షా కాన్వాయ్పై దాడి: టీడీపీ నేతల ధర్నా, కార్యకర్తల విడుదల, డీజీపీకి బీజేపీ ఫిర్యాదు
అమరావతి/తిరుపతి: భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కాన్వాయ్పై శుక్రవారం జరిగిన దాడి తీవ్ర అలజడి రేపిన విషయం తెలిసిందే. స్వామివారిని దర్శించుకుని తిరుగు ప్రయాణమవుతున్న అమిత్ షా కాన్వాయ్ పై దాడి చేశారనే ఆరోపణలతో ముగ్గురు టీడీపీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
టీడీపీ కార్యకర్తల అరెస్టుపై తిరుపతి ఎమ్మెల్యే సుగుణమ్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేగాక, శుక్రవారం రాత్రి నుంచి శనివారం ఉదయం వరకు అలిపిరి పోలీస్స్టేషన్ వరకు ధర్నాకు దిగారు. కేంద్రం, రాష్ట్రంలోని ప్రతిపక్షం కుమ్మక్కై టీడీపీపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నాయంటూ ఆరోపించారు.
ఎన్టీఆర్పై చెప్పులు, బాలకృష్ణ మాట్లాడుతుంటే నవ్వుతారా?: బాబు వైఖరిపై సోము నిప్పులు
భారీ సంఖ్యలో టీడీపీ శ్రేణులు అలిపిరి పోలీస్స్టేషన్ ఎదుట బైఠాయించటంతో కొన్ని గంటల పాటు ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. పరిస్థితి అదుపు తప్పుతుండటంతో అప్రమత్తమైన పోలీసులు టీడీపీ కార్యకర్తలను విడుదల చేశారు.
విభజన చట్టంలోని హామీలు నెరవేర్చాలని శాంతి యుతంగా నిరసన తెలుపుతున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై బీజేపీశ్రేణులు ఉద్దేశపూర్వకంగానే కవ్వింపు చర్యలకు పాల్పడ్డారని ఎమ్మెల్యే సుగుణమ్మ, తుడా ఛైర్మన్ నరసింహయాదవ్ ఆరోపించారు.
టీడీపీ దాడిపై బీజేపీ ఆందోళన
ఇది ఇలా ఉండగా, అమిత్ షా కాన్వాయ్పై టీడీపీ నేతలు, కార్యకర్తల రాళ్ల దాడి నేపథ్యంలో, బీజేపీ శ్రేణులు మండిపడుతున్నాయి. శనివరాం తిరుపతిలోని నాలుగుకాళ్ల మంటపం వద్ద బీజేపీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. అలిపిరి ఘటనకు ప్రభుత్వ వైఫల్యమే కారణమని ఈ సందర్భంగా వారు మండిపడ్డారు.
ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఘటనకు బాధ్యత వహిస్తూ హోం మంత్రి చినరాజప్ప తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. దాడికి దిగిన టీడీపీ నేతలను అరెస్ట్ చేయాలని నినాదాలు చేశారు.
డీజీపీకి ఫిర్యాదు
అమిత్ షా కాన్వాయ్పై దాడి జరిగిన నేపథ్యంలో బీజేపీ నేత సోము వీర్రాజు, పలువురు నేతలు.. ఈ దాడికి పాల్పడిన టీడీపీ కార్యకర్తలపై చర్యలు తీసుకోవాలంటూ ఏపీ డీజీపీ మాలకొండయ్యకు ఫిర్యాదు చేశారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఎస్పీని సస్పెండ్ చేయాలని కోరారు.
బీజేపీ నేతలపై భౌతిక దాడులు జరుగుతున్నాయని, తమ కార్యకర్తలకు రక్షణ కల్పించాలని సోము వీర్రాజు ఈ సందర్భంగా డీజీపీని కోరారు. కాగా, బీజేపీ నేతల ఫిర్యాదు మేరకు కొందరిపై కేసులు పెట్టి అరెస్ట్ చేశామని డీజీపీ చెప్పారు. తమ సిబ్బంది తప్పు ఏమైనా ఉంటే దర్యాప్తు జరిపి చర్యలు తీసుకుంటామని చెప్పారు.