ఆ ఇద్దరు: జగన్ రాజకీయాలకు ఎదురొడ్డి.. పులివెందులలో టీడీపీని విస్తరిస్తున్నారట!
ప్రత్యర్థికి కంచుకోట లాంటి రాజకీయ శిబిరంలో పావులు కదపడం అంటే మామూలు విషయం కాదు. ఇక్కడ పొలిటికల్ గేమ్ ను జీరో నుంచి మొదలుపెట్టాల్సి ఉంటుంది కాబట్టి.. ఆ పనిని భుజానికెత్తుకోవడం అనేక సవాళ్లతో కూడుకున్న ప
కడప: ప్రత్యర్థికి కంచుకోట లాంటి రాజకీయ శిబిరంలో పావులు కదపడం అంటే మామూలు విషయం కాదు. ఇక్కడ పొలిటికల్ గేమ్ ను జీరో నుంచి మొదలుపెట్టాల్సి ఉంటుంది కాబట్టి.. ఆ పనిని భుజానికెత్తుకోవడం అనేక సవాళ్లతో కూడుకున్న పని. ఇదే తరహాలో ఏపీ అధికార పార్టీకి చెందిన ఇద్దరు నేతలు ప్రత్యర్థి కంచుకోటలో చాలాకాలంగా అదే పనిలో నిమగ్నమయ్యారు.
టీడీపీకి చెందిన సతీష్ రెడ్డి, రామ్ గోపాల్ రెడ్డి.. వీరిద్దరు వైసీపీ అధినేత జగన్ కంచుకోట అయిన పులివెందులలో టీడీపీ రాజకీయాలను విస్తరించడానికి చాలాకాలంగా ప్రయత్నిస్తున్నారు. నియోజకవర్గంలో టీడీపీని బలోపేతం చేసేందుకు వీరిద్దరు ప్రయత్నిస్తున్న తీరు చూసి వైసీపీ జడుసుకుంటోందని టీడీపీ అనుకూల మీడియా చెబుతోంది. జడుసుకునేంత పరిస్థితి లేకపోయినప్పటికీ.. కొంతలో కొంతైనా వీరు ఏటి ఎదురీదే ప్రయత్నం చేస్తున్నారన్నది మాత్రం వాస్తవం.
ఓటు బ్యాంకు కొల్లగొట్టడమే ధ్యేయంగా!
సతీష్ రెడ్డి ప్రస్తుతం మండలి డిప్యూటీ చైర్మన్ గా, రామ్ గోపాల్ రెడ్డి రాయలసీమ టీడీపీ శిక్షణా శిబిరం డైరెక్టర్ గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి కృషితో పులివెందులలో టీడీపీ ఓటు బ్యాంకు క్రమంగా పెరుగుతోందని ఆ పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. 2004,2009, ఎన్నికల నాటి కన్నా 2014ఎన్నికల్లో వైఎస్ కుటుంబానికి చెందిన ఓటు బ్యాంకును 50వేలకు పైగా కొల్లగొట్టడంలో వీరిద్దరు సఫలమయ్యారని చెబుతున్నారు.
ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొని:
పులివెందుల నియోజకవర్గాన్ని తన కనుసన్నుల్లో శాసించిన వైఎస్ కుటుంబం.. గతంలో ఈ ఇద్దరు నేతలను ఆర్థిక ఇబ్బందులకు కూడా చేసిందని టీడీపీ శ్రేణులు చెబుతున్నాయి. ఆర్థిక మూలాలను దెబ్బతీయడం ద్వారా వీరి ప్రయత్నాలకు చెక్ పెట్టాలని అప్పట్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రయత్నించారనేది వారి వాదన. అలా వైఎస్ ఎన్ని ఇబ్బందులు పెట్టినా.. వీరిద్దరు పార్టీని ముందుకు నడింపించడానికి వెనుకాడటం లేదని పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయట.
గండికోట ప్రాజెక్టు:
గండికోట ప్రాజక్టు నీటిని పులివెందులకు తెచ్చేవరకు గడ్డం, తల వెంట్రుకలు తీయనని శపథం చేసిన సతీష్ రెడ్డి.. ఆ హామిని నెరవేర్చడంతో.. ఆయన పట్ల నియోజకవర్గంలో కొంత సానుకూలత విస్తరించదని టీడీపీ అనుకూల మీడియా అభిప్రాయపడుతోంది. దీనికి తోడు రామ్ గోపాల్ రెడ్డి కూడా ప్రజల్లోకి బాగానే చొచ్చుకెళ్తున్నారట. దీంతో పులివెందులలో టీడీపీకి వీరిద్దరు భవిష్యత్తుపై ఆశలు కల్పిస్తున్నారని ఆ పార్టీ అనుకూల వర్గం చెబుతోంది.
విభేదాలను పక్కనబెట్టి:
సతీష్ రెడ్డి-రామ్ గోపాల్ రెడ్డి మధ్య ఇటీవల అభిప్రాయ భేదాలు వచ్చాయన్న వార్తలు వచ్చాయి. దీంతో పులివెందులలో టీడీపీకి ఈ పరిణామం కొంత ప్రతికూలంగా మారిందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. డ్యామేజీ పెద్దది కాకముందే అప్రమత్తమైన వీరిద్దరు.. తిరిగి చేతులు కలిపారట. జగన్ ను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు కలిసే అడుగేయాలని నిర్ణయించుకున్నారట. చూడాలి మరి జగన్ కంచుకోటలో టీడీపీని వీరిద్దరు ఎంతమేర బలోపేతం చేస్తారో!