ట్యాపింగ్ కు టీడీపీ, వైసీపీతో సంబంధం లేదు-జగన్ ఏం చెప్తారు ? పయ్యావుల కామెంట్స్
ఏపీలో వైసీపీ ఎమ్మెల్యేలు చేస్తున్న ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై సీఎం జగన్ సమాధానం చెప్పాల్సిందేనని టీడీపీ ఎమ్మెల్యే, పీఏసీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ డిమాండ్ చేశారు.
ఏపీలో తమ ఫోన్లు ట్యాప్ అవుతున్నాయంటూ నెల్లూరు జిల్లాకు చెందిన ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలు ఆనం, కోటంరెడ్డి ఆరోపిస్తున్న నేపథ్యంలో సీఎం జగన్ దీనిపై స్పందించాలని టీడీపీ సీనియర్ నేత పయ్యావుల కేశవ్ డిమాండ్ చేశారు. తమ ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నారని వైసీపీ ఎమ్మెల్యేలే అంటున్నారని, దీనిపై ముఖ్యమంత్రి ఏం సమాధానం చెబుతారని ఆయన ప్రశ్నించారు. ఎవరిపై, ఏఏ నంబర్లపై నిఘా పెట్టారో కేంద్ర సంస్ధల చేత ఆడిట్ కి సిద్దమా? అని అడిగారు.
వైసీపీ ప్రభుత్వం ప్రతిపక్ష ఎమ్మెల్యేలు, నేతలపై నిఘా పెడుతోందని తాము మొదటి నుంచి ఆరోపిస్తూనే ఉన్నామని టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ గుర్తుచేశారు. అది నేడు నిజమైందన్నారు. ప్రతిపక్ష నేతలపైనే కాదు, చివరకు సొంత పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులపై కూడా నిఘా పెట్టారని, తమ ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నారని వైసీపీ ఎమ్మెల్యేలే స్వయంగా చెబుతున్నారని, ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలని పయ్యావుల ప్రశ్నించారు. జగన్ బండారాన్ని సొంత పార్టీ ఎమ్మెల్యేలే బయటపెడుతున్నారన్నారు. గతంలో ఫోన్ ట్యాపింగ్ పై మాట్లాడినందుకు తన సెక్యూరిటీ పూర్తిగా తొలగించారని, ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యేల వ్యాఖ్యలకు సీఎం ఏం సమాధానం చెబుతారన్నారు.
సీఎం జగన్ రాష్ట్రాభివృద్దిపై దృష్టి సారించకుండా ఫోన్ ట్యాపింగ్ లతో నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని పయ్యావుల విమర్శించారు. ప్రభుత్వ ఇంటిలిజెన్స్ విభాగం వాడే సాప్ట్ వేర్ తో పాటు అదనంగా ప్రవేట్ వ్యక్తుల ద్వారా మాల్ వేర్ తీసుకుని నిఘా పెట్టారన్నారు. అందుకు ప్రవేట్ వ్యక్తులకు డబ్బులు కూడా ముట్టజెప్పారని ఆరోపించారు. గతంలో హైకోర్టు జడ్జిలపై వైసీపీ ప్రభుత్వం నిఘా పెట్టినదానిపై దేశమంతా చర్చ జరిగిందన్నారు. దీనికి సంబందించి హైకోర్టులో పిల్ కూడా ఫైల్ అయ్యిందన్నారు.
ఎవరిపై, ఏ సమయంలో నిఘా పెట్టాలి, ఎవరి అనుమతితో నిఘా పెట్టాలన్న నిభంధల్ని జగన్ ప్రభుత్వం ఉల్లంఘిస్తోందని పయ్యావుల ఆరోపించారు. ఎవరెవరిపై నిఘా పెడుతున్నారో, ఏఏ నంబర్లలపై నిఘా పెడుతున్నారో ఆ కాపీలు హోం సెక్రటరీ, లా సెక్రటరికీ ఇస్తున్నారా? అని ప్రశ్నించారు. ఇవేమీ పాటించకుండా రాత్రికి రాత్రి ఆ కాపీలు తగలెయ్యడానికి మీ దగ్గరే ఉంచుకుంటున్నారన్నారు. గతంలో పెగాసెస్ కొన్నారని టీడీపీ ప్రభుత్వంపై వైసీపీ నేతలు ఆరోపించారని, కానీ నిరూపించలేకపోయారన్నాపు. డేటా చౌర్యం చేశామన్నారని, ఆ కేసు తేలిపోయిందన్నారు. వైసీపీ ప్రభుత్వమే ప్రతిపక్ష పార్టీ నేతలతో పాటు చివరకు సొంత పార్టీ నేతలపై కూడా నిబంధనలకు విరుద్దంగా నిఘా పెడుతోందన్నారు. ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ప్రతిపక్షం, అధికార పక్షం అనే తేడా లేకుండా ఎమ్మెల్యేలు నియోజవకర్గాల ఇన్ చార్జుల ఫోన్లు ట్యాపింగ్ చేసి ఎవరేం మట్లాడుతున్నారో వింటున్నారన్నారు. కాదని చెప్పే దైర్యం వైసీపీకి ఉందా? అని ప్రశ్నించారు. ఎవరిపై నిఘా పెట్టారో, ఏ ఏ నంబర్లపై నిఘా పెట్టారో కేంద్ర సంస్ధల చేత ఆడిట్ చేయించడానికి సిద్దమా? నిఘా కోసం ఎంత ఖర్చు చేస్తున్నారన్న దానిపై కూడా కాగ్ ఆడిట్ చేయించటానికి వైసీపీ ప్రభుత్వం సిద్దమా ? అని పయ్యావుల ప్రశ్నించారు.