విశాఖ గ్యాస్ లీకేజీ బాధితులకు పరిహారం చెల్లింపుల్లో జగన్ మార్క్ రాజకీయం..వివక్షత: కేశినేని నాని
విజయవాడ: విశాఖపట్నం సమీపంలోని ఆర్ఆర్ వెంకటాపురంలో గల ఎల్జీ పాలిమర్స్ కంపెనీలో విష వాయువులు వెలువడిన ఘటనలో మృతుల కుటుంబాలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోటి రూపాయల ఎక్స్గ్రేషియో ప్రకటించడం పట్ల తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, విజయవాడ లోక్సభ సభ్యుడు కేశినేని నాని తప్పుపడుతున్నారు. పరిహారం చెల్లింపుల్లో వైఎస్ జగన్ వివక్షతను చూపిస్తున్నారని విమర్శిస్తున్నారు.
పట్టాలపై నిద్రించిన వలస కార్మికులపై దూసుకెళ్లిన గూడ్స్ బండి: 15 మంది దుర్మరణం
ఎల్జీ పాలిమర్స్ కంపెనీలో స్టైరీన్ గ్యాస్ వెలువడిన దుర్ఘటనలో 12 మంది మరణించారు. పలువురు అస్వస్థతకు గురైన విశాఖపట్నం కింగ్జార్జ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారిని పరామర్శించిన వైఎస్ జగన్..నష్ట పరిహారాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. మృతుల కుటుంబాలకు కోటి రూపాయలు, వెంటిలేటర్పై చికిత్స పొందుతున్న వారికి 10 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియోను చెల్లిస్తామని ప్రకటించారు.
వైఎస్ జగన్ చేసిన ఈ ప్రకటన పట్ల కేశినేని నాని అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు వద్ద నదిలో పర్యాటక లాంచీ మునిగిన ఘటనలో బాధితులకు కూడా కోటి రూపాయల పరిహారాన్ని చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. గత ఏడాది కచ్చులూరు వద్ద చోటు చేసుకున్న ఈ ప్రమాదంలో 50 మందికి పైగా జలసమాధి అయ్యారు. ఈ ఘటనలో మృతుల కుటుంబాలు కోటి రూపాయలను పరిహారంగా చెల్లించాలని కేశినేని నాని తాజాగా డిమాండ్ చేస్తున్నారు.
Recommended Video
ఇప్పటికైనా మించిపోయింది లేదని, గోదావరిలో లాంచీ మునక బాధితులకు కూడా కోటి రూపాయల పరిహారాన్ని ఇవ్వాలని ఆయన వైఎస్ జగన్కు సూచిస్తున్నారు. వారికి ఒక న్యాయం.. ఇంకొకరికి ఒక న్యాయం సరికాదని హితవు పలికారు. ప్రజలందరినీ సమానంగా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, ప్రజలపై వివక్షత చూపకూడదని కేశినేని నాని గుర్తు చేశారు. ఈ మేరకు శుక్రవారం ఉదయం ఆయన ఓ ట్వీట్ చేశారు.