త్యాగాలు తప్పవు - బిల్డప్ ఇస్తే ఈడ్చికొడతారు : మాజీ మంత్రి లక్ష్యంగా కేశినేని..!!
టీడీపీ ఎంపీ కేశినేని కీలక వ్యాఖ్యలు చేసారు. కొద్ది రోజులు క్రిష్ణా జిల్లా టీడీపీ నేతల మధ్య సాగుతున్న అధిపత్య పోరులో డైలాగ్ వార్ కొనసాగుతోంది. కొందరు టీడీపీ నేతల తీరు పైన ఎంపీ కేశినేని నాని గుర్రుగా ఉన్నారు. పలు సందర్భాల్లో తన ఆగ్రహం బయట పెట్టారు. ఇప్పుడు తాజాగా మాజీ మంత్రి లక్ష్యంగా కేశినేని చేసిన వ్యాఖ్యలు టీడీపీలో కలకలానికి కారణం అవుతున్నాయి. ఎక్కడా ఎవరి పేరు ప్రస్తావించకుండా కేశినేని సీరియస్ కామెంట్స్ చేసారు. ఎవరైనా సరే నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచాను అని ఇగోకు పోతే ప్రజలే సమాధానం చెబుతారంటూ మాజీ మంత్రి ఉమాను ఉద్దేశించి కేశినేని వ్యాఖ్యలు చేసారు.
ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో ఎన్టీఆర్ మెమోరియల్ కబడ్డీ టోర్నమెంట్ బహుమతుల ప్రధానోత్సవంలో కేశినేని పాల్గొన్నారు. అక్కడ మాట్లాడిన కేశినేని నాని పరోక్షంగా దేవినేని ఉమా పైన ఫైర్ అయ్యారు. వచ్చే ఎన్నికల్లో ఎవరు ఎక్కడ పోటీచేయాలనేది అధిష్ఠానం నిర్ణయిస్తుందని చెప్పారు. ఎన్నికలకు చివరి మూడు నెలల్లో అభ్యర్థులు ఖరారు అవుతారని వివరించారు. జగన్ వంటి బలమైన ప్రత్యర్ధిని ఎదుర్కోవాలంటే తనతో సహా అందరూ త్యాగాలకు సిద్ధం కాకపోతే ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. ఎవరి వారు తానే సామంతరాజుననే అహంకారాన్ని పక్కన పెట్టి అందరూ కలిసి పనిచేయాలని సూచించారు. యువతకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు.

ప్రతీ ఒక్కరూ ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. తనకు ఎంపీగా ప్రజలు అవకాశం ఇచ్చారని.. వారి కోసం పనిచేయాల్సిన బాధ్యత తనపై ఉందని చెప్పారు. కలుపుకెళ్లడం అనేది రెండు వైపులా ఉండాలని.. ఐలవ్ యు.. యు డోంట్ లవ్ మి అంటే కుదరదు అన్నారు. రెండువైపుల కలిసి వెళ్తేనే ఇది సాధ్యమన్నారు. తానే సామంతరాజునని బిల్డప్ ఇస్తే కృష్ణానదిలో ఈడ్చికొడతారంటూ సీరియస్ కామెంట్ చేసారు. బెజవాడ ఎంపీగా వైసీపీ ఎమ్మెల్యే సభకు కూడా వెళ్తానని, వైసీపీ ఎమ్మెల్యే బాగా పనిచేస్తున్నాడు కాబట్టే.. మైలవరానికి ఎంపీ నిధులు ఇచ్చానని కేశినేని నాని చెప్పుకొచ్చారు. అసలు వసంత ఏపార్టీలో ఉన్నారో ముందు చెప్పాలంటూ కొత్త చర్చకు కారణమయ్యారు.












Click it and Unblock the Notifications