టిడిపి: సభలో సీమాంధ్ర, గన్పార్క్ వద్ద తెలంగాణ
హైదరాబాద్: తెలుగుదేశం శాసనసభ్యులు సీమాంధ్ర, తెలంగాణ ప్రాంతాలుగా విడిపోయి రెండు పరస్పర విరుద్ధమైన డిమాండ్లతో బుధవారం ఆందోళనకు దిగారు. సభను నిర్వహించకుండా వాయిదా వేశారని విమర్శిస్తూ సీమాంధ్ర తెలుగుదేశం శాసనశభ్యులు సభ ముగిసిన తర్వాత కూడా శాసనసభలో స్పీకర్ పోడియం వద్ద ఆందోళనకు దిగారు. తెలంగాణ బిల్లుపై చర్చను ముగించి తిరిగి పంపించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ప్రాంత శాసనసభ్యులు గన్పార్క్ వద్ద ఆందోళన చేపట్టారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యులు కూడా సభలో ఆందోళనకు దిగారు.
బుధవారం సాయంత్రం వరకు కూడా సభలో సీమాంధ్ర శాసనసభ్యుల ఆందోళన కొనసాగుతోంది. వారికి సంఘీభావం తెలపడానికి తెలుగుదేశం సీమాంధ్ర పార్లమెంటు సభ్యుడు సిఎం రమేష్ వచ్చారు నిబంధనలకు విరుద్ధంగా సభలోకి ప్రవేశించారనే విమర్శలు ఆయనపై వస్తున్నాయి. తమ పార్టీ సీమాంధ్ర సభ్యులతో సిఎం రమేష్ చర్చలు జరిపారు.
విభజన బిల్లుపై ఓటింగు పెట్టకుండా స్పీకర్ నాదెండ్ల మనోహర్ తప్పించుకుంటున్నారని తెలుగుదేశం సీమాంధ్ర శాసనసభ్యుడు గాలి ముద్దుకృష్ణమ నాయుడు విమర్శించారు. బిల్లుపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఎందుకు డిమాండ్ చేయడం లేదని ఆయన ప్రశ్నించారు. బిల్లుపై ఓటింగ్ విషయంలో ముఖ్యమంత్రి నాటకాలాడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ఓటింగ్ పెడితే బిల్లు ఓడిపోతుందని ఆయన అన్నారు. సిఎం రమేష్ తమకు సంఘీభావం తెలపడానికి మాత్రమే వచ్చారని ఆయన చెప్పారు. పార్లమెంటులో రమేష్ సమైక్యవాణిని గట్టిగా వినిపించారని చెప్పారు.
సంఘీభావం తెలపడానికి వచ్చిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సభ్యులు నాటకాలు ఆడుతున్నారని ఆయన అన్నారు. ఓ వైపు అధిష్టానాన్ని వ్యతిరేకిస్తున్న ముఖ్యమంత్రి కాంగ్రెసు పార్టీ రాజ్యసభ అభ్యర్థుల నామినేషన్ దాఖలు కార్యక్రమానికి ఎందుకు వెళ్లారని, సమైక్యవాదంతో నామినేషన్లు వేసిన అభ్యర్థుల నామినేషన్ల దాఖలు కార్యక్రమానికి ఎందుకు వెళ్లలేదని ఆయన ప్రశ్నించారు.
ముఖ్యమంత్రి ప్రతిపాదించిన తీర్మానాన్ని స్పీకర్ సభలో ప్రవేశపెట్టాలని రాష్ట్ర శాసనసభా వ్యవహారాల మంత్రి శైలజానాథ్ అన్నారు. సభ్యులు ప్రాంతాలవారీగా విడిపోయారని, శాసనసభ్యులు విడిపోయినా సభ హుందాగా సాగుతోందని ఆయన అన్నారు. సభలో లేనివారు సభలోకి రావడంపై స్పీకర్కు వివరించినట్లు ఆయన తెలిపారు.