టీడీపీకి మాజీమంత్రి డొక్కా గుడ్బై: మొన్న మండలి సభ్యత్వానికి..నేడు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి.. !
గుంటూరు: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల వేడి రాజుకున్న వేళ. తెలుగుదేశం పార్టీ వలసల బెడదను ఎదుర్కొంటోంది. స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన కొన్ని గంటల వ్యవధిలోనే ఆ పార్టీకి చెందిన ఇద్దరు సీనియర్ నాయకులు పార్టీకి వీడటానికి రెడీ అయ్యారు. కడప జిల్లా జమ్మలమడుగు మాజీ ఎమ్మెల్యే, మాజీమంత్రి పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డి రేపో, మాపో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థాన్ని పుచ్చుకోవడానికి సిద్ధపడుతున్నారంటూ వార్తలు వస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో..టీడీపీకే చెందిన మరో మాజీమంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ రాజీనామా చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
3 రాజధానులు..9 నెలల పాలనకు రెఫరెండంగా: ప్రత్యర్థులను ప్రజాస్వామ్యబద్ధంగా బలహీనపర్చేలా..!
కాంగ్రెస్ టు టీడీపీ..
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి కేబినెట్లో డొక్కా మాణిక్య వరప్రసాద్ మంత్రిగా పనిచేశారు. ఆయన హఠాన్మరణం అనంతరం కే రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో కొనసాగారు. రాష్ట్ర విభజన అనంతరం తొలి రోజుల్లో కాంగ్రెస్ పార్టీలో కొనసాగారు. 2014 సార్వత్రిక ఎన్నికల అనంతరం ఆయన తెలుగుదేశం పార్టీలో చేరారు. శాసన మండలికి ఎన్నికయ్యారు. 2019లో ఎన్నికల్లో ఆయన గుంటూరు జిల్లాలోని ప్రత్తిపాడు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి, ఓడిపోయారు. నిజానికి- డొక్కా సొంత నియోజకవర్గం తాడికొండ.
ఇప్పటికే శాసన మండలికి రాజీనామా..
డొక్కా వరప్రసాద్ ఇదివరకే తన శాసన మండలి సభ్యత్వానికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. వ్యక్తిగత కారణాలతో తాను పదవికి రాజీనామా చేస్తున్నానంటూ చెప్పారు. పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి బహిరంగ లేఖను రాశారు. అమరావతి ఉద్యమం ఉధృతంగా కొనసాగుతున్న పరిస్థితుల్లోనే ఆయన మండలి నుంచి తప్పు కోవడం చర్చనీయాంశమైంది. అప్పటి నుంచీ ఆయన తెలుగుదేశానికి దూరంగా ఉంటూ వచ్చారు. ఒకవంక అమరావతి రైతుల ఉద్యమం కొనసాగుతున్నప్పటికీ..వాటి పెద్దగా దృష్టి సారించలేదు.
ఇక పార్టీ ప్రాథమిక సభ్యత్వానికీ..
తాజాగా ఆయన పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేయడంతో మరోసారి వార్తల్లోకి ఎక్కారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి తాను రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు. పార్టీ అగ్ర నాయకత్వం వైఖరిని విభేదించడమే దీనికి కారణమని అంటున్నారు. దళితులు, బడుగు, బలహీన వర్గాల వారికి ఇళ్ల స్థలాలను కేటాయించడానికి ప్రభుత్వం అమరావతి పరిధిలోని పలు గ్రామాల్లో భూములను సేకరించడాన్ని టీడీపీ అగ్ర నాయకత్వం తప్పు పట్టడాన్ని ఆయన వ్యతిరేకిస్తున్నారని అంటున్నారు.
భూముల సేకరణను తప్పుపట్టడం.. వ్యక్తిగత విమర్శలతో దాడి..
అదే సమయంలో- అమరావతి ఉద్యమం సందర్భంగా కొందరు టీడీపీ నాయకులు తనను విమర్శించడాన్ని డొక్కా మాణిక్య వరప్రసాద్ జీర్ణించుకోలేకపోతున్నారనే వాదన కూడా వినిపిస్తోంది. పేదలకు ఇళ్ల స్థలాలను కేటాయించడాన్ని నిరసించడం వల్ల తెలుగుదేశం పార్టీ అగ్ర కులాలకే వత్తాసు పలుకుతోందనే అభిప్రాయం క్షేత్రస్థాయిలో ప్రజల్లో వ్యక్తమౌతోందని డొక్కా మాణిక్య వరప్రసాద్ భావిస్తున్నట్లు చెబుతున్నారు.
క్షేత్రస్థాయిలో పార్టీపై వ్యతిరేకత ఉందనే వాదన..
క్షేత్రస్థాయిలో చోటు చేసుకుంటున్న పరిణామాలను ఏ మాత్రం టీడీపీ అగ్ర నాయకత్వం అంచనా వేయలేకపోతోందని, ప్రజల నాడీని పసిగట్టడంలో విఫలమైందని డొక్కా అభిప్రాయపడుతున్నట్లు సమాచారం. అమరావతి పరిరిక్షణ కమిటీ ఉద్యమంలో ఒక వర్గానికి చెందిన రైతులు, వారి కుటుంబాలను మాత్రమే లబ్ది కలిగేలా టీడీపీ నాయకులు ప్రవర్తిస్తున్నారని, అదే పరిస్థితి కొనసాగితే.. పార్టీ పట్ల వ్యతిరేకత ఎదురవుతుందని ఆయన విశ్వసిస్తున్నట్లు తెలుస్తోంది.