ముందస్తుకు సీఎం జగన్ - టీడీపీకి దక్కేది ఎన్ని సీట్లు: చంద్రబాబు కీలక నిర్ణయం..!!
ఏపీలో ముందస్తు ఎన్నికలు ఖాయమా. అదే జరిగితే టీడీపీ గెలిచే సీట్లు ఎన్ని. పార్టీ ఏం చెబుతోంది.
ఏపీలో మరోసారి ముందస్తు ఎన్నికల అంశం తెర మీదకు వచ్చింది. ప్రభుత్వం ముందస్తుకు అవకాశం లేదని చెబుతోంది. టీడీపీ మాత్రం ముందస్తు ఖాయమంటోంది. రాష్ట్రంలో తాజా పరిస్థితులు.. పార్టీ భవిష్యత్ కార్యాచరణ పైన టీడీపీ వ్యూహ కమిటీ సమావేశమైంది. మార్చి తరువాత ముందస్తు ప్రకటన ఉంటుందని అంచనా వేసింది. అందుకు టీడీపీ సిద్దగా ఉందని ప్రకటించింది. ఈ నెల 15 నుంచి చంద్రబాబు ఉమ్మడి గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. 21 నుంచి టీడీపీ అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలను జోన్లుగా విభజించి వరుస సమీక్షలకు నిర్ణయించారు. ఇదే సమయంలో జగన్ 175 సీట్లు ఖాయమని చెబుతున్న వేళ.. టీడీపీకి దక్కే సీట్ల పైన ఆ పార్టీ తేల్చి చెప్పింది. జగన్ లాగా 175 అని చెప్పమంటూ తమ పార్టీకి దక్కే సీట్లపై క్లారిటీ ఇచ్చింది.

ముందస్తు మినహా గత్యంతరం లేదు
పాలన -పార్టీలో ఎదురవుతున్న సమస్యలతో ముందస్తు మినహా ముఖ్యమంత్రి జగన్ కు మరో ప్రత్యామ్నాయం లేదని టీడీపీ వ్యూహ కమిటీ అంచనాకు వచ్చింది. ఆర్దికంగా అనేక సమస్యలు ఉన్నాయని.. కొత్త ఆర్దిక సంవత్సరంలో కొత్త అప్పులతో మరో మూడు నాలుగు నెలల వరకు ఇబ్బంది ఉండదనే చర్చ జరిగింది. ముందస్తుగానే ఎన్నికలకు వెళ్లటం ద్వారా ఎంతో కొంత ప్రయోజనం ఉంటుందనే విధంగా జగన్ ఆలోచనలో ఉన్నారని టీడీపీ అభిప్రాయపడుతోంది. దీంతో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా పార్టీ సిద్దంగా ఉండాలని నిర్ణయించారు. నియోజకవర్గాల ఎంపిక.. క్షేత్ర స్థాయిలో విభేదాల పరిష్కారం..ప్రభుత్వ వైఫల్యాను ఎండగట్టటం వంటి అంశాల పైన కార్యాచరణ సిద్దం చేసారు. ఎన్నికలకు కేడర్ ను సిద్దం చేసే క్రమంలో కీలక సమావేశాలను నిర్ణయించారు.

టీడీపీకి 160 సీట్లు ఖాయమంటూ..
ఎప్పుడు ఎన్నికలు జరిగినా టీడీపీకి 160 సీట్లు ఖాయమని పార్టీ చెబుతోంది. తాము జగన్ మాదిరిగా 175 సీట్లు వస్తాయని అతిశయోక్తిగా చెప్పటం లేదని పార్టీ ముఖ్య నేతలు వెల్లడించారు. టీడీపీ వ్యూహ కమిటీ సమావేశంలో ప్రధానంగా ముందస్తు ఎన్నికలపైనే చర్చ జరిగింది. పార్టీని ఈ దిశగా సిద్దం చేయటంలో భాగంగా ఈ నెల 21వ తేదీ నుంచి అయిదు రోజుల పాటు జోన్ల వారీగా సమావేశాలకు నిర్ణయించారు. 35 నియోజకవర్గాలను ఒక జోన్ గా ఖరారు చేసారు. అయిదు జోన్లుగా విభజించారు. ఈ నెల 21వ తేదీ నుంచి చంద్రబాబు జోన్ల వారీగా సమావేశాలు నిర్వహిస్తారు. 21న కడప, 22న నెల్లూరు, 23న అమరావతి, 24న ఏలూరు, 25న విశాఖ కేంద్రంగా ఈ జోనల్ స్థాయి సమావేశాలు జరగనున్నాయి. పార్టీ ముఖ్య నేతలు ఈ సమావేశాలకు హాజరు కానున్నారు. ఎన్నికలకు ముందస్తుగా సిద్దంగా కావాలని పిలుపునివ్వనున్నారు. అదే సమయంలో నియోజకవర్గంలో అభ్యర్ధి ఎవరైనా గెలుపే లక్ష్యంగా పని చేసేలా స్పష్టత ఇవ్వనున్నారు.

ముందస్తు లేదంటున్న వైసీపీ నేతలు
ఇప్పటికే పలు సందర్భాల్లో ఏపీలో ముందస్తు ఎన్నికలు జరగుతాయని టీడీపీ చెబుతూ వచ్చింది. కానీ, వైసీపీ ముఖ్య నాయకత్వం మాత్రం ముందస్తుకు అవకాశమే లేదని తేల్చి చెబుతున్నారు. షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరగుతాయని స్పష్టం చేసారు. ఇప్పుడు మరోసారి టీడీపీ ముందస్తు ఖాయమని చెబుతూ..కేడర్ ను సిద్దం చేసే కార్యాచరణ ప్రారంభించింది. ఇందు కోసం జోనల్ సమావేశాలను నిర్వహించాలని నిర్ణయించింది .ఈ నెల 15,16,17 తేదీల్లో చంద్రబాబు తూర్పు గోదావరి జిల్లా పర్యటన ఖరారైంది. అటు లోకేష్ పాదయాత్ర వేళ ప్రభుత్వ యంత్రాంగం నుంచి ఎదురవుతున్న సమస్యలు.. నియోజకవర్గ స్థాయిలో ఉన్న ఇబ్బందులను పరిష్కరించేందుకు ఒక కమిటీ వేయాలని పార్టీ నిర్ణయించింది. ఇప్పుడు టీడీపీ అంచనా వేస్తున్న ముందస్తు ఎన్నికలపైన వైసీపీ నాయకత్వం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.












Click it and Unblock the Notifications