చంద్రబాబును మట్టు పెట్టడం జగన్కు పెద్ద పనేమీ కాదు: టీడీపీ ఎమ్మెల్యే సంచలనం
అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైెఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అరాచకాలకు చరమగీతం పలికే రోజులు దగ్గరలోనే ఉన్నాయని తెలుగదేశం శాసన సభ్యుడు నిమ్మల రామానాయుడు అన్నారు. వైఎస్ఆర్సీపీ ఇవే చివరి రోజులని జోస్యం చెప్పారు. ఇక ముందు వైఎస్ఆర్సీపీ రాష్ట్రంలో ఎక్కడా కనిపించదని, రానున్నదంతా తెలుగుదేశం కాలమేనని ధీమా వ్యక్తం చేశారు.
ఈ ఉదయం ఆయన పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఇకపై తాము ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికల్లో గెలవలేమని వైఎస్ జగన్, వైఎస్ఆర్సీపీ నాయకులు నిర్ణయానికి వచ్చారని, అందుకే అరాచక పాలనను సాగిస్తోన్నారని మండిపడ్డారు. తమ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడిని మట్టు పెట్టడం ద్వారా ప్రతిపక్షం అనేది లేకుండా చేయడానికి వైఎస్ఆర్సీపీ నాయకులు కుట్ర పన్నారని ఆరోపించారు.
సొంత చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డిని జగనే హత్య చేయించాడని విమర్శించారు. తన చెల్లి వైఎస్ షర్మిల, తల్లి విజయమ్మను పార్టీ నుంచి బయటికి పంపించిన జగన్కు చంద్రబాబును మట్టుపెట్టడం పెద్ద పని కాదని నిమ్మల రామానాయుడు ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఇండియన్ పోలీస్ సర్వీస్ ఉందా లేక ఇండియన్ జగన్ సర్వీస్ ఉందా అని పోలీస్ డైరెక్టర్ జనరల్ను ప్రశ్నించారు. కృష్ణా జిల్లా పెడనలో వైఎస్ జగన్ పర్యటన సందర్భంగా తమ పార్టీ నాయకులను పోలీసులు ముందస్తుగా హౌస్ అరెస్ట్ చేశారని విమర్శించారు.
మేమూ పంచుతాం - జగన్ను మించి పంచుతాం: చంద్రబాబు ఉచిత హామీల సునామీ
సొంత నియోజకవర్గంలో చంద్రబాబు పర్యటన జరుపుతుంటే వైఎస్ఆర్సీపీ అరాచకాలను సృష్టిస్తోందని, ఆయనను ఎక్కడికక్కడ అడ్డుకునే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. ఇంతా జరిగినా కుప్పంలో వైఎస్ఆర్సీపీ నాయకుల అరెస్టులు ఇప్పటివరకు ఎందుకు లేవని రామానాయుడు ప్రశ్నించారు. రాష్ట్రంలో రెండు రాజ్యాంగాలను అమలు చేస్తున్నారా? అని నిలదీశారు. తమ పార్టీకి చెందిన నాయకులపై ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదని నిమ్మల రామానాయుడు తేల్చి చెప్పారు.
వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన ఈ మూడు నెలల్లో ఆయనపై ప్రజల్లో వ్యతిరేకత పెరిగిందని, తన సొంత సర్వేలు కూడా ఓడిపోతామని స్పష్టం చేశాయని రామానాయుడు అన్నారు. సొంత పార్టీ ఎమ్మెల్యేలు సైతం జగన్ రెడ్డి ముఖం చూడటానిక్కూడా ఇష్ట పడట్లేదని ఆరోపించారు. వచ్చేది తమ ప్రభుత్వమేనని, జగన్ మళ్లీ అధికారంలోకి వస్తాడనే భ్రమలో కొందరు అధికారులు ఉన్నారని, వారిని న్యాయస్థానాల్లో నిలబెడతామని హెచ్చరించారు.