మళ్లీ సీఎంగా చంద్రబాబు, ఇదీ పథకం.. టీడీపీకి ఉప్పందించిన విజయసాయి వేగులు.. ఇందుకే ఢిల్లీ టూర్ రద్దు..
ఆంధ్రప్రదేశ్లో కరోనా పాజిటివ్ కేసులతోపాటు ప్రభుత్వ నిర్ణయాలు, విధానాలను సవాలు చేస్తూ కోర్టుల్లో దాఖలవుతోన్న పిటిషన్ల సంఖ్య, సుమోటో విచారణలసంఖ్య కూడా పెరుగుతోంది. పంచాయితీ ఆఫీసులకు రంగుల దగ్గర్నుంచి రాజధాని తరలింపు దాకా హైకోర్టులో చుక్కెదురుకావడం.. తాజాగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా నిమ్మగడ్డ రమేశ్ కుమార్ రీఇన్స్టేట్మెంట్ వ్యవహారంలో ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించడం తెలిసిందే.
ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయకముందే, నిమ్మగడ్డ తనకు తానే చార్జ్ తీసుకున్నట్లు సర్క్యులర్ జారీ చేయడం తీవ్రచర్చనీయాంశమైంది. ఇలా సుమోటోగా ఎవరికివారే ఇష్టారీతిగా వ్యవహరించడాన్ని ప్రభుత్వం తప్పుపడుతోంది. ఇదే 'సుమోటో' వ్యవహారంపై రాజకీయ రచ్చ కొనసాగుతోంది..

సుమోటోల గోల..
నిమ్మగడ్డ వివాదం నేపథ్యంలో వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి, టీడీపీ మధ్య ట్విటర్ వార్ తారా స్థాయికి చేరింది. ‘‘వైజాగ్ గ్యాస్ బాధితుల్ని పరామర్శిస్తానని ఒకాయన సుమోటోగా విజయవాడ నుంచి హైదరాబాద్ వెనక్కి వెళ్ళాడు.. ఇంకొకాయన నాకు నేనే సుమోటోగా ఎన్నికల కమిషనర్ని అని ఆర్డర్ ఇచ్చుకున్నాడు.. అసలీ సుమోటోలు ఏమిటో..'' అంటూ ఎంపీ ఆశ్చర్యం వెలిబుచ్చగా.. ‘‘11 కేసుల్లో ముద్దాయిగా, 16 నెలలు జైలులో గడిపిన మీకు సుమోటో ఏమిటో తెలీదా''అని ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న కౌంటరిచ్చారు. తాజాగా విజయససాయి మరో ‘సుమోటో' బాణాన్ని చంద్రబాబుపైకి వదిలారు..

మళ్లీ సీఎంగా..
రమేశ్ కుమార్ సుమోటోగా ఈసీనని ప్రకటించుకున్నట్లే టీడీపీ చీఫ్ చంద్రబాబు సైతం మళ్లీ ముఖ్యమంత్రి పదవిని కూడా సుమోటోగా చేపట్టే అవకాశాలను తీవ్రంగా పరిశీలిస్తున్నారంటూ విజయసాయి సెటైర్ వేశారు. ‘‘ఏపీకేకాదు, తెలంగాణకు కూడా సుమోటోగా సీఎం పోస్టు చేపట్టేందుకు ఎలాంటి పథకాన్ని అనుసరించాలో చంద్రబాబు తన సలహాదారులతో చర్చలు జరుపుతున్నట్లు విశ్వసనీయమైన వేగు ఒకరు తెలిపారు''అని ట్విటర్ లో రాసుకొచ్చారు. దీనిపై టీడీపీ సైతం వెంటనే స్పందించింది..

అదే వేగు చెప్పాడు..
చంద్రబాబు మళ్లీ సీఎం అయ్యేందుకు ఏవో ప్రయత్నాలు చేస్తున్నారంటూ విజయసాయికి ఎవరైతే చెప్పారో.. అదే వేగులు తమకూ ఓ నిజం చెప్పారని టీడీపీ పేర్కొంది. ‘‘అవునా? అదే వేగులు ఇటుగా వచ్చి మాకూ ఒకటి చెప్పారు.. మీ మాటల్లోనిజం ఎలాంటిదంటే.. మీరు(విజయసాయి), సీఎం జగన్ కలిసి ఏపీ ప్రత్యేక హోదా కోసం పోరాడినంత. హాస్యాస్పదంగా లేదూ..''అని టీడీపీ ఘాటు కౌంటర్ ఇచ్చింది. మొత్తంగా న్యాయవ్యవస్థలో కీలకమైన సుమోటో పదంపై కొత్తరకం పొలిటికల్ వ్యాఖ్యానాలు వైరల్ అవుతున్నాయి.

ఢిల్లీ టూర్ రద్దు.. సీఎం కీలక భేటీ..
విమానం బయలుదేరడానికి కొద్ది గంటల ముందు.. ఢిల్లీ పర్యటన సడెన్ గా రద్దయిన తర్వాత సీఎం వైఎస్ జగన్.. తాడేపల్లి క్యాంప్ ఆఫీసులో ఎంపీ విజయసాయిరెడ్డి, మంత్రులు బాలినేని శ్రీనివాస రెడ్డి, కొడాలి నానితో భేటీ అయ్యారు. తాజా రాజకీయ పరిణామాలు, కోర్టు తీర్పులు, ఎన్నికల కమిషనర్ వ్యవహారంతోపాటు ఈనెల 5న జరగాల్సిన కేబినెట్ భేటీపైనా నేతలు చర్చించినట్లు తెలిసింది. కాగా, జగన్ ఢిల్లీ పర్యటన రద్దు కావడానికి కారణం నిసర్గ తుపానే కారణమని వెల్లడైంది. ఈ పెనుతుపాను బుధవారం గుజరాత్, మహారాష్ట్రల మధ్య తీరాన్ని దాటే అవకాశాలుండటంతో.. ఆయా రాష్ట్రాల్లో పరిస్థితిని సమీక్షిస్తూ కేంద్ర హోం మంత్రి అమిత్ షా బిజీగా ఉన్నారని, అత్యవసర ఆదేశాలు జారీచేయాల్సి ఉండటంతో మిగతా అపాయింట్మెంట్లను ఆయన రద్దు చేసుకున్నారని, అందుకే ఏపీ సీఎం సైతం ఢిల్లీ పర్యటన వాయిదా వేసుకున్నట్లు కేంద్రవర్గాలు తెలిపాయి. తుపాను తర్వాత వీరి భేటీ జరిగే అవకాశముంది.












Click it and Unblock the Notifications