మోడీతో జగన్ భేటీ: టిడిపి డొంక తిరుగుడు, మోడీని అవమానించడం కాదా?
ఓ ప్రతిపక్ష నేతగా ఉన్న వైయస్ జగన్ మోడీని కలవడాన్ని తెలుగుదేశం పార్టీ నాయకులు తప్పు పడుతున్నారు. ఇది ఏ మేరకు సమంజసమనేది ప్రశ్న.
విజయవాడ: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రధాని మోడీని కలవడంపై తెలుగుదేశం పార్టీ నాయకులు డొంక తిరుగుడుగా వ్యవహరిస్తున్నారు. వారి వాదన వింతగా కూడా ఉంది. ప్రధాని మోడీతో భేటీ కోసం వైయస్ జగన్ చాలా కాలంగా ప్రయత్నిస్తున్న విషయం కొత్తదేమీ కాదు.
ఎట్టకేలకు ఆయనకు మోడీతో భేటీకి అవకాశం చిక్కింది. మోడీ తలుచుకోవడం వల్లనే అది సాధ్యమైందనేది కాదనలేని విషయం. జగన్, నరేంద్ర మోడీ మధ్య జరిగిన సంభాషణపై మీడియాలో వివిధ రకాల ప్రచారం సాగుతోంది. వాటిలో ఏది నిజం, ఏది కాదనేది చెప్పడం కూడా కష్టమే.
అయితే, తెలుగుదేశం పార్టీ మాత్రం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. మోడీతో జగన్ భేటీ కాకుండా నిలువరించగలమనే టిడిపి విశ్వాసంపై దెబ్బ పడింది. ఆర్థిక ఉన్మాదిగా జగన్ను అభివర్ణిస్తూ మోడీతో జగన్ భేటీ కాకుండా చూడగలమనే ధైర్యం ప్రదర్శిస్తూ వచ్చింది. అయితే తాజా భేటీతో టిడిపి నాయకుల నమ్మకం సడలిపోయింది.
కేసుల భయంతోనే...
కేసుల భయంతోనే జగన్ ప్రధానిని కలిశారని మంత్రి నక్కా ఆనందబాబు వ్యాఖ్యానించారు. మోడీతో భేటీపై జగన్ వాస్తవాలను ప్రజలకు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. జగన్కు మోడీని కలవాల్సిన అవసరం ఏం వచ్చిందని ఆయన ప్రశ్నించారు. ప్రధానిని ఓ రాష్ట్రానికి చెందిన ప్రతిపక్ష నాయకుడు కలవడం తప్పెలా అవుతుందో మంత్రికి తెలిసినట్లు లేదని అంటున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి మీద ఫిర్యాదు చేయడానికి, రాష్ట్ర సమస్యలను చెప్పడానికి ప్రతిపక్ష నేత అయిన జగన్ మోడీని కలవడం ఏ విధమైన అభ్యంతకర విషయమో అర్థం కావడం లేదని వ్యాఖ్యానిస్తున్నారు.
కేసుల భయంతోనే...
కేసుల భయంతోనే జగన్ ప్రధాని మోదీని కలిశారని మంత్రి నక్కా ఆనందబాబు అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. వైసీపీ అధినేత జగన్ మోహన్రెడ్డి గత బుధవారం ఢిల్లీలో ప్రధాని మోడీతో సమావేశమయ్యారు. దాదాపు 40 నిమిషాల పాటు చర్చించుకున్నారు. రాష్ట్రంలోని రైతుల సమస్యలు, అగ్రిగోల్డ్ బాధితుల సమస్యలు తీర్చేలా చొరవ తీసుకోవాలని ప్రధానిని కోరినట్లు జగన్ భేటీ అనంతరం చెప్పారు.
మోడీని ఎందుకు అనడం లేదు...
తెలుగుదేశం పార్టీ నాయకులు వింత వాదనలు చేస్తున్నారు. మోడీని కలిసినందుకు జగన్ను తప్పు పడుతున్నారు. కానీ మోడీని తీవ్రంగా తప్పు పట్టడానికి వెనుకాడుతున్నారు. కాస్తా విమర్శలు చేసినప్పటికీ అంత ఘాటుగా వారి వ్యాఖ్యలు లేవు. తెలుగుదేశం పార్టీ నాయకులు చేసిన వ్యాఖ్యలకు బిజెపి నాయకులు ఘాటుగానే సమాధానాలు ఇచ్చారు. జగన్కు మోడీ అపాయింట్మెంట్ ఇవ్వడం తెలుగుదేశం పార్టీ నాయకులకు మింగుడు పడడం లేదనే విషయం అర్థమవుతూనే ఉంది.
మోడీని అవమానించడం కాదా...
ఒక రాష్ట్రానికి ప్రతిపక్ష నాయకుడైన వైఎస్ జగన్కు అపాయింట్మెంట్ ఇస్తే ప్రధాని మోడీని తెలుగుదేశం పార్టీ నాయకులు తప్పు పడుతున్నారు. ఇది మోడీని తెలుగుదేశం నాయకులు అవమానించడం కాదా అనే ప్రశ్న వేస్తున్నారు. దోషిగా తేలకముందే జగన్పై తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్న తెలుగుదేశం నాయకులు తమది తప్పు అని ఏ కోశానా అనుకోవడం లేదు. ఆర్థిక ఉన్మాది, దోషి అనే మాటలు వాడడం తప్పని వారు అనుకోవడం లేదు.