ఇంట్లో కాలు జారి పడ్డ టీడీపీ నేత నన్నపనేని రాజకుమారి- తలకు స్వల్ప గాయం..
టీడీపీ సీనియర్ మహిళా నేత, ఏపీ మహిళా కమిషన్ మాజీ ఛైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి ఇవాళ గాయపడ్డారు. గుంటూరు జిల్లా తెనాలిలోని స్వగృహంలో ఆమె కాలుజారి పడ్డారు. దీంతో ఆమెకు స్వల్ప గాయాలైనట్లు తెలుస్తోంది. వెంటనే కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె క్షేమంగానే ఉన్నట్లు తెలుస్తోంది.
టీడీపీ తరఫున గతంలో ఎమ్మెల్సీగా కూడా పనిచేసిన రాజకుమారి మహిళా కమిషన్ పదవి నుంచి తప్పుకున్నాక కొంతకాలంగా తెనాలిలోని ఇంటివద్దే ఉంటున్నారు. ఇవాళ ఉదయం ఆమె ఇంట్లో అకస్మాత్తుగా కాలుజారి పడటంతో తలకు స్వల్ప గాయమైనట్లు తెలిసింది. దీంతో వెంటనే స్పందించిన కుటుంబ సభ్యులు స్ధానిక ఆస్పత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం ఆమెను తిరిగి ఇంటికి తీసుకొచ్చారు. ప్రస్తుతం ఆమె ఇంటివద్దే డాక్టర్ల పర్యవేక్షణలో కోలుకుంటున్నట్లు తెలుస్తోంది.
గతంలో టీడీపీ తరఫున పలు పదవుల్లో పనిచేసిన నన్నపనేని గాయపడ్డారన్న వార్త తెలియడంతో పలువురు టీడీపీ నేతలు ఆమెకు ఫోన్ చేసి పరామర్శిస్తున్నారు. వయోభారం కారణంగా ప్రస్తుతం ఇంటి వద్ద విశ్రాంతికే పరిమితమవుతున్న రాజకుమారి ఒకప్పుడు టీడీపీలో ఫైర్ బ్రాండ్ నేతగా పేరుతెచ్చుకున్నారు.
పలు సమస్యలపై ఒకప్పుడు కాంగ్రెస్ను, ఆ తర్వాత వైసీపీని ఆమె ఎదుర్కొనేవారు. టీడీపీ హయాంలో మహిళా కమిషన్ ఛైర్పర్సన్గా పనిచేసిన రాజకుమారి.. వైసీపీ ప్రభుత్వం రాక తర్వాత పదవి నుంచి తప్పుకున్నారు. ఆమె కుమార్తె నన్నపనేని సుధ ప్రస్తుతం వైసీపీలో ఉన్నారు.