేతలే విమర్శలు గుప్పిస్తున్నారు. ఆయన పోకడల వల్ల కడపలో పార్టీ దెబ్బతినే అవకాశముందని మీడియా ముఖంగా వారు అభిప్రాయపడడం హాట్ టాపిక్ గా మారింది. సతీష్ రెడ్డి వ్యవహార శైలి టీడీపీకి నష్టం చేకూర్చే ప్రమాదముండడంతో ఆయన బారి నుంచి పార్టీని రక్షించాలని జిల్లా నేతలు భాస్కర్ రెడ్డి, రమేష్, పాపిరెడ్డి, వెంకటయ్య, కృష్ణారెడ్డిలు డిమాండ్ చేయడం గమనార్హం.
పార్టీలో గ్రూపు రాజకీయాలను సతీష్ రెడ్డి ప్రోత్సహిస్తున్నారని జిల్లాకు చెందిన ఈ నేతలు ఆరోపిస్తున్నారు. చంద్రబాబు లోకేష్ ఫ్లెక్సీలను సైతం సతీష్ రెడ్డి అనుచరులు ధ్వంసం చేస్తున్నారని ఆరోపణలు చేశారు.
సతీష్ రెడ్డి వల్ల జగన్ కు లక్ష మెజారిటీ :
సతీష్ రెడ్డి తీరు వైసీపీ అధినేత జగన్ కు కలిసొచ్చేలా మారిందంటున్నారు జిల్లా నేతలు. గతంలో పులివెందుల నియోజకవర్గం నుంచి కందుల రాజమోహన్ రెడ్డి పోటీ చేస్తే.. టీడీపీకి అత్యధిక ఓట్లు వచ్చాయని, సతీష్ రెడ్డి నాలుగుసార్లు పోటి చేసినా.. 30 వేలు, 49వేలు, 60వేలు, 70వేల ఓట్ల తేడాతో చిత్తుగా ఓడిపోవాల్సి వచ్చిందని గుర్తు చేస్తున్నారు.
ఈ పరిస్థితి చూస్తోంటే.. వచ్చే 2019 ఎన్నికల్లో జగన్ లక్ష మెజారిటీతో గెలవడం ఖాయమంటున్నారు సదరు నేతలు. సతీష్ రెడ్డి కోసం పనిచేసే పార్టీ నేతలను కూడా ఆయన పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు జిల్లాకు చెందిన నేతలు. ఆయన తరుపున ధర్నాల్లో పాల్గొని కేసుల్లో ఇరుక్కున్న వారిని సతీష్ రెడ్డి అసలు పట్టించుకోవడం లేదని వాపోతున్నారు.