సీబీఐకి జగన్ పేరు చెప్పమన్నారు: చంద్రబాబు ఒత్తిడి చేసారు: ఆ కేసు లోసాక్షి సంచలన ఆరోపణలు..!
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పైన సంచలన ఆరోపణలు. సుదీర్ఘ కాలం టీడీపీలో పని చేసి తాజాగా బీజేపీలో చేరిన నేత చెప్పిన విషయాలు. 30 ఏళ్లుగా టీడీపీలో పని చేసిన చెన్నంశెట్టి శశికుమార్ బీజేపీలో చేరారు. ఆ సమయంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేసారు. ఓబులాపురం మైనింగ్ కేసులో సైతం ఆయన సాక్షిగా ఉన్నారు. సీబీఐ విచారణను ఎదుర్కొన్నారు. అయితే, పార్టీ అధినేతగా చంద్రబాబు తమ మీద ఏ రకంగా ఒత్తిడి తెచ్చారో శశికుమార్ వివరించారు. ఓబులాపురం మైనింగ్ కేసులో సీబీఐ విచారణలో జగన్ పేరు చెప్పాలని తన మీద ఒత్తిడి తెచ్చారంటూ చెప్పుకొచ్చారు. తాను అలా చేయకపోవటంతో తమ మీద కక్ష్య పెంచుకున్నారని వివరించారు.
జగన్ పేరు చెప్పమని ఒత్తిడి చేసారు..
ఓబులాపురం మైనింగ్ కేసులో సాక్షిగా ఉండి..సీబీఐ విచారణ ఎదుర్కొన్న చెన్నంశెట్టి శశి కుమార్ సంచలన ఆరోపణ లు చేసారు. తనను ఆ కేసులో జగన్ను అక్రమంగా ఇరికించేలా సీబీఐ అధికారుల వద్ద ఆయన పేరు చెప్పాలంటూ టీడీపీ అధినేత చంద్రబాబు అప్పట్లో బాగా ఒత్తిడి చేసారని వెల్లడించారు. టీడీపీలో 30 ఏళ్లు పని చేసిన శశికుమార్ కేంద్ర మంత్రి కిషన్రెడ్డి సమక్షంలో బీజేపీలో చేరారు. అయితే, చంద్రబాబు నాడు ఎంత ఒత్తిడి చేసినా తాను మాత్రం విచారణ సమయంలో జగన్ పేరు చెప్పలేదని వివరించారు. దీంతో తన మీద పార్టీ అధినేత కక్ష్య పెంచుకున్నారని 30 ఏళ్లుగా పార్టీలో పని చేసినా తనకు కనీస గుర్తింపు ఇవ్వలేదని వాపోయారు. ఆయన చెప్పినట్లుగా వినలేదనే కక్ష్యతో అయిదేళ్ల కాలంలో తాను ఎన్నిసార్లు అడిగినా..ఒక్కసారి కూడా అపాయింట్మెంట్ ఇవ్వలేదని చెప్పుకొచ్చారు. టీడీపీ లో సుదీర్ఘ కాలం కొనసాగి తరువాత ప్రజారాజ్యం..ప్రస్తుతం వైసీపీలో ఉన్న సి రామచంద్రయ్యకు ఈ శశికుమార్ సోదరుడు అవుతారు.
ఆ కేసులోనే శ్రీలక్ష్మి పేరు..జైలు జీవితం.
ఐఏయస్ అధికారి శ్రీలక్ష్మి ఇదే కేసులో సీబీఐ విచారణ ఎదుర్కొన్నారు. వైయస్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయం లో అనంతపురం జిల్లాలో ఓబులాపురం మైనింగ్ కంపెనీకి అనుమతులు వచ్చాయి. అయితే అప్పుడు నిబంధనలకు వ్యతిరేకంగా నాటి మైనింగ్ శాఖా అధికారిగా ఉన్న శ్రీలక్ష్మి క్యాప్టివ్ మైనింగ్ పేరుతో కంపెనీకి లబ్ది చేసేందుకు సహక రించారనే అభియోగాలు ఉన్నాయి. శ్రీలక్ష్మితో పాటుగా మరో అధికారి రాజగోపాల్ సైతం సీబీఐ కేసులో ఉన్నారు. వీరు సుదీర్ఘ కాలం జైలులో ఉన్నారు. గాలి జనార్ధన రెడ్డికి లోపాయికారీగా ప్రయోజనం కలిగించేందుకే వీరు వ్యవహరించార నేది వీరి పైన ప్రధాన అభియోగం. ఇదే విషయంలో నాడు గనుల శాఖా మంత్రిగా పని చేసిన సబితా ఇంద్రారెడ్డి సైతం సీబీఐ విచారణ ఎదుర్కొన్నారు. ఈ వ్యవహారం మంత్రులు..అధికారుల మధ్య వివాదాన్ని సైతం సృష్టించింది. ఇక, ఇప్పుడు జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత తెలంగాణలో ప్రస్తుతం పని చేస్తున్న శ్రీలక్ష్మిని ఏపీలో కీలక పోస్టులో నియమించేందుకు జగన్ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది.
జగన్ కేసుల వ్యవహారంలోనూ...
జగన్ కాంగ్రెస్ నుండి బయటకు వచ్చిన తరువాత నాడు కాంగ్రెస్ నేత శంకరరావు జగన్ అక్రమాస్తుల పైన హైకోర్టులో కేసు దాఖలు చేసారు. అందులో టీడీపీ నేతలు సైతం ఇంప్లీడ్ అయ్యారు. ఇదే విషయాన్ని ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో జగన్ పలుమార్లు చెప్పుకొచ్చారు. కానీ, జగన్ పైన కేసులనే ప్రస్తావిస్తూ 2014 ఎన్నికల్లో టీడీపీ అధినేత రాజకీయంగా లాభ పడే ప్రయత్నం చేసారు. ఇక, మాజీ ముఖ్యమంత్రి కిరణ్ సోదరుడు కిషోర్ టీడీపీలో చేరే సందర్భం లో స్వయంగా చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేసారు. సోనియాగాంధీని ఎదిరించినందుకే జగన్ పైన కేసులు పెట్టారని.. సోనియాతో జగన్ పోరాడాల్సి వచ్చిందని వ్యాఖ్యానించారు. ఇక, అప్పట్లో జగన్ కేసులు విచారించిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ తీరు పైనా నాడు విమర్శలు వచ్చాయి. అయితే ఆయన తాజా ఎన్నికల్లో జనసేన నుండి పోటీ చేసినా కొద్ది రోజుల నుండి రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఇక, ఇప్పుడు చంద్రబాబు స్వయంగా జగన్ పేరు చెప్పమని ఒత్తిడి చేసారంటూ శశికుమార్ చేసిన వ్యాఖ్యల పైన వైసీపీ..టీడీపీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.