యుద్ధం చేస్తారా, 'తమిళ' ఆట సాగనివ్వను: జగన్-పవన్లపై బాబు సంచలనం
అమరావతి: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదివారం మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రం ఎవరిపై యుద్ధం చేద్దామనుకుంటోందని మండిపడ్డారు. ఏపీ ప్రజలపై యుద్ధం చేస్తారా అని సవాల్ చేశారు. ఉగాది వేడుకల్లో పాల్గొన్న ఆయన మాట్లాడారు.
ఉగాది పచ్చడి మాదిరి జీవితంలో మంచి చెడు, ఎత్తుపల్లాలు ఉంటాయని చంద్రబాబు అన్నారు. సంపదతో సమానంగా ఆనందమైన సమాజాన్ని రూపొందిస్తున్నామని చెప్పారు. తెలుగువారికి అద్భుతమైన రాజధాని నిర్మించాలనుకుంటున్నానని చెప్పారు.

కేంద్రం నిధులను సద్వినియోగం చేశాం
కేంద్రం మనకు ఇచ్చిన నిధులను సద్వినియోగం చేశామని చంద్రబాబు చెప్పారు. కేంద్రం ఇచ్చిన నిధులకు లెక్క లేదని బీజేపీ నేతలు, కేంద్రమంత్రులు చెప్పిన నేపథ్యంలో ఏపీ సీఎం ఈ విధంగా స్పందించారు. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఏపీ పరిస్థితి అంత బాగా లేదన్నారు.

ఎవరిపై యుద్ధం చేస్తారు
కేంద్రంలో ఉన్న బీజేపీ యుద్ధం చేస్తామంటోందని చంద్రబాబు మండిపడ్డారు. ఈ యుద్ధం నాపై చేస్తారా లేక తెలుగుజాతిపై చేస్తారా అని ధ్వజమెత్తారు. టీడీపీపై దండయాత్ర చేయాలని అమిత్ షా చెప్పిన నేపథ్యంలో చంద్రబాబు యుద్ధం ఎవరిపై అని ప్రశ్నించారు.

జగన్, పవన్ కళ్యాణ్లపై ఇలా
కేసుల మాఫీ కోసమే ఓ పార్టీ కేంద్రం వెంటపడుతోందని వైసీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి చంద్రబాబు అన్నారు. మరో పార్టీ నాలుగేళ్ల తర్వాత తనను విమర్శిస్తోందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను ఉద్దేశించి అన్నారు.

ఏపీపై యుద్ధం చేస్తారా
అందరూ కలిసి రాష్ట్రంపై యుద్ధం చేస్తారా అని చంద్రబాబు ప్రశ్నించారు. ఆత్మగౌరవం అంటే నిధులు వస్తాయా అని వెకిలిగా మాట్లాడటం సరికాదన్నారు. తమిళనాడు తరహాలో రాజకీయం చేస్తామంటే ఏపీలో చేయనివ్వమని బీజేపీని ఉద్దేశించి అన్నారు. అలాంటిది ఏపీలో జరగదని, జరగనివ్వమన్నారు.












Click it and Unblock the Notifications