టీడీపీలో భూకంపం: అచ్చెన్నాయుడు కిడ్నాప్: బీసీల అణచివేత: జగన్ పిచ్చి పీక్స్లో: చంద్రబాబు
అమరావతి: తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, ఆ పార్టీ శాసనసభా పక్ష ఉప నేత, కార్మికశాఖ మాజీమంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అరెస్టు వ్యవహారంతో రాష్ట్రం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. తెల్లవారు జామునే చోటు చేసుకున్న తెలుగుదేశం పార్టీలో భూకంపాన్ని పుట్టించింది. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్నట్లుగా అనుమానిస్తోన్న అవినితి, కుంభకోణాలపై సీబీఐ ద్వారా విచారణ జరిపించాలంటూ మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్న కొన్ని గంటల వ్యవధిలోనే అచ్చెన్నాయుడు అరెస్టు కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. చంద్రబాబు ప్రభుత్వ అక్రమాలపై జగన్ ప్రభుత్వ వైఖరి ఏమిటనేది స్పష్టం చేసినట్టయింది.
వైసీపీతో టచ్లో మాజీమంత్రి నారాయణ?: దర్యాప్తు ఎఫెక్ట్? నెల్లూరు సిటీ సీటుకు టీడీపీ కొత్త ఇన్ఛార్జి
అచ్చెన్నాయుడి కిడ్నాప్
అచ్చెన్నాయుడి అరెస్టు వ్యవహారంలో తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భిన్నంగా స్పందించారు. ఆయనను కిడ్నాప్ చేశారని ఆరోపించారు. వెనుకబడిన తరగతుల వారిపై వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేస్తోన్న తీవ్రాతి తీవ్రమైన దాడిగా చంద్రబాబు ఆరోపించారు. అచ్చెన్నాయుడి కిడ్నాప్కు జగన్ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. దీనికి బాధ్యత వహిస్తూ హోం మంత్రి సుచరిత తన పదవికి రాజీనామా చేయాలని అన్నారు.
అసెంబ్లీ సమావేశాలకు సరిగ్గా నాలుగు రోజుల ముందు
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు సరిగ్గా నాలుగు రోజుల ముందు అచ్చెన్నాయుడిని అరెస్టు చేశారని చంద్రబాబు అన్నారు. జగన్ ప్రభుత్వ వైఖరిపై సభలో కొన్ని కీలక సాక్ష్యాలను ఆయన ప్రవేశపెట్టాల్సి ఉన్న సమయంలో కిడ్నాప్కు గురయ్యారని విమర్శించారు. జగన్ ప్రభుత్వం కొనసాగిస్తోన్న అన్యాయాలపై అచ్చెన్నాయుడు నిరంతరం పోరాడుతున్నారని, ప్రజలకు వాస్తవాలు తెలియజేస్తున్నారని చెప్పారు. ఇది సహించలేని జగన్ ప్రభుత్వం చట్ట విరుద్ధంగా అధికార దుర్వినియోగానికి పాల్పడి రాత్రి 100 మంది పోలీసులు ఆయన ఇంటిపై పడి అక్రమంగా కిడ్నాప్ చేశారని అన్నారు.
నేను ఫోన్ చేసినా..
అచ్చెన్నాయుడు కనీసం మందులు వేసుకోవడానికి కూడా అనుమతించలేదని చంద్రబాబు ఆరోపించారు. అచ్చెన్నాయుడి కుటుంబ సభ్యులు ఫోన్ చేసినా అందుబాటులో లేరని చెప్పారు. స్వయంగా తాను ఫోన్ చేసిన కూడా ఆయన ఫోన్ అందుబాటులో లేదని ఆరోపించారు. ఇది జగన్ అరాచకం, ఉన్మాదం తప్ప మరేమీ కాదని, పిచ్చి పరాకాష్టకు చేరినట్లుగా ఉందని నిప్పులు చెరిగారు. జగన్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఏర్పడిందని, దాన్ని కప్పిపుచ్చుకోవడానికి జగన్ ఈ రకమైన ఉన్మాద చర్యలకు ఒడికడుతున్నారని మండిపడ్డారు.
ఎక్కడికి తీసుకెళ్లారు..
అచ్చెన్నాయుడిని కిడ్నాప్ చేసిన వారు ఆయనను ఎక్కడకు తీసుకువెళ్ళారో తెలియదని, ఎందుకు తీసుకెళ్లారో తెలియదని చంద్రబాబు అన్నారు. ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వలేదని ఆరోపించారు. ఈ దుర్మార్గాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. శాసనసభాపక్ష ఉపనేతగా ఉన్న అచ్చెన్నాయుడుకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కిడ్నాప్ చేయడం ఇది చట్టాన్ని ఉల్లంఘించడంకాక మరేమిటని ప్రశ్నించారు. వైఎస్ జగన్, హో మంత్రి సుచరిత సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. బలహీనవర్గాలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లను 34 శాతం నుంచి 24కు తగ్గించారని, బీసీ సబ్ ప్లాన్ నిధులను మల్లించారని అన్నారు.
Recommended Video
బీసీలపై దాడిగా
ముఖ్యమై నామినేషన్ పదవుల్లో బీసీలకు మొండిచేయి చూపించారని, సంక్షేమ పథకాలలో కోత పెట్టారని చంద్రబాబు ఆరోపించారు. వాటన్నింటినీ శాసనసభా వేదికగా ప్రజల్లోకి తీసుకెళ్లానరని అన్నారు. అందుకే అచ్చెన్నాయుడిని జగన్ చట్ట వ్యతిరేకంగా కిడ్నాప్ చేయించారని అన్నారు. ఈ ఉన్మాద చర్యకు, అధికార దుర్వినియోగానికి బడుగు బలహీనవర్గాల ప్రజలు, మేధావులు, ప్రజలు నిరసనలు తెలియజేయాలని పిలుపునిచ్చారు. జోతిరావుఫూలే, అంబేద్కర్ విగ్రహాలకు వినతిపత్రాలు సమర్పించి నిరసనలు తెలపాలని సూచించారు.