వెంకయ్య సేవలపై - టీడీపీ పొలిట్ బ్యూరోలో : ప్రాధాన్యత ఇవ్వాలి -కీలక నిర్ణయం..!!
తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సమావేశంలో పలు కీలక అంశాల పైన చర్చ - నిర్ణయాలు జరిగాయి. తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనితకు వైకాపా నేత ఫోన్ చేసి బెదిరించటాన్ని పొలిట్బ్యూరో సభ్యులు ఖండించారు. న్యూడ్ వీడియోతో వివాదాస్పదంగా మారిన గోరంట్ల మాధవ్ వ్యవహారం పైన చర్చించారు. గోరంట్ల మాధవ్ రాజకీయాల్లో ఉండటానికి అనర్హుడని..తక్షణమే డిస్మిస్ చేయాలని సమావేశం డిమాండ్ చేసింది.ఈ నెల 13, 14, 15 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవాలను ఘనంగా నిర్వహించాలని సమావేశంలో నిర్ణయించారు.
వెంకయ్య సేవలపై ప్రశంసలు
ప్రతి తెలుగుదేశం కార్యకర్త, నాయకుడు తమ ఇళ్లపై జాతీయ జెండాను ఎగురవేయాలని పార్టీ ఆదేశించింది. గుంటూరులో ఆగస్టు 15న పార్టీ అధినేత చంద్రబాబు అధ్యక్షతన సభ నిర్వహించాలని పొలిట్బ్యూరో సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఆగస్టు 15న ప్రతి గ్రామం నుంచి నియోజకవర్గ కేంద్రానికి బైక్ ర్యాలీగా వెళ్లి స్వాతంత్య్ర వేడుకలు జరపాలని నిర్ణయించింది. ఈ సమావేశంలో ఈ రోజున ఉపరాష్ట్రపతిగా పదవీ విరమరణ చేస్తున్న వెంకయ్య నాయుడు అంశం పైన చర్చ జరిగింది. వెంకయ్య సేవలను టీడీపీ పాలిట్ బ్యూరో ప్రశంసించింది. తెలుగు వ్యక్తి అపూర్వ ప్రస్థానం సాగించారంటూ అభినందనలు తెలిపింది.
బీసీ గణనపై తీర్మానం
తెలుగు జాతి గౌరవం పెంచటంతో పాటుగా. .ప్రజాస్వామ్య విలువలకు పెంపొందించేందుకు నిత్యం వెంకయ్య పని చేసారని సమావేశంలో నేతలు ప్రశంసించారు. కామన్వెల్త్ క్రీడల్లో పతకాలు సాధించి దేశాన్ని 4వ స్థానంలో నిలిపిన క్రీడాకారులను తెదేపా అభినందనలు తెలిపింది. తెలుగు రాష్ట్రాలకు చెందిన క్రీడాకారులు అద్భుత ప్రతిభ కనబరిచారని పార్టీ నేతలు కొనియాడారు. బీసీ జనగణన చేయాలని, కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖను ఏర్పాటుచేయాలని సమావేశంలో తీర్మానం చేశారు. ఇదే సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు.
Recommended Video
యువతకు ప్రాధాన్య పై కమిటీ
వచ్చే ఎన్నికల్లో యువతకు 40 శాతం సీట్లు ఇవ్వాలని టీడీపీ ఇప్పటికే నిర్ణయించింది. యువతకు ప్రాధాన్యత దక్కేలా కమిటీ ఏర్పాటు చేయాలని లోకేష్ సూచించారు. దీంతో.. యువతకు భాగస్వామ్యంపై కమిటీ ఏర్పాటు చేయాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. పార్టీ సంస్థాగత నిర్మాణంలో సంస్కరణలు తీసుకురావడం పైనా చర్చ జరిగింది. వరద ముంపు బాధితుల్ని ఆదుకోవటంలో ప్రభుత్వం విఫలమైందని టీడీపీ ఆరోపించింది. పాఠశాలల విలీనం బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు, సామాన్యులకు విద్యావకాశాల్ని దూరం చేసిందని పాలిట్ బ్యూరో అభిప్రాయపడింది.