జగన్ పై డిప్యూటీ సీఎంకే నమ్మకం లేదు.. బాషాకు హైదరాబాద్లో ట్రీట్మెంట్.. టక్కుఠమారాలన్న సాయిరెడ్డి..
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కట్టడి చర్యలపై సీఎం జగన్ చేసుకుంటోన్న ప్రచారమంతా వట్టి బూటకమని మరోసారి రుజువైందని అంటుననారు ప్రతిపక్ష టీడీపీ నేతలు. క్వారంటైన్ సెంటర్లలో సౌకర్యాల లేమిపై చంద్రబాబు సంచలన వీడియో విడుదల చేయగా, కరోనా కాటుకు గురైన ఏపీ ఉపముఖ్యమంత్రిని మెరుగైన వైద్య సదుపాయాల కోసం హైదరాబాద్ తరలించడాన్ని మహిళా నేత అనిత ప్రశ్నించారు. చంద్రబాబు కుయుక్తులకు కాలం చెల్లిందంటూ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఎదురుదాడికి దిగారు.

స్విమ్స్ డైరెక్టర్ చెప్పినా..
ఏపీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, ఆయన భార్య,కుమార్తెలు కరోనా పాజిటివ్ గా తేలారు. తిరుపతిలోని స్విమ్స్లో డిప్యూటీ సీఎం కుటుంబానికి చికిత్స అందించారు. కానీ ఏదో తెలియని ఆందోళనతో ఆయన స్విమ్స్ లో ఉండబోనని మొండికేశారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ లోని ఓ కార్పొరేట్ ఆస్పత్రికి షిఫ్ట్ అయ్యారు. డిప్యూటీ సీఎం హెల్త్ కండిషన్ మెరుగ్గానే ఉందని స్విమ్స్ డైరెక్టర్ వెంగమ్మ చెప్పిన తర్వాత కూడా హైదరాబాద్ షిఫ్ట్ అయిపోవడం చర్చనీయాంశమైంది. ఈ వ్యవహారంపై సోషల్ మీడియాలోనూ ప్రశ్నలు, సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

ఏపీ ప్లాప్ అయిందనేగా..
డిప్యూటీ సీఎం, ఆయన కుటుంబానికి కరోనా వస్తే స్విమ్స్ నుంచి హైదరాబాద్ కు షిఫ్ట్ కావడమేంటి? అంటే, ఏపీలో ఎక్కడా తగిన సదుపాయాలు లేవానా? కరోనా చికిత్సలో ఏపీ ప్లాప్ అయిందా? ప్రభుత్వ ఏర్పాట్లపై ఉప ముఖ్యమంత్రికే భరోసా లేదంటే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటి? అని నెటిజన్లు ప్రశ్నించారు. దీనిపై టీడీపీ మహిళా నేత వంగలపూడి అనిత సైతం స్పందించారు. ‘‘డిప్యూటీ సీఎంకు కొవిడ్ సోకితే హైదరాబాద్ వెళ్లారు. అంటే, ఆంధ్రప్రదేశ్ లో సౌకర్యాలు, వైద్యం సరిగ్గా లేవనేకదా. క్వారంటైన్ సెంటర్లలో భోజనాలు నాసిరకంగా ఉన్నాయని వైసీపీకే చెందిన మరో ఎంపీ అన్నారు. పబ్లిసిటీకి వాస్తవానికి సంబంధం లేదు''అని అనిత ఎద్దేవా చేశారు.

పేషెంట్ల పేరుతో అవినీతి..
కరోనా వైరస్ కట్టడి, చికిత్స గురించి జగన్ సర్కారు పనంతా ప్రచారంలో మాత్రమే కనిపిస్తోందని, చేతల్లో సున్నా అని ప్రతిపక్ష నేత చంద్రబాబు మండిపడ్డారు. రాష్ట్రంలోని ఓ క్వారంటైన్ సెంటర్లో వాస్తవ పరిస్థితి ఇదీ అంటూ తన ట్విటర్ ఖాతాలో ఓ వీడియోను ఆయన పోస్ట్ చేశారు. ఆపద సమయంలో ప్రజలకు ప్రభుత్వం భరోసా కల్పించాల్సిందిపోయి.. క్వారంటైన్ కేంద్రాలను చూస్తే అభద్రతా భావం పెరిగేలా ఉన్నాయని మండిపడ్డారు. కరోనా పేషంట్ల పేరుతో జగన్ సర్కారు అవినీతికి పాల్పడుతోందని, జనం ప్రాణాలతో చెలగాలమాడుతున్నారని చంద్రబాబు ఆరోపించారు.

చంద్రబాబు టక్కుఠమారా..
కరోనా కట్టడిలో ఏపీ సర్కారు ఫెయిలైందన్న చంద్రబాబు విమర్శలకు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఘాటుగా సమాధానం చెప్పారు. విజన్ ప్లస్ యక్షన్ కలిస్తేనే వైఎస్ జగన్ అవుతారని, రాష్ట్రంలో 16 మెడికల్ కాలేజీలు, ఒక సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి, ఓ కేన్సర్ దవాఖానా, మానసిక వైద్య శాల, 11,197 విలేజ్ క్లినిక్స్ తెరిచిన ఘనత వైసీపీ సర్కారుకే దక్కుతుందన్నారు. వ్యవస్థలను నాశనం చేయడం చంద్రబాబుకు అలవాటైన పని అని, నిత్యం అనుకూల పత్రికలు, టీవీల్లో కనిపిస్తూ ఏదో పోరాటం చేస్తున్నట్లు బిల్డప్ ఇవ్వడం తప్ప బాబు చేసిందేమీ లేదని, ఇప్పుడాయన టక్కుఠమారాలన్నీ జనానికి తెలిసిపోయాయని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా పూర్తిగా అర్థమైందని సాయిరెడ్డి మండిపడ్డారు.
Recommended Video

కనీవినీ ఎరుగని రికార్డు..
ఆంధ్రప్రదేశ్ లో కరోనా బీభత్సం సృష్టిస్తోంది. రాష్ట్ర ఆరోగ్య శాఖ మంగళవారం వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల వ్యవధిలో రికార్డు స్థాయిలో 37 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజా మరణాలతో కలిపి రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 365కి పెరిగింది. సోమవారం కొత్తగా 1,935 మందికి కరోనా సోకగా, మొత్తం కేసుల సంఖ్య 31,103కి చేరింది.












Click it and Unblock the Notifications