చంద్రబాబు హత్యకు కుట్ర..జగన్ అమెరికా టూర్ అందుకే: ఇంటి వద్ద గొంతు కోసుకుంటా: బుద్ధా వెంకన్న!
విజయవాడ: తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, శాసన మండలి సభ్యుడు బుద్ధా వెంకన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని దారుణంగా హత్య చేయడానికి అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుట్ర పన్నిందని ఆరోపించారు. ఈ కుట్రను అమలు చేయడానికే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమెరికా పర్యటనకు బయలుదేరి వెళ్లారని విమర్శించారు. వైఎస్ జగన్ తన అమెరికా పర్యటన ముగించుకుని రాష్ట్రానికి వచ్చేలోగా చంద్రబాబును అంతం చేయాలనది వైఎస్ఆర్ సీపీ పక్కా స్కెచ్ వేసిందని ధ్వజమెత్తారు. చంద్రబాబును కాపాడుకోవడానికి వైఎస్ జగన్ ఇంటి ముందు తాను ఆత్మహత్య చేసుకోవడానికైనా సిద్ధమని అన్నారు.
భద్రత తగ్గింపు ఇందులో భాగమే..
ఆదివారం ఉదయం బుద్ధా వెంకన్న విజయవాడలో విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబును హతమార్చడానికి కుట్ర పన్నారని ఆరోపించారు. ఇందులో భాగంగా తొలిదశలో చంద్రబాబుకు కల్పించాల్సిన భద్రతను తగ్గించారని అన్నారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కొద్దిరోజుల్లోనే చంద్రబాబు భద్రతను తగ్గించడమే దీనికి ప్రధాన కారణమని చెప్పారు. చంద్రబాబుకు భద్రత పెంచాలని సాక్షాత్తూ హైకోర్టు చేసిన సూచనలను కూడా ప్రభుత్వం పట్టించుకోలేదని అన్నారు. కృష్ణానదికి వరద ప్రవాహాన్ని అంచనా వేయాలనే కారణంతో ఉద్దేశపూరకంగా చంద్రబాబు ఉంటున్న ఇంటి నివాసాన్ని డ్రోన్ ద్వారా విజువల్స్ తీసుకున్నారని బుద్ధా వెంకన్న మండిపడ్డారు. హైసెక్యూరిటీ జోన్ లో ఉన్న చంద్రబాబు ఇంటిని ఎవరి అనుమతి లేకుండా ఎలా విజువల్స్ తీస్తారని ఆయన నిలదీశారు.
మంత్రులు స్వయంగా రెక్కీ..
ఇదంతా చంద్రబాబును హతమార్చే కుట్రలో భాగమేనని అన్నారు. చంద్రబాబు ఇంటిని అణువణువు డ్రోన్ తో విజువల్స్ తీసి రెక్కి నిర్వహించడానికి ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ఇందులో మంత్రుల పాత్ర ఉందని చెప్పారు. వైఎస్ జగన్ ఆదేశాల మేరకు మంత్రులు పేర్నినాని, వెల్లంపల్లి శ్రీనివాస్, బొత్స సత్యనారాయణ, ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి స్వయంగా రెక్కీ నిర్వహిస్తున్నట్లు తనకు అనుమానంగా ఉందని అన్నారు. ప్రాణానికి హాని ఉన్న నాయకుడి ఇంటి విజువల్స్ ను అనుమతి లేకుండా ఎలా చిత్రీకరిస్తారని బుద్ధా వెంకన్న నిలదీశారు. ఇంటిని డ్రోన్ కెమెరాతో విజువల్స్ తీసేముందు అనుమతి తీసుకోవాల్సి ఉందని అన్నారు. కొద్దిరోజులుగా ఆళ్ల రామకృష్ణరెడ్డి చెబుతున్న మాటలు తమ అనుమానాలకు బలాన్ని కలిగిస్తున్నాయని అన్నారు.
ప్రాణం ఇచ్చయినా చంద్రబాబును రక్షించుకుంటా..
చంద్రబాబును రక్షించుకోవడం కోసం తన ప్రాణాలను పణంగా పెడతానని బుద్ధా వెంకన్న అన్నారు. దీనికోసం తాను వైఎస్ జగన్ ఇంటి ముందు ఆత్మహత్య చేసుకుంటానని, గొంతు కోసుకుని ప్రాణత్యాగం చేయడానికైనా తాను వెనుకాడబోనని చెప్పారు. చంద్రబాబు హత్య కోసం ముఖ్యమంత్రి, మంత్రులు చేసే కుట్రను భగ్నం చేయడానికి తాను సదా సిద్ధాంగా ఉన్నానని అన్నారు. వరద వల్ల కృష్ణలంక వంటి ప్రాంతాలు మునిగిపోతే.. మంత్రులు అనిల్ కుమార్ యాదవ్, కొడాలి నాని.. సరదాగా పిట్టగోడలు ఎక్కి కాలక్షేపం చేస్తున్నారని విమర్శించారు. లంక గ్రామాల ప్రజల ఇబ్బందులను గాలికి వదిలేశారని ఆరోపించారు. ఏపీలో వరదలు వచ్చి ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ఏపీ సీఎం జగన్ అమెరికాలో విలాసవంతమైన జీవితం గడుపుతున్నారని మండిపడ్డారు. అదే చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండి ఉంటే ప్రపంచంలో ఎక్కడ ఉన్నప్పటికీ.. రెక్కలు కట్టుకుని రాష్ట్రానికి వచ్చి ఉండేావారని, ప్రజలను కాపాడుకునే వారని అన్నారు.
ప్రజల తిరుగుబాటు తప్పదు
70 రోజుల వైఎస్ జగన్ పరిపాలన అంతా కుట్రలు, కుంతత్రాల మయంతో సాగిందని ధ్వజమెత్తారు. వైఎస్ జగన్ గ్రాఫ్ పడిపోయిందని, త్వరలో ప్రజా తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు. కొత్త ప్రభుత్వానికి కనీసం ఆరునెలల పాటు సమయం ఇవ్వాలని తమ నాయకుడు చంద్రబాబు పార్టీ క్యాడర్ ను ఆదేశించారని, పరిస్థితి చూస్తోంటే.. నెలరోజుల గడువు కూడా అనవసరం అనిపిస్తోందని బుద్ధా వెంకన్న అన్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వం అయిదేళ్ల పాటు కొనసాగదని, ప్రజల్లో తిరుగుబాటు తప్పదని తాను అంచనా వేస్తున్నట్లు చెప్పారు. ప్రజలు తీవ్ర అసంతృప్తితో, ఆగ్రహంతో ఉన్నారని చెప్పారు.