రోజాకూ టిడిపి గాలం: మరోసారి నెహ్రూ కోసం, చినరాజప్ప కామెంట్
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యే రోజాకు కూడా గాలమేసినట్లు ప్రచారం సాగుతోంది. వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో సీనియర్ శాసనసభ్యుడు జ్యోతుల నెహ్రూను కూడా పార్టీలోకి రప్పించడానికి టిడిపి నాయకులు తీవ్రంగా ప్రయత్నించినట్లు తెలుస్తోంది.
వారిద్దరు సానుకూలంగా ప్రతిస్పందించకపోవడంతో మిగతా శాసనసభ్యులకు టిడిపి నేతలు గాలం వేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఎనిమిది మంది శానససభ్యులు టిడిపిలో చేరారని అంటున్నారు. తాజాగా, పిఎసి పదవి దక్కకపోవడంతో జ్యోతుల నెహ్రూ వైయస్ జగన్పై అసంతృప్తితో ఉన్నట్లు చెబుతున్నారు.

మరోసారి జ్యోతుల నెహ్రూకు గాలం వేయాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి చినరాజప్ప చేసిన వ్యాఖ్యలు కూడా అందుకు అనుగుణంగానే ఉన్నాయి. జ్యోతుల నెహ్రూపై ఆయన సానుకూలమైన ప్రకటన చేశారు. ప్రస్తుత వివాదానికి ముగింపు పలకడానికి రోజాను కూడా టిడిపి నేతలు పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్లు చెబుతున్నారు.
అసలు తనకు హోం మంత్రి పదవి దక్కిందంటే అది జ్యోతుల నెహ్రూ చలువేనని చినరాజప్ప అన్నారు. టిడిపిలో ఉండి ఉంటే ఆ పదవి జ్యోతుల నెహ్రూకు దక్కి ఉండేదని ఆయన అన్నారు. జ్యోతుల నెహ్రూను పక్కన పెట్టి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిని జగన్ పిఎసి చైర్మన్ పదవికి ఎంపిక చేయడంపై మంగళవారం శానససభ లాబీల్లో ఆసక్తికరమైన చర్చ సాగింది.
ఆ సందర్భంగానే చినరాజప్ప ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. గతంలో జ్యోతుల నెహ్రూ టిడిపిలోనే ఉన్నారని, ఆ తర్వాత మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో జ్యోతుల నెహ్రూ వైసిపిలో చేరి కీలక నేతగా ఎదిగారని ఆనయ అన్నారు. తన పదవి జ్యోతుల నెహ్రూదేనని ఆయన అన్నారు.
జ్యోతుల నెహ్రూ టిడిపిలో ఉండి ఉంటే తనకు ఆ పదవి దక్కి ఉండేది కాదని, ప్రజలకు మంచి చేయాలనే మాటను నమ్మి నెహ్రూ రాజకీయాలు చేస్తున్నారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications