ముందస్తు ఎన్నికలకు టిడిపి రెఢీ, కానీ వాస్తవాలు చూడాలంటున్న నేతలు, ఎందుకంటే?
ముందస్తు ఎన్నికలకు సిద్దంగా ఉండాలని టిడిపి చీఫ్ చంద్రబాబునాయుడు చెప్పడం వెనుక పెద్ద వ్యూహమే ఉందని పార్టీ నాయకులు చెబుతున్నారు. మైనార్టీలు, బడుగు, బలహీనవర్గాలు నివసించే ప్రాంతాల్లో టిడిపికి ఓట్లు పెరిగ
అమరావతి: ముందస్తు ఎన్నికలకు సిద్దంగా ఉండాలని టిడిపి చీఫ్ చంద్రబాబునాయుడు చెప్పడం వెనుక పెద్ద వ్యూహమే ఉందని పార్టీ నాయకులు చెబుతున్నారు. మైనార్టీలు, బడుగు, బలహీనవర్గాలు నివసించే ప్రాంతాల్లో టిడిపికి ఓట్లు పెరిగాయని ఆ పార్టీ భావిస్తోంది. ఈ ధైర్యంతోనే ముందస్తు ఎన్నికలకు ఆ పార్టీ సన్నద్దమౌతోంది.అయితే 2004 లో ముందస్తు ఎన్నికలకు వెళ్ళిన టిడిపి చేతులు కాల్చుకొంది. కానీ, ఆనాటి పరిస్థితులకు ఇప్పటి పరిస్థితులకు తేడా ఉందని ఆపార్టీ నాయకులు అభిప్రాయపడుతున్నారు.
ఉమ్మడి ఆ:ద్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో టిడిపి అధినేత చంద్రబాబునాయుడు 2004 అసెంబ్లీ ఎన్నికలను నిర్ణీత సమయానికి కంటే ముందుగానే ఎన్నికలకు వెళ్ళాడు.
ఆనాడు చంద్రబాబునాయుడుపై అలిపిరిలో నక్సలైట్లు దాడికి పాల్పడ్డారు. ఈ దాడి నుండి చంద్రబాబునాయుడు తృటిలో ప్రాణాపాయం నుండి తప్పించుకొన్నారు. అయితే ఈ ఘటనవల్ల సానుభూతి పవనాలు కలిసివచ్చే అవకాశం ఉందని ఆనాడు టిడిపి భావించింది.అంతేకాదు కేంద్రంలోని ఎన్ డి ఏ ను కూడ ముందస్తుకు ఒప్పించారు బాబు. దీంతో కేంద్రంలో ఎన్ డి ఏ, రాష్ట్రంలో టిడిపి 2004 ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవిచూశాయి.
అయితే ప్రస్తుతం దేశంలో , రాష్ట్రంలో పరిస్థితులు మారిపోయాయి.ఈ నేపథ్యంలో మరోసారి ముందస్తు ఎన్నికలకు టిడిపి సన్నద్దమౌతోంది.ముందస్తు ఎన్నికల వల్ల తమకు ప్రయోజనం కలుగుతోందని ఆ పార్టీ భావిస్తోంది.ఈ మేరకు గత చరిత్రను దృష్టిలో ఉంచుకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని కొందరు పార్టీ నాయకులు గుర్తు చేస్తున్నారు.
ముందస్తు ఎన్నికలకు టిడిపి చెబుతున్న కారణలివే
2014 లో జరిగిన సాధారణ ఎన్నికలకు , ఆ తర్వాత వచ్చిన ఎన్నికల్లో ఓట్ల శాతం పోల్చి చూస్తే టిడిపికి జనాధరణ పెరిగిందని ఆ పార్టీ భావిస్తోంది.ఈ మేరకు ముందస్తు ఎన్నికలకు ఆ పార్టీ సై అంటోంది. 2014 ఎన్నికల్లో టిడిపికి, వైసీపికి వచ్చిన ఓట్లలో సుమారు ఐదులక్షల ఓట్ల తేడా ఉంది. వైసీపీ కంటే టిడిపికి ఐదు లక్షల ఓట్లు ఎక్కువ వచ్చాయి.అయితే 2014 ఎన్నికల్లో వచ్చిన ఓటింగ్ శాతంతో నగర పంచాయితీల్లో వచ్చిన ఓటింగ్ శాతంతో పోల్చి చూస్తే టిడిపి ఓటింగ్ శాతం పెరిగింది.అదే సమయంలో వైసీపికి 13 శాతం ఓట్లు తగ్గాయని టిడిపి విశ్లేషణలో తేలింది. మైనార్టీలు, బడుగు, బలహీనవర్గాలు ఉన్న వార్డుల్లో టిడిపికి గతంలో వచ్చిన ఓట్ల కంటే ఎక్కువ ఓట్లు వచ్చాయి.2014 ఎన్నికలతో పోలిస్తే టిడిపికి 16.30 శాతం ఓట్లు పెరిగాయని ఆ పార్టీ లెక్కలు వేస్తోంది.ఈ లెక్కల ఆధారంగానే ముందస్తు ఎన్నికలకు టిడిపి సై అంటోంది.
అసెంబ్లీ ఎన్నికలకు, స్థానిక సంస్థల ఎన్నికలకు మధ్య తేడా
2014 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు , ఆ తర్వాత జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలకు మధ్య వ్యత్యాసం ఉంటుందని టిడిపి నాయకులు కొందరు అభిప్రాయపడుతున్నారు. 2014లో రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎన్నుకొనే ఎన్నికలు. రాష్ట్రం విడిపోయినందున కొత్త రాష్ట్రానికి అనుభవం ఉన్న వ్యక్తి ముఖ్యమంత్రిగా ఎన్నికైతే రాష్ట్రం బాగుంటుందని ప్రజలు చంద్రబాబుకు పట్టం కట్టారనే అభిప్రాయాలు కూడ లేకపోలేదు.అయితే ఆ తర్వాత వచ్చిన స్థానిక సంస్థల ఎన్నికల్లో స్థానిక పరిస్థితులు ప్రభావం చూపుతాయి. తమకు అందుబాటులో ఉండే వ్యక్తులకు ఓటు చేస్తారని వారు చెబుతున్నారు.
.లోకేష్ పవర్ పాయింట్ ప్రజంటేషన్ వల్లే ముందస్తు యోచనా?
ఇటీవల జరిగిన పార్టీ సమన్వయ కమిటీ సమావేశంలో రాష్ట్ర పంచాయితీరాజ్ శాఖ మంత్రి లోకేష్ పవర్ పాయింట్ ప్రజెంటేష్ ఇచ్చారు. ఈ పవర్ పాయింట్ ప్రజేంటేషన్ ద్వారా 2014 ఎన్నికల తర్వాత ఏ మేరకు టిడిపి ఓటింగ్ శాతం పెరిగిందనే విషయాన్ని ఆయన పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు.అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఓట్ల శాతం, ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో పార్టీకి ఏ మేరకు ఓట్ల శాతం పెరిగిందనే విషయాన్ని ఆయన లెక్కలతో సహా వివరించారు.
క్షేత్రస్థాయి పరిస్థితులను పరిశీలించాలి
అయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో వచ్చిన ఓట్ల శాతం ఆధారంగా విశ్లేషిస్తే పార్టీకి ప్రయోజనం కంటే నష్టమే వాటిల్లే అవకాశం లేకపోలేదని కొందరు పార్టీ సీనియర్లు వ్యాఖ్యానిస్తున్నారు.అయితే అదే సమయంలో క్షేత్రస్థాయిలో పరిస్థితులను కూడ అంచనావేయాల్సిన అవసరం లేకపోలేదని పార్టీ నాయకులు అభిప్రాయపడుతున్నారు. ఒక్కో ఎన్నికల్లో ఒక్కో అంశం ఓటర్లను ప్రభావితం చేస్తోంది. అయితే ప్రభుత్వ పథకాలు, రేషన్ సరుకులు పంపిణీ తదితర అంశాలు పార్టీకి అనుకూలంగా మారే అవకాశం లేకపోలేదని పార్టీ నాయకులు అభిప్రాయపడుతున్నారు.