షా వద్దకు.. ఫలించని వెంకయ్య చొరవ: 'ఫార్ములా' చెప్పాం కానీ.. బాబుకు షాక్, జైట్లీ సంచలనం
అమరావతి: తెలుగుదేశం పార్టీ లోకసభ సభ్యులు రామ్మోహన్ నాయుడు గురువారం బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షాను కలిశారు. మార్చి 5వ తేదీ నుంచి రెండో దఫా బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని టీడీపీ తిరిగి డిమాండ్ చేస్తోంది.
పార్లమెంటులోను తీవ్రస్థాయిలో ఆందోళనలు వ్యక్తం చేయాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో బీజేపీ అధినేతతో టీడీపీ ఎంపీలు భేటీ కావడం గమనార్హం. ముఖ్యంగా వీరు రైల్వే జోన్, కడప స్టీల్ ప్లాంటు, ప్రత్యేక ప్యాకేజీ అంశాలపై చర్చించారని తెలుస్తోంది. హామీలను నెరవేర్చకుంటే సభలో నిరసనలు తప్పవని టీడీపీ చెప్పిందని తెలుస్తోంది.

వెంకయ్య నాయుడు చొరవ
విభజన చట్టంలోని హామీలు, రాజ్యసభ వేదికగా మన్మోహన్ సింగ్ చేసిన వాగ్ధానాల విషయంలో ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు చొరవ తీసుకున్నారు. ఏపీలో టీడీపీ, బీజేపీల మధ్య మాటల యుద్ధం నడుస్తున్న నేపథ్యంలో పరిష్కారం కోసం వెంకయ్య.. అమిత్ షా, ఎంపీ రామ్మోహన్ నాయుడు, ఏపీ ప్రణాళికా మండలి ఉపాధ్యక్షులు కుటుంబరావులతో మాట్లాడారు.

దొరకని పరిష్కారం
వెంకయ్యన నాయుడు సమక్షంలోనే దాదాపు గంటపాటు మాట్లాడారు. అంతసేపు చర్చ జరిగినా ఎలాంటి ఫలితం, పరిష్కారం కనిపించలేదని తెలుస్తోంది. సమావేశం అనంతరం వివరాలు చెప్పేందుకు అటు బిజెపి, ఇటు టిడిపి నేతలు ఆసక్తి చూపించలేదు.

రామ్మోహన్ నాయుడు డిమాండ్, అమిత్ షా సమాధానం
అమిత్ షాతో భేటీ సందర్భంగా 19 డిమాండ్లను రామ్మోహన్ నాయుడు ఆయన ఎదుట పెట్టారు. దీనికి షా కూడా ధీటుగానే సమాధానం చెప్పారట. ఇందులో పలు అంశాలను ఫిబ్రవరి 9న రాజ్యసభలో ప్రకటన ద్వారా చెప్పామన్నారు. అందులో చెప్పిన అంశానికి కట్టుబడి ఉన్నామని, అవసరమైతే సమస్య పరిష్కారానికి తాను చంద్రబాబుతో మాట్లాడుతానని అమిత్ షా.. రామ్మోహన్ నాయుడుకు చెప్పారు.

చంద్రబాబుకు జైట్లీ ఝలక్
మరోవైపు, కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ గురువారం మీడియాతో మాట్లాడుతూ.. ఏపీకి ఆర్థిక సాయంపై ఒక ఫార్ములా చెప్పమని అడిగామని, దానిపై స్పందించాలని కోరినా ఏపీ అధికారులు ఇంకా ముందుకు రాలేదని చంద్రబాబు ప్రభుత్వానికి గట్టి ఝలక్ ఇచ్చారు. అయితే కేంద్రం చెప్పిన ఫార్ములా ఏమిటనేది జైట్లీ చెప్పలేదు.

వెళ్లి వస్తామని చెప్పి.. సంచలన అంశం వెల్లడించిన జైట్లీ!
ఫిబ్రవరి తొలి వారంలో జరిగిన సమావేశంలో ఆర్థిక శాఖ అధికారులు తమ అభిప్రాయాన్ని ఏపీ అధికారులకు చెప్పారని, దానిపై ప్రభుత్వం అభిప్రాయం తెలుసుకొని వస్తామని చెప్పి వారు వెళ్లి, ఇప్పటి వరకు తిరిగి రాలేదని జైట్లీ సంచలన విషయం వెల్లడించారు.

చంద్రబాబుకు చెప్పిన ఫార్ములా ఏమిటి?
చంద్రబాబు ప్రభుత్వం అభిప్రాయం చెప్పగానే తాము నిర్ణయం వెలువరిస్తామని, అప్పటి వరకు ఆ పార్ములా ఏమిటో చెప్పలేమని అరుణ్ జైట్లీ చెప్పారు. తమ ఫార్ములాను ఏపీకి చెప్పినందున దానిని బహిర్గతం చేయలేమన్నారు. తాము మాత్రం చెప్పిన మాటకు కట్టుబడి ఉన్నామని, అందులో వెనక్కి తగ్గే ప్రసక్తి లేదని చెప్పారు.

తగ్గే ప్రసక్తి లేదు
విభజన చట్టం కింద ఇచ్చిన హామీల అమలపై తగ్గే ప్రసక్తి లేదని జైట్లీ చెప్పారు. ప్యాకేజీ కింద ప్రకటించిన ఈఏపీ మొత్తాన్ని ఇచ్చేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి సుభాష్ గార్గ్ చెప్పారు. వారికి ఏ తేదీ నుంచి ఏ తేదీ వరకు ఈఏపీ సాయం అందిస్తామని చెప్పామో.. ఆ మధ్యకాలంలో మంజురైన ఈఏపీ రుణాల చెల్లింపు బాధ్యతను కేంద్రం తీసుకుంటుందని, ఈ విషయం ఏపీకీ చెప్పామన్నారు.












Click it and Unblock the Notifications