ఏపీలో మద్యం ఏరులై పారడం సంస్కరణలా..? సీఎం జగన్పై టీడీపీ నేత బుద్దా వెంకన్న నిప్పులు..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఓ రేంజ్లో ఫైరయ్యారు. మద్యం దుకాణాలు ప్రారంభించి, మద్యం ఏరులై పారడం సంస్కరణలా అని ప్రశ్నించారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించమని చెప్పిన జగన్.. ఇద్దరు ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడాన్ని ఏమనుకోవాలి అని అడిగారు.
దేవుడి స్క్రిప్ట్ అంటూ జగన్మోహన్ రెడ్డి కబుర్లు చెబుతున్నారని బుద్దా వెంకన్న ఫైరయ్యారు. కొద్దిరోజులు మద్యం షాపులను మూసివేసి సంస్కరణలను అమలు చేశామని బీరాలు పోతున్నారని ధ్వజమెత్తారు ఎన్నికల్లో మద్యం ఆనవాళ్లే కనిపించవా అని బుద్దా వెంకన్న నిలదీశారు. దేవుడి పేరుతో కల్లబొల్లి కబుర్లు చెబుుతున్నారని.. ప్రజలు అన్నింటినీ గమనిస్తున్నారని పేర్కొన్నారు.
ఫిరాయింపులను ప్రోత్సహించబోమని చెప్పిన జగన్మోహన్ రెడ్డి.. ఇద్దరు ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎమ్మెల్సీలను కొనుగోలు చేయలేదా అని ప్రశ్నించారు. ప్రజాప్రతినిధులను సంతలో పశువుల్లా కొని.. ఇప్పుడు నీతిసూక్తులు వల్లిస్తున్నారని ఫైరయ్యారు.అంతేకాదు ఎన్నికల సమయంలో వాలంటీర్లతో మద్యం, డబ్బులు డోర్ డెలివరీ చేస్తున్నారని.. ఇందుకు జగన్ను ఆదర్శంగా తీసుకోవాలా అని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిని ప్రశ్నించారు.
జగన్ అంటే ఏంటో ప్రజలకు తెలిసిపోయిందని చెప్పారు. 5 కోట్ల మంది ఆంధ్రులు తుగ్లక్ అని పిలుస్తారని గుర్తుచేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలవకుంటే నేతలను దించేస్తా అని జగన్ బెదిరించడం లేదా అని అడిగారు. దమ్ముంటే ఈ నెల జగనన్న మద్యం దుకాణాలు మూసివేసి ఎన్నికలు నిర్వహించాలని బుద్దా వెంకన్న సవాల్ విసిరారు.