బాలయ్యకు డెడ్ లైన్: 'పీఏ వైపో?.. కార్యకర్తల వైపో?.. తేల్చుకో'
పీఏ కావాలో.. పార్టీ నేతలు కావాలో తేల్చుకోవాలంటూ అసమ్మతి నేతలంతా తాజాగా బాలయ్యకు డెడ్ లైన్ విసిరారు. పీఏను గనుక సాగనంపకపోతే..
హిందూపురం: ఎమ్మెల్యే బాలయ్య ఇలాఖాలో అసమ్మతి సెగ రగులుతోంది. బాలయ్య పీఏ ఆగడాలు పెచ్చరిల్లడంతో.. ఇన్నాళ్లు అంతర్గతంగానే మదనపడ్డ నేతలంతా.. ఇప్పుడు బహిరంగంగానే సవాల్ విసురుతున్నారు.
'నాకు తెలియకుండా ఏది జరగవద్దు': రహస్య భేటీలపై బాలయ్య వార్నింగ్
పీఏ కావాలో.. పార్టీ నేతలు కావాలో తేల్చుకోవాలంటూ అసమ్మతి నేతలంతా తాజాగా బాలయ్యకు డెడ్ లైన్ విసిరారు. వారం రోజుల్లోగా పీఏను గనుక సాగనంపకపోతే.. తామే పార్టీ పదవులకు రాజీనామా చేసి ఎన్టీఆర్ విగ్రహం ఎదుట నిరాహార దీక్షకు దిగుతామని తేల్చి చెప్పారు.
కాగా, నియోజకవర్గంలో పీఏ పెత్తనం పెరిగిపోవడం.. సినిమా షూటింగ్స్ తో బిజీగా ఉన్న బాలయ్య వీటిపై అంతగా ఫోకస్ చేయకపోవడంతో.. వివాదం మరింత పెరిగింది. ఆఖరికి రహస్య భేటీలు నిర్వహించి మరీ.. బాలయ్య పీఏపై యుద్దం ప్రకటించేదాకా పరిస్థితి వెళ్లింది.
టీడీపీ అధిష్టానం సైతం ఈ పరిస్థితులన్నింటిని ఓ కంట కనిపెడుతూనే ఉంది. ఇంతవరకు బాలయ్య మాత్రం రంగంలోకి దిగలేదు. దీంతో అసమ్మతి నేతలు అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారు. భారీ ర్యాలీలతో తమ అసమ్మతిని చాటి చెప్పాలని ప్లాన్ చేస్తున్నారు.
ముఖ్యంగా మాజీ ఎమ్మెల్యే సీసీ వెంకటరాముడు, మరో కీలక నాయకుడు అంబికా లక్ష్మీ నారాయణ నేతృత్వంలో అసమ్మతి సెగ రగులుతోంది. భారీ ర్యాలీలకు వీరు ప్రణాళికలు రచించడంతో.. అప్రమత్తమైన బాలకృష్ణ పీఏ శేఖర్ తన రాజకీయ పలుకుబడిని ఉపయోగించుకుని.. అసమ్మతిని అణిచేయడానికి ప్రయత్నిస్తున్నారన్న వాదనలు వినిపస్తున్నాయి.
బాలయ్యకు షాక్ :హిందూపురంలో పోటాపోటీ ర్యాలీలు,తమ్ముళ్ళ పయనమెటు?
ర్యాలీల సమాచారంతో అప్రమత్తమైన పోలీసులు.. 144సెక్షన్ తో పాటు యాక్ట్-30ని ప్రయోగించారు. దీంతో మండలంలోని 11పంచాయితీల్లో పోలీసుల నిఘా కొనసాగుతోంది. మొత్తం 450మంది పోలీసులతో ఆయా పంచాయితీ పరిధిలో భద్రత ఏర్పాటు చేశారు.
చిలమత్తూరులో భారీగా పోలీసులను మోహరించడంతో.. అసమ్మతి నాయకులంతా మండలానికి సరిహద్దులో ఉన్న బాగేపల్లి షాదీమహల్ ప్రాంతంలో సమావేశం నిర్వహించాలని భావించారు. అనుకున్న ప్రకారం.. బాగేపల్లిలోని సుంకులమ్మ ఆలయం వద్ద సమావేశం అయ్యారు. అయితే ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో.. అక్కడికెళ్లడానికి పోలీసులు నిరాకరించారు.
ఇదిలా ఉంటే, నియంత పాలన కొనసాగిస్తున్న పీఏ శేఖర్ వర్గీయులను నియోజకవర్గం నుంచి సాగనంపేదాకా తమ పోరాటం ఆగదని మాజీ ఎమ్మెల్యే వెంకటరాముడు, అంబికా లక్ష్మీ నారాయణ తేల్చి చెప్పారు. ప్రజాస్వామిక నిరసనలకు కూడా పోలీసులు అడ్డం తగులుతున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు.
శేఖర్ను తరిమికొట్టి పార్టీని బలోపేతం చేయాలని కార్యకర్తలకు నేతలు పిలుపునిచ్చారు. ఈ నిరసన కార్యక్రమంలో సుమారు 1500మంది కార్యకర్తలు పాల్గొన్నట్టు సమాచారం.