విమానం వేసుకొచ్చి మరీ చంద్రబాబును తిట్టాలా??
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రతిపక్ష నేత చంద్రబాబును తిట్టడమే పనిగా పెట్టుకున్నారని శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు మండిపడ్డారు. వైసీపీ మూడు సంవత్సరాల పాలనపై వస్తున్న వ్యతిరేకతను చూసి తట్టుకోలేకే అన్ని వైఫల్యాలను తెలుగుదేశం పార్టీపైకి తోసేయాలని చూస్తున్నారని ఆరోపించారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి జగన్ వరద బాధితులను పరామర్శిస్తున్నప్పుడు కూడా చంద్రబాబు భజన చేస్తున్నారని, అక్కడ కూడా ఆయన ఊసెందుకు, ఆయన నామస్మరణ ఎందుకని ప్రశ్నించారు.
ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కూడా చంద్రబాబు భజన చేస్తున్నారన్నారు. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటే విమానంలో వచ్చి మరీ ప్రతిపక్ష నేతను తిట్టాలా? అన్నారు. ప్రత్యేక హోదా గురించి బుగ్గన ఎందుకు మాట్లాడరని రామ్మోహన్ నాయుడు నిలదీశారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని ఒక్క ఎంపీ అయినా అడిగారా?, ఎన్నికలకు ముందు జగన్ ప్రతిరోజు ప్రత్యేక హోదా నామస్మరణ చేసేవారని, మూడు సంవత్సరాలుగా దాని ఊసే లేదన్నారు.
విశాఖపట్నం ఉక్కు కర్మాగారం ప్రయివేటీకరణ నిర్ణయాన్ని అడ్డుకున్నారా? దీనిపై నిన్న కేంద్రం జవాబిచ్చినా ఎంపీలు ఎందుకు అడ్డుకోలేదన్నారు. రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్ మాట్లాడుతూ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని, వైసీపీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్రేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. దీనిపై బహిరంగ చర్చకైనా సిద్ధమేనని సవాల్ విసిరారు.