అవినీతి, అక్రమాలను ప్రశ్నించినందుకే తప్పుడు ప్రచారం - ఎమ్మెల్యే కూన రవి
ఆముదాలవలస ఎమ్మెల్యే, టీడీపీ నేత కూన రవికుమార్ పై.. పొందూరు కేజీబీవీ పాఠశాల ప్రిన్సిపల్ చేసిన ఆరోపణలు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారాయి. అయితే అవి అవాస్తవమని ఎమ్మెల్యే ఖండించారు. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న రవికుమార్.. అమరావతిలోని పార్టీ నేతలతో ఫోన్ ద్వారా మాట్లాడుతూ తనపై జరుగుతున్న తప్పుడు ప్రచారంపై స్పందించారు. అమెరికా నుంచి తిరిగి వచ్చిన తర్వాత పూర్తి వివరాలతో మీడియా ముందుకు వస్తానని ఆయన స్పష్టం చేశారు. ప్రజల ముందే అన్ని ఆధారాలు ఉంచుతానని.. తప్పుడు ప్రచారం వెనుక ఉన్న అసలు కుట్రదారులను బయట పెడతానని ఎమ్మెల్యే హెచ్చరించారు.
అవినీతి, అక్రమాలను ప్రశ్నించినందుకే..
కేజీబీవీ పాఠశాలలో ప్రిన్సిపల్ అవినీతి, అక్రమాలను ప్రశ్నించినందుకే తనపై ఆరోపణలు చేసినట్టు రవి కుమార్ వ్యాఖ్యానించారు. సదరు ప్రిన్సిపల్ విద్యార్థినుల వద్ద అడ్మిషన్లకు అక్రమంగా డబ్బులు వసూలు చేయడం.. అలానే వారికి ఇవ్వాల్సిన నిత్యావసర వస్తువులను దారి మళ్లించడం చేశారని అన్నారు. అంతే కాకుండా విద్యార్థినులను ఇంటి పనుల కోసం వాడుకోవడం.. మెగా టీచర్-పేరెంట్ మీటింగ్ కోసం అనధికారికంగా నగదు వసూలు చేయడం వంటి అంశాలపై తల్లిదండ్రుల నుంచి ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. అ విషయాలను ప్రిన్సిపల్ను ప్రశ్నించినందుకే.. వైసీపీ నేతల సహకారంతో ప్రిన్సిపల్ తనపై వ్యక్తిగత ఆరోపణలు చేశారని రవికుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

అలానే "తల్లికి వందనం" కార్యక్రమంపై ముగ్గురు ప్రిన్సిపల్స్తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించానని రవికుమార్ స్పష్టం చేశారు. అయితే తాను కేవలం పొందూరు కేజీబీవీ ప్రిన్సిపల్తోనే వీడియో కాల్ చేశానంటూ అబద్ధపు ప్రచారం జరుగుతోందని మండిపడ్డారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించి, గతంలో అదే ప్రిన్సిపల్ సస్పెండ్ అయ్యిందని ఎమ్మెల్యే గుర్తు చేశారు. అలాంటి చరిత్ర కలిగిన వ్యక్తిని ఇప్పుడు వైసీపీ నేతలు ఆయుధంగా వాడుకుంటూ తనపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారన్నారు.
అంతకు ముందు..
ప్రిన్సిపల్ సౌమ్య ప్రముఖ ఛానల్ తో మాట్లాడుతూ ఎమ్మెల్యే తనను శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నాడని ఆరోపించారు. ఎమ్మెల్యే అనుచరులు సైతం నానా ఇబ్బందులు పెడుతున్నారని అన్నారు. ఆరోపించారు. ఎమ్మెల్యే వేధింపులు తట్టుకోలేకపోతున్నానని.. తన వల్ల కావడం లేదని ఎమోషనల్ అయ్యారు. ఉన్నతాధికారులు సైతం ఎమ్మెల్యే చెప్పిందే వింటున్నారని అసహనం వ్యక్తం చేశారు. తనకు చచ్చిపోవాలని ఉందని.. ఆత్మహత్య చేసుకుంటానని ప్రిన్సిపల్ సౌమ్య బోరున విలపించారు. అడ్మిషన్ల కోసం మీటింగ్ అని చెప్పి రాత్రి 11 గంటలకు ఫోన్ చేస్తున్నారని ప్రిన్సిపల్ వాపోయారు. ఇందుకు సంబంధించిన నైట్ టైమ్ వీడియో కాల్ స్క్రీన్ షాట్లు సైతం బయటపెట్టడంతో సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ క్రమంలోనే ఎమ్మెల్యే పై ఎస్సీ కమిషన్ కు ఫిర్యాదు కూడా చేశారు.
మరోవైపు అమరావతిలో సీఎం చంద్రబాబు నాయుడు పార్టీ నేతలతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆముదాలవలస సహా కొందరు ఎమ్మెల్యేలపై వస్తున్న ఆరోపణల గురించి సైతం సీఎం చర్చించారని సమాచారం. పార్టీ ప్రతిష్ఠకు భంగం కలిగించే ఏ వ్యవహారాన్నీ ఉపేక్షించమని ముఖ్యమంత్రి హెచ్చరించారు.












Click it and Unblock the Notifications