టీడీపీ పొలిట్ బ్యూరో సంచలన నిర్ణయాలు-పథకాలకు డేట్ ఫిక్స్, పార్టీ పదవులపైనా..!
ఏపీలో పథకాల కోసం ఎప్పుడెప్పడా ఎని ఎదురుచూస్తున్న లబ్దిదారులకు ఇవాళ సమావేశమైన టీడీపీ పొలిట్ బ్యూరో గుడ్ న్యూస్ చెప్పింది. తల్లికి వందనం, అన్నదాత సహా పలు కీలక పథకాల్ని జూన్ 12న అమలు చేయాలని కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో పాటు ఆపరేషన్ సింధూర్ నిర్వహించిన కేంద్రానికి, సైన్యానికి అభినందనలు తెలపడంతో పాటు పద్మభూషణ్ అవార్డు స్వీకరించిన ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు కూడా అభినందనలు తెలిపింది.
ఇవాళ సీఎం చంద్రబాబు అధ్యక్షతన సమావేశమైన టీడీపీ పొలిట్ బ్యూరో సంచలన నిర్ణయాలు తీసుకుంది. ఇందులో ముఖ్యంగా టీడీపీలో వరుసగా మూడుసార్లు ఒకే పదవిలో పనిచేసిన వారిని తప్పించి వారికి వేరే పదవులు ఇవ్వాలన్న నారా లోకేష్ సూచనకు ఆమోదం తెలిపారు. దీన్ని తొలుత టీడీపీలో మండలాధ్యక్షులతో అమలు చేయనున్నారు. అలాగే ప్రతీ నెలా సంక్షేమ క్యాలెండర్ ప్రకటించి అమలు చేయాలని నిర్ణయించారు.

సంక్షేమ పథకాల్లో దీపం పథకం డబ్పులు గ్యాస్ సిలెండర్ బుకింగ్ కు ముందే ఇచ్చేయాలని నిర్ణయించారు. అలాగే ఏడాదిలో ఇచ్చే మూడు సిలెండర్ల డబ్బులూ ముందే ఇవ్వాలని నిర్ణయించారు. లబ్దిదారులు సిలెండర్ తీసుకున్నా, తీసుకోకపోయినా ముందుగానే ఈ డబ్పులు వారి ఖాతాల్లో జమ చేస్తారు. జూన్ 12న ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా పలు పథకాలను ఒకే రోజు అమలు చేయనున్నారు. వీటిలో అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం, లక్షమంది ఒంటరి మహిళలు, వితంతువులకు పెన్షన్లు ఉన్నాయి. వీటితో పాటు మహిళలకు ఉచిత బస్సు పథకం కూడా రెండు నెలల్లో ప్రారంభిస్తారు.
వీటితో పాటు ఆపరేషన్ సింధూర్ విజయవంతం అయిన సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 16, 17, 18 తేదీల్లో తిరంగా ర్యాలీలు నిర్వహించాలని టీడీపీ పొలిట్ బ్యూరో నిర్ణయించింది. ఉగ్రవాదుల దాడిలో అమరులైన వారికి సంఘీభావంగా ఈ ర్యాలీలు నిర్వహించనున్నారు. అలాగే ఆపరేషన్ సింధూర్ సక్సెస్ పై ప్రధాని మోడీ, త్రివిధ దళాల్ని అభినందిస్తూ తీర్మానం చేశారు. దీంతో పాటు పద్మభూషణ్ అందుకున్న బాలయ్యను అభినందిస్తూ మరో తీర్మానం కూడా చేశారు.












Click it and Unblock the Notifications