విశాఖ భూముల వివాదం : నిరూపించు..లేదంటే.. వైసీపీ మంత్రి అవంతికి టీడీపీ ఎమ్మెల్యే సవాల్ !!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ,టీడీపీ నేతల మధ్య వివాదాలు సద్దుమణగలేదు. వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి భూముల కబ్జాల విషయంలో ఆరోపణలు,ప్రత్యారోపణలతో ఏపీ అట్టుడుకుతోంది. ప్రభుత్వ భూములు కబ్జా చేశారని టిడిపి మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, అతని సోదరుడు పల్లా శంకర్రావు కు సంబంధించిన భూములలోరెవెన్యూ అధికారులు కూల్చివేతలకు పాల్పడగా టిడిపి నేతలు ప్రభుత్వ చర్య పై మండి పడుతున్నారు.ఏకంగా ఈ వ్యవహారంలో పల్లా శ్రీనివాస రావుకు మద్దతుగా విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు వైసీపీ మంత్రి అవంతి శ్రీనివాస్ కు సవాల్ విసిరారు.
విశాఖలో కూల్చివేతల పర్వం ... టీడీపీ నేతల ఆక్రమణలని మండిపడిన మంత్రి
తాజాగా విశాఖలో టీడీపీ నేత మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు , పల్లా సోదరుడు పల్లా శంకర్రావు పేరుతో భూముల కబ్జాలకు పాల్పడ్డారని, దాదాపు 20 చోట్ల వారు ఆక్రమణలకు పాల్పడ్డారని రెవెన్యూ అధికారులు కూల్చివేతలకు పాల్పడ్డారు. పల్లా శ్రీనివాసరావుకు సంబంధించిన భూముల్లో ఉన్న ఫెన్సింగ్ ను తొలగించారు. ఇక ఇదే విషయంపై మంత్రి అవంతి శ్రీనివాస్ సైతం చంద్రబాబు హయాంలో విశాఖను తమ అడ్డాగా మార్చుకుని టిడిపి నేతలు భారీగా ప్రభుత్వ భూములను ఆక్రమించుకున్నారు అని మండిపడ్డారు.
ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న భూమి ఆక్రమిత ప్రభుత్వ భూమి అంటున్న అధికారులు
ఖచ్చితంగా ఆక్రమణలను తొలగిస్తామని,అలాగే ప్రభుత్వ భూములు ఆక్రమించిన వారు ఎంతటి వారైనా కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి అవంతి శ్రీనివాస్ హెచ్చరించారు. చంద్రబాబును సైతం టార్గెట్ చేసి విమర్శలు గుప్పించారు. తమ నేతలు ఎక్కడా భూములు కబ్జాలు చెయ్యలేదని చంద్రబాబు చెప్పగలరా అంటూ ప్రశ్నించారు.స్వాధీనం చేసుకున్నది ఆక్రమిత భూమి అని అధికారులు స్పష్టంగా చెప్తున్నారని,అయినా టీడీపీ నేతలు కక్ష సాధింపులని చెప్పటం విడ్డూరంగా ఉందన్నారు.
పల్లాకు మద్దతుగా మంత్రికి టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు సవాల్
అయితే పల్లా శ్రీనివాసరావు తరపున టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు మంత్రి అవంతి శ్రీనివాస్ కి సవాల్ విసిరారు.పల్లా శ్రీనివాసరావు ఎలాంటి ఆక్రమణలకు పాల్పడలేదని నిరూపించాలన్నారు.రెవెన్యూ అధికారులను తీసుకువచ్చి ఎక్కడ ఆక్రమణలు జరిగాయో బహిరంగంగా చూపించాలని, ఒకవేళ పల్లా శ్రీనివాసరావు కబ్జాలకు పాల్పడినట్లు తేలితే రాజకీయాల నుండి పల్లా శ్రీనివాసరావు వైదొలుగుతారని,నిరూపించ లేకపోతే మంత్రి అవంతి శ్రీనివాస్ మంత్రి పదవికి రాజీనామా చేయాలని ఆయన సవాల్ చేశారు.
నిరూపించకుంటే మంత్రి పదవికి రాజీనామా చెయ్యాలని సవాల్ విసిరిన టీడీపీ ఎమ్మెల్యే
కావాలని టిడిపి నేతలపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని వెలగపూడి రామకృష్ణబాబు మండిపడ్డారు. నిరూపించకుంటే మంత్రి పదవికి రాజీనామా చెయ్యాలని తాను చేసిన సవాల్ కు మంత్రి సిద్ధమా అంటూ ప్రశ్నించారు టిడిపి ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు.ఏది ఏమైనా సాగరనగరం విశాఖపట్నంలో టిడిపి, వైసిపి నేతల మధ్య భూముల కబ్జాల వివాదం తారాస్థాయికి చేరుతుందని చెప్పక తప్పని పరిస్థితి. ఇప్పటికే టీడీపీ నేతలు ప్రభుత తీరుపై నిప్పులు చెరుగుతున్నారు. మరి ఈ వ్యవహారంలో ముందు ముందు ఏం జరుగుతుందో వేచి చూడాలి.