వంగవీటి రాధా కుటుంబం రాష్ట్ర సంపద: సీబీఐతో విచారణ: కేశినేని డిమాండ్: హత్యా రాజకీయాలకు మేం దూరం
విజయవాడ: తెలుగుదేశం పార్టీ నాయకుడు వంగవీటి రాధా నివాసానికి తెలుగుదేశం పార్టీ నేతలు బారులు తీరారు. తనను హత్య చేయడానికి రెక్కీ నిర్వహించారంటూ ఆయన బాంబు పేల్చిన తరువాత విజయవాడ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటూ వస్తోన్నాయి. జగన్ సర్కార్ ఆయనకు భద్రత కల్పించినప్పటికీ.. దాన్ని తిరస్కరించారు. ఆ తరువాత ఆయన నివాసానికి టీడీపీ నేతలు పోటెత్తుతున్నారు. పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు సైతం రాధాను పరామర్శించారు.

పార్టీ మొత్తం అండగా..
తాజాగా- విజయవాడకు చెందిన టీడీపీ లోక్సభ సభ్యుడు కేశినేని నాని.. ఆయన నివాసానికి వెళ్లారు. ధైర్యం చెప్పారు. పార్టీ యావత్తూ అండగా ఉందని చెప్పారు. చంద్రబాబు స్వయంగా రావడానికి గల కారణం ఇదేనని స్పష్టం చేశారు. ఆయన వెంట మాజీ మంత్రి నెట్టెం రఘురాం, మాజీ ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య తదితరులు ఉన్నారు. జాగ్రత్తగా ఉండాలని వారు రాధాకు సూచించారు. పార్టీ నుంచి ఎలాంటి సహాయ, సహాకారాలు కావాలన్నా అందిస్తామని చెప్పారు. రెక్కీ నిర్వహించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు.

వంగవీటి కుటుంబం రాష్ట్ర సంపద..
వంగవీటి కుటుంబం రాష్ట్ర సంపద అని కేశినేని నాని అన్నారు. ఆ కుటుంబాన్ని కాపాడుకుంటామని చెప్పారు. పేద ప్రజలకు వంగవీటి కుటుంబం ఎప్పుడు అండగా ఉంటుందని పేర్కొన్నారు. హత్యా రాజకీయాలకు తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ దూరంగా ఉంటుందని, వాటిని ఏనాడూ ప్రోత్సహించలేదని స్పష్టం చేశారు. ఇదివరకు ఎన్టీ రామారావు, ఇప్పుడు చంద్రబాబు హత్యా రాజకీయాలను ప్రోత్సహించలేదని వ్యాఖ్యానించారు. హత్యా రాజకీయాలకు తెలుగుదేశం పార్టీ పూర్తి వ్యతిరేకమని తేల్చి చెప్పారు.

సిటీని ప్రశాంతంగా ఉంచండి..
వంగవీటి రాధా చాలామంచి వ్యక్తి అని, తాను నష్టపోయినప్పటికీ.. మరొకరిని ఆయన ఇబ్బంది పెట్టరని చెప్పారు. విజయవాడలో పాత పరిస్థితులు రానివ్వకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని కేశినేని నాని అన్నారు. నగరాన్ని ప్రశాంతంగా ఉంచడానికి డీజీపీ, నగర పోలీస్ కమిషనర్ తక్షణ చర్యలను తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాధాపై రెక్కీ జరిగినట్టుగా చెబుతోన్న విషయంపై సమగ్ర దర్యాప్తును జరిపించాల్సిన అవరం ఉందని కేశినేని అన్నారు.

సీబీఐతో విచారణ..
దీనిపై వెంటనే సీబీఐతో దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. సీబీఐ విచారణ కోసం ఎంపీగా తాను కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తానని స్పష్టం చేశారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఆ శాఖ ఉన్నతాధికారుల దృష్టికి రాధాపై రెక్కీ అంశాన్ని తీసుకెళ్తానని కేశినేని అన్నారు. రాధాది పదవులను ఆశించే వ్యక్తిత్వం కాదని, అలాంటి వ్యక్తిని వేధించడం ఏ మాత్రం మంచిది కాదని హితవు పలికారు. రాజకీయాలు ఉన్నన్ని రోజులు వంగవీటి కుటుంబం తెరమరుగు కాబోదని కేశినేని పేర్కొన్నారు.
Recommended Video

ఆ కుటుంబంతో అనుబంధం..
తన కుటుంబానికి, వంగవీటి కుటుంబానికి చాలా అనుబంధం ఉందని కేశినేని అన్నారు. చిన్నప్పటి నుంచీ తనకు బాగా తెలిసిన కుటుంబమని చెప్పారు. బెజవాడలో ఎప్పుడూ కులాల మధ్య ఘర్షణలు, వివాదాలు లేవని పేర్కొన్నారు. కొంతమంది స్వార్థపరులు దీన్ని వాడుకున్నారని, వంగవీటి కుటుంబానికి అనుచరులుగా ఉంటూ ద్రోహం చేశారని విమర్శించారు. ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి కావడానికి ముందు హైదరాబాద్ అంటే భయపడేవారని, అలాంటి నగరంలో శాంతిభద్రతలను నెలకొల్పారని చెప్పారు.












Click it and Unblock the Notifications