వైసీపీలోకి టీడీపీ సీనియర్ నేత కుటుంబం- కీలక హామీ..!?
రాయలసీమలో రాజకీయం వేగంగా మారుతోంది. కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసు కుంది. సర్వే సంస్థలు ఇస్తున్న నివేదికలు సంచలనంగా మారుతున్నాయి. వైసీపీ లక్ష్యంగా టీడీపీ నేతలు వ్యూహాలు అమలు చేస్తున్నారు. ఇటు వైసీపీ కౌంటర్ రాజకీయం మొదలు పెట్టింది. ఇదే సమయంలో పార్టీలకు రాజీనామాల.. ఇతర పార్టీల్లో చేరికలు ఊపందుకుంటున్నాయి. ఇక, టీడీపీ లో ఆవిర్భావం నుంచి పని చేస్తూ.. తాజాగా పార్టీకి రాజీనామా చేసిన సీనియర్ పొలిటీషియన్ కుటుంబం ఇప్పుడు వైసీపీలో చేరేందుకు రంగం సిద్దం చేసుకున్నట్లు తెలుస్తోంది.
వైసీపీలోకి కీలక నేత
కడప జిల్లాలో రాజకీయంగా సుగవాసి కుటుంబానికి పేరుంది. రాయచోటి లో నాలుగు దశాబ్దాలుగా టీడీపీకి పట్టుగొమ్మ లాంటి కుటుంబంగా గుర్తింపు ఉంది. టీడీపీ ఆవిర్భావం నుంచి టీడీపీకి వెన్నుదన్నుగా నిలిచిన ఈ కుటుంబం ఇప్పుడు వైసీపీలో చేరేందుకు రంగం సిద్దం చేసుకున్నట్లు సమాచారం. చంద్రబాబు.. వైఎస్సార్ సమకాలీకుడు అయిన సుగవాసి పాలకొండ్రాయుడు 1978 ఎన్నికల్లో రాయచోటి నుంచి జనతా పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 1983లో మళ్లీ రాయచోటి నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి విజయం సాధించారు. అనంతరం టీడీపీలో చేరి 1984 ఎన్నికల్లో రాజంపేట ఎంపీగా పోటీచేసి గెలుపొందారు. 1999, 2004 ఎన్నికల్లో వరుసగా రాయచోటి నుంచి ఎమ్మెల్యే అయ్యారు.

వైసీపీ నుంచి హామీ
ఇక, పాలకొండ్రాయుడు రాజకీయ వారసుడిగా బాలసుబ్రమణ్యం 2024 ఎన్నికల్లో రాజంపేట అసెంబ్లీ స్థానం నుంచి పోటీచేసి ఓడిపోయారు. ఎన్నికల ఫలితాల తర్వాత బాలసుబ్రమణ్యం కొద్దిరోజులు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు, ఆ తర్వాత పార్టీకి దూరంగా ఉంటున్నారు. నియోజక వర్గంలో చోటు చేసుకుంటున్న పరిణామాలు.. ఫిర్యాదులు చేసినా పట్టించుకోవటం లేదనే మన స్థాపంతో ఈ మధ్య కాలంలో బాల సుబ్రమణ్యం పార్టీకి రాజీనామా చేస్తూ చంద్రబాబుకు లేఖ రాసారు. ప్రజలు.. తన మద్దతుదారుల సూచన మేరకు రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు. అయితే, వైసీపీ ముఖ్య నేతలతో చర్చల తరువాతనే బాల సుబ్రమణ్యం రాజీనామా చేసినట్లు జిల్లాలో ప్రచారం సాగుతోంది.
జనసేన ప్రయత్నాలు
బలిజ వర్గాన్ని ప్రభావితం చేయగలిగిన సుగవాసిని పార్టీలోకి తీసుకోవటం ద్వారా ప్రయోజనం కలుగుతుందని వైసీపీ భావిస్తోంది. వచ్చే ఎన్నికల్లో రాజంపేట ఎంపీ అభ్యర్దిగా బాల సుబ్రమణ్యం కు అవకాశం ఇస్తామని ఆఫర్ ఇచ్చినట్లు సమాచారం. ప్రస్తుతం రాజంపేట ఎంపీగా ఉన్న మిథున్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో పీలేరు నుంచి పోటీ చేసేలా ఒప్పందం జరిగింది. అయితే.. సుగవాసిని తమ పార్టీలో చేర్చుకునేందుకు తాజాగా జనసేన నేతలు రంగంలోకి దిగారు. బిలజ వర్గానికి చెందిన కొందరు నేతలు రాయబారం నడుపుతున్నట్లు సమాచారం. కాగా, జగన్ తో సుగవాసి కలిసేందుకు ముహూర్తం ఖరారైందని చెబుతున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో సుగవాసి ఎంట్రీ వైసీపీలోకి ఉంటుందా.. చివరి నిమిషంలో ఏమైనా ట్విస్ట్ ఉంటుందా అనేది ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications