భారీ వర్షం: టీడీపీ నేతలకు తప్పిన ప్రమాదం, టెన్షన్ పెట్టిన విమానం..!
అమరావతి: ఉత్తరాంధ్రకు చెందిన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు పెద్ద ప్రమాదం తప్పింది. మంత్రి నారాయణ కుమార్తెతో గంటా తనయుడి వివాహం అనంతరం తిరిగి వస్తున్న క్రమంలో ఈ సంఘట చోటు చేసుకుంది. నెల్లూరులో జరిగిన ఈ వివాహానికి వెళ్లేందుకు మంత్రి గంటా.... ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల కోసం ప్రత్యేక విమానం ఏర్పాటు చేశారు.
వివాహం అయిన తర్వాత టీడీపీ నేతలు రేణిగుంట నుంచి విశాఖపట్నానికి బయల్దేరారు. విశాఖ మేఘావృతమై, వర్షం పడుతుండటంతో ఈ విమానం దిగేందుకు అనుమతి లభించలేదు. దీంతో గంట పాటు ఆకాశంలోనే చక్కర్లు కొడుతూ ఉండిపోయింది.
దీంతో ట్రూజెట్ విమానం గాల్లోనే ఉండిపోగా, టీడీపీ నేతలంతా కొంత ఆందోళనకు గురయ్యారు. అనంతరం మేఘాలు కాస్త తెరిపివ్వగానే విమానం సురక్షితంగా ల్యాండ్ కావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
కాగా పెళ్లి అనంతరం మంత్రి నారాయణ తిరుమల శ్రీవారిని ఆదివారం దర్శించుకున్నారు. ఆదివారం ఉదయం వీఐపీ ప్రారంభదర్శన సమయంలో మంత్రి నారాయణ, కుమార్తె, అల్లుడులతో పాటు ఏపీసీసీ రఘవీరారెడ్డి తదితరులు శ్రీవారి సేవలో పాల్గొన్నారు.
విశాఖలో భారీ వర్షం
దక్షిణ తమిళనాడు నుంచి ఉత్తర బంగాళాఖాతం వరకు విస్తరించిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో విశాఖ జిల్లాలో గత 24 గంటలుగా విస్తారంగా వర్షం కురుస్తోంది. శనివారం మధ్యాహ్నాం నుంచి నిరంతరంగా కురుస్తున్న వర్షంతో రహదారులన్నీ జలమయమయ్యాయి.
లోతట్టు ప్రాంతాల్లో భారీగా నీరు చేరడంతో ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. మరో 12 గంటల పాటు ఇదే విధంగా భారీ వర్షాలు కురుస్తాయని విశాఖలోని తుఫాన్ హెచ్చరికల కేంద్రం అధికారులు హెచ్చరించారు.