ఏపీ అసెంబ్లీలో గందరగోళం - టీడీపీ సభ్యుల సస్పెన్షన్ : వీధి రౌడీలు కాదంటూ..!!
ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో సేమ్ సీన్ రిపీట్ అవుతోంది. మూడు రోజుల విరామం తరువాత సభ ప్రారంభమైన వెంటనే టీడీపీ సభ్యులు మరోసారి ఆందోళనకు దిగారు. జంగారెడ్డి గూడెం మరణాల పైన చర్చ చేపట్టాలంటూ టీడీపీ వాయిదా తీర్మానం ఇచ్చింది. దీనిని స్పీకర్ తిరస్కరించారు. అదే సమయంలో ప్రభుత్వం నుంచి మంత్రి బుగ్గన పెగాసెస్ అంశం ప్రస్తావించారు. దేశ వ్యాప్తంగా పెగాసస్ వ్యవహారం పెద్ద దుమారానికి కారణమైందని.. దీని పైన సుప్రీంకోర్టు విచారణకు కమిటీ వేసిందని చెప్పుకొచ్చారు. తాజాగా, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తన వద్దకు పెగాసస్ అంశం వచ్చిన సమయంలో తాను తిరస్కరించానని..నాటి ఏపీ ముఖ్యమంత్రి కొనుగోలు చేసారని చెప్పారు.
దీనిని ప్రస్తావించిన మంత్రి బుగ్గన దీని పైన సభలో చర్చించి.. తగిన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. చీఫ్ విప్ శ్రీకాంత్ ఇప్పటికే ఇదే అంశం పైన నోటీసు ఇచ్చినట్లుగా పేర్కొన్నారు. దీని పైన చర్చకు స్పీకర్ అంగీకరించారు. దీని పైన ఈ రోజునే చర్చ చేపట్టనున్నారు. ఇదే సమయంలో టీడీపీ సభ్యులు ఆందోళన కొనసాగించారు.
కల్తీ సారా అమ్మకాల పైన చర్చ చేపట్టాలని నినాదాలు చేసారు. స్పీకర్ పోడియం చుట్టు ముట్టారు. కొందరు సభ్యులు పోడియం పైకి ఎక్కి ఆందోళన కొనసాగించారు. ఆందోళన చేస్తున్న సమయంలోనే సభ్యులు పుస్తకాలు - కాగితాలు చింపారు. దీంతో స్పీకర్ సీరియస్ అయ్యారు. నిర్మాణాత్మక మైన ప్రతిపక్షంగా వ్యవహరించాలని స్పీకర్ తమ్మినేని సీతారాం హితవు పలికారు.
సభలో సంస్కార వంతంగా, గౌరవ ప్రథంగా వ్యవహరించాలని సూచించారు. ఇది శాసససభ.. వీధి మార్కెట్ కాదు... మీరు వీధి రౌడీలు కాదంటూ టీడీపీ సభ్యులను ఉద్దేశించి స్పీకర్ వ్యాఖ్యానించారు. సభ పట్ల, స్పీకర్ పట్ల గౌరవం లేకుండా వ్యవహరిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సభలో గందరగోళ పరిస్థితులు ఏర్పడటంతో ఈ రోజు సమావేశాల నుంచి టీడీపీ సభ్యులను సస్పెండ్ చేస్తూ స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు.
సభలో సభ్యుల తీరు ఇదే విధంగా ఉంటే కఠిన చర్చలు తీసుకొనే దిశగా... సభా రూల్స్ మార్పు పైన మంత్రులు - సభ్యులు ప్రివిలేజ్ కమిటీకి సూచనలు చేయాలని స్పీకర్ సూచించారు. దీంతో...ఈ రోజు సభలో పోలవరం అంశం..అదే విధంగా పెగాసస్ అంశం పైన స్వల్పకాలిక చర్చలు జరగనున్నాయి.