కర్ణాటకలో టీడీపీ ఎంపీ కొడుకు వీరంగం: టోల్గేట్పై దాడి, కంప్యూటర్లు, అద్దాలు ధ్వంసం
కర్ణాటక రాష్ట్రంలోని బాగేపల్లి టోల్ గేట్ వద్ద తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యుడు నిమ్మల కిష్టప్ప కుమారుడు అంబరీష్ వీరంగం సృష్టించాడు.
అమరావతి/కర్ఠాటక: కర్ణాటక రాష్ట్రంలోని బాగేపల్లి టోల్ గేట్ వద్ద తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యుడు నిమ్మల కిష్టప్ప కుమారుడు అంబరీష్ వీరంగం సృష్టించాడు.
బెంగళూరు నుంచి తన స్వగ్రామం గోరంట్లకు వస్తున్న సమయంలో అంబరీష్ బాగేపల్లి టోల్గేట్ వద్దకు చేరుకున్నాడు.

టోల్ రుసుము చెల్లించకుండా తాను ఎంపీ కుమారుడినని సిబ్బందితో చెప్పాడు. ఎంపీలు ప్రయాణించే వాహనాలకు మాత్రమే టోల్ రుసుము మినహాయింపు ఉంటుందని.. ఎంపీ కుమారులకు ఉండదని సిబ్బంది చెప్పడంతో ఆగ్రహం వ్యక్తం చేశాడు అంబరీష్.
వారితో వాగ్వాదానికి దిగాడు.

అంతేగాక, తన అనుచరులను ఫోన్ చేసి పిలిపించి టోల్ గేట్ పై దాడి చేయించాడు. వారి దాడిలో టోల్ గేట్ క్యాబిన్, కంప్యూటర్లు, అద్దాలు ధ్వంసమయ్యాయి. దాడి సమాచారం అందుకున్న బాగేపల్లి డీఎస్పీ, పోలీసులు అక్కడికి చేరుకుని వివరాలు సేకరించారు.
కాగా, టోల్ గేట్ సిబ్బందిదే తప్పంటూ నిమ్మల కిష్టప్ప కుమారుడు, అతని అనుచరులు చెప్పడం గమనార్హం. కాగా, వీరి వీరంగంతో రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. సీసీ టీవీ ఫుటేజీని పరిశీలించారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు.

కన్నడ పోలీస్ సీరియస్
ఎంపీ నిమ్మల కిష్టప్ప కుమారుడు అంబరీష్, అతడి అనుచరులు టోల్ గేట్పై దాడి చేయడాన్ని కర్ణాటక పోలీసులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. చిక్బళ్లాపూర్ ఎస్పీ కార్తీక్రెడ్డి స్వయంగా రంగంలోకి దిగి టోల్గేట్ వద్ద జరిగిన పరిణామాలపై ఆరా తీస్తున్నారు. కేవలం రుసుము చెల్లించమని అడిగినందుకు టోల్ సిబ్బందిపై వాగ్వాదానికి దిగడమే కాకుండా.. అనుచరులతో కార్యాలయంపై దాడి చేయడాన్ని సీరియస్గా తీసుకున్నారు. దాడి ఎలా జరిగింది.. ఎవరెవరు పాల్గొన్నారన్న దానిపై ఎస్పీ విచారణ చేపట్టారు. టోల్గేట్ సిబ్బంది ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.












Click it and Unblock the Notifications